News December 13, 2024
ఇవాళ స్కూళ్లకు సెలవు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో చిత్తూరు, అన్నమయ్య, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో తిరుపతి, అన్నమయ్య జిల్లాల్లోని విద్యాసంస్థలకు కలెక్టర్లు ఇవాళ సెలవు ప్రకటించారు. ఈ ఆదేశాలను యాజమాన్యాలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మరోవైపు భారీ వర్షాలు, వరదలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హోంమంత్రి అనిత సూచించారు.
Similar News
News October 18, 2025
మాక్ అసెంబ్లీ.. 21 నుంచి విద్యార్థుల ఎంపిక

AP: అమరావతిలో వచ్చే నెల 26న విద్యార్థులతో మాక్ అసెంబ్లీ నిర్వహించనున్నారు. అందుకోసం ఈ నెల 21, 22 తేదీల్లో 6-8 తరగతుల విద్యార్థులకు పాఠశాల స్థాయిలో వ్యాసరచన, ఉపన్యాస, క్విజ్ పోటీలు జరగనున్నాయి. 24, 25 తేదీల్లో మండలస్థాయి పోటీలు, ఈ స్థాయి నుంచి ఆరుగురిని సెలెక్ట్ చేసి 29, 30 తేదీల్లో నియోజకవర్గ లెవల్లో పోటీలు నిర్వహిస్తారు. మొత్తం 175 మందిని ఎంపిక చేసి అమరావతి అసెంబ్లీకి తీసుకెళ్తారు.
News October 18, 2025
ఆధార్, వెబ్ ల్యాండ్ ఆధారంగా రబీ ఎరువుల పంపిణీ

AP: రబీ సీజన్ ఎరువుల పంపిణీపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆధార్ నంబరు, వెబ్ ల్యాండ్లో రైతుకున్న భూకమతం ఆధారంగా.. పంటల వారీగా, అగ్రికల్చర్ యూనివర్సిటీ సిఫారసు మేరకు ఎరువులను అందిచనుంది. ఈ విషయాన్ని వ్యవసాయ శాఖ ఎక్స్అఫిషియో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజశేఖర్ వెల్లడించారు. రబీ సీజన్ సాగు సన్నద్ధత, ఎరువుల పంపిణీ అంశాలపై శుక్రవారం జిల్లాల వ్యవసాయ అధికారులతో సమావేశం నిర్వహించారు.
News October 18, 2025
Oct 28 నుంచి టెన్త్ పరీక్ష ఫీజు చెల్లింపు ప్రక్రియ

AP: వచ్చే ఏడాది జరగనున్న పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపు ప్రక్రియ ఈనెల 28 నుంచి ప్రారంభం కానుంది. ప్రతి విద్యార్థికి ఈసారి తప్పనిసరిగా అపార్ ఐడీ(ఆటోమేటెడ్ పర్మనెంట్ అకడమిక్ అకౌంట్ రిజిస్ట్రీ) అమలు చేయాలని విద్యాశాఖ నిర్ణయించింది. ఎవరికైనా లేకపోతే వెంటనే చేయించాలని ఇప్పటికే ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేసింది. అటు 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల కావాల్సి ఉంది.