News August 24, 2024
జనగామ: పుట్టింటికి వెళ్లిన భార్య.. భర్త సూసైడ్

పురుగుమందు తాగి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన జనగామ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. తరిగొప్పుల మండలం జాలూబాయి తండాకు చెందిన సభావత్ సుమన్(26) అదే తండాకు చెందిన ఓ యువతితో మూడు నెలల కిందట వివాహం చేసుకున్నాడు. కొద్ది రోజులకే ఇద్దరి మధ్య కలహాలు రాగా భార్య పుట్టింటికి వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన సుమన్ శుక్రవారం ఉదయం పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కేసు నమోదు చేశారు.
Similar News
News March 11, 2025
వరంగల్ జిల్లాలో పెరుగుతున్న ఎండ తీవ్రత!

వరంగల్ జిల్లాలో ఎండ భగ్గుమంటోంది. జిల్లాలోని రైతులు, ఉద్యోగులు, ఇతర ప్రదేశాలకు ప్రయాణించేవారు ఎండ కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఇప్పుడే వడగాలులు మొదలవుతున్నాయి. జిల్లాలో ఈరోజు 32 నుంచి 36 డిగ్రీలు, రేపు 32-37 డిగ్రీల ఉష్ణోగ్రతలు ఉంటాయని వాతావరణ సూచికలు చెబుతున్నాయి. జిల్లాలో పలు చోట్ల ఇప్పటికే చెక్ డ్యామ్లు, బోరుబావులు ఎండిపోయాయి.
News March 11, 2025
వరంగల్: సాగునీటి నిర్వహణ సరఫరాపై జిల్లా అధికారులతో సమీక్ష

హైదరాబాద్ సచివాలయం నుంచి సాగునీటి నిర్వహణ సరఫరాపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్ రెడ్డి, ఇతర మంత్రులు వరంగల్ జిల్లా అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ సత్యశారద, జిల్లా అధికారులు పాల్గొన్నారు. నీటిపారుదల వ్యవసాయ విద్యుత్ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. పంటలకు సాగునీటి సరఫరాలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
News March 10, 2025
నర్సంపేట: అన్ని తామై.. అనాథ యువతుల పెళ్లిళ్లకు ఏర్పాట్లు

నర్సంపేటలోని సంజీవని అనాథాశ్రమంలో చిన్నప్పటి నుంచి ఆశ్రయం పొందిన రోజా, నాగరాణి అనే ఇద్దరు అనాథ యువతులకు ఈనెల 12న వివాహాలు జరగనున్నాయి. ఆ పెళ్లితంతులో భాగంగా సోమవారం అదే ఆశ్రమంలో ఇద్దరు యువతులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో వందలాది మంది మహిళల నడుమ మంగళస్నానాలు చేయించారు. ఏ లోటు లేకుండా పెళ్లిళ్లు జరపాలనే సేవాగుణాన్ని చాటుకోవడం పట్ల ఆశ్రమ నిర్వాహకుడు డా.మోహనరావును ఐసీడీఎస్ సీడీపీవో మధురిమ అభినందించారు.