News September 7, 2025
అమరావతికి వచ్చి చూస్తే తెలుస్తుంది: నారాయణ

AP: రాజధాని అమరావతిలో భవనాల పనులు వేగంగా జరుగుతున్నాయని మంత్రి నారాయణ తెలిపారు. IAS అధికారుల టవర్లు త్వరలోనే పూర్తవుతాయన్నారు. రోడ్లు, కాలువల పనులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. అమరావతి మునిగిపోయిందని, పనులు జరగట్లేదని కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఏసీ రూముల్లో కూర్చోకుండా ఇక్కడకు వచ్చి చూస్తే ఎంత మంది, ఎన్ని కంపెనీలు పని చేస్తున్నాయో తెలుస్తుందన్నారు.
Similar News
News September 7, 2025
ఇవాళ చంద్ర గ్రహణాన్ని చూడొచ్చా?

ఇవాళ ఏర్పడనున్న సంపూర్ణ చంద్రగ్రహణం ఇండియాలోనూ స్పష్టంగా కనిపిస్తుందని శాస్త్రవేత్తలు తెలిపారు. మీరు ఎలాంటి పరికరం లేకుండానే గ్రహణాన్ని నేరుగా చూడొచ్చని, బైనాక్యులర్ ఉంటే మరింత స్పష్టంగా కనిపిస్తుందని చెబుతున్నారు. రాత్రి 8.58 గంటలకు చంద్రగ్రహణం ప్రారంభమవుతుంది. 11గంటల నుంచి అర్ధరాత్రి 12.22గంటల వరకు సంపూర్ణ చంద్రగ్రహణం ఏర్పడనుంది. సోమవారం తెల్లవారుజామున 2.25 గంటల వరకు ఇది కొనసాగనుంది.
News September 7, 2025
హైదరాబాద్కు ‘గోదావరి’.. రేపు సీఎం శంకుస్థాపన

TG: మూసీ పునరుజ్జీవన పథకంలో భాగంగా గోదావరి డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ఫేజ్-2, 3లకు సీఎం రేవంత్ రేపు శంకుస్థాపన చేయనున్నారు. రూ.7,360 కోట్లతో చేపడుతున్న ఈ ప్రాజెక్టులో మల్లన్నసాగర్ నుంచి నీటిని ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాలకు తరలించనున్నారు. జీహెచ్ఎంసీ, ORR పరిధిలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, గ్రామపంచాయతీలకు తాగునీటి సరఫరాకు చేపట్టిన మరో ప్రాజెక్టును ఆయన ప్రారంభిస్తారు.
News September 7, 2025
కాంగ్రెస్ పాలనలో దీనస్థితికి గురుకులాలు: హరీశ్ రావు

TG: కాంగ్రెస్ పాలనలో గురుకులాలు దీనస్థితికి చేరడం శోచనీయమని మాజీ మంత్రి హరీశ్ రావు Xలో రాసుకొచ్చారు. విష జ్వరాలు, పాముకాట్లు, ఫుడ్ పాయిజన్ వంటి ఘటనలతో విద్యార్థులు ప్రాణాలు కోల్పోయే పరిస్థితి ఉందని విమర్శించారు. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ సిబ్బందికి రెండు నెలల జీతాలు ఇవ్వలేదని ఫైరయ్యారు. KCR హయాంలో గురుకులాలు దేశానికి ఆదర్శంగా నిలిస్తే రేవంత్ పాలనలో నరక కూపాలుగా మారాయని దుయ్యబట్టారు.