Kurnool

News March 6, 2026

ఓపెన్ హౌస్‌లో పోలీసు ఆయుధాల ప్రదర్శన

image

కర్నూలు జిల్లా పోలీసు కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వారోత్సవాల సందర్భంగా విద్యార్థులకు ఓపెన్ హౌస్ కార్యక్రమం నిర్వహించారు. పోలీసు ఆయుధాల ప్రదర్శన ఏర్పాటు చేసి వాటి వినియోగం గురించి వివరించారు. మహిళల భద్రత కోసం అమలు చేస్తున్న శక్తి యాప్, హెల్ప్‌లైన్ నంబర్లపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సీఐ విజయలక్ష్మి, ఆర్‌ఐ జావేద్, ఎస్సైలు, ఎన్‌సీసీ విద్యార్థులు పాల్గొన్నారు.

News March 6, 2026

సీజనల్ వ్యాధులపై కలెక్టర్ సమీక్ష

image

కర్నూలు కలెక్టరేట్‌లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి జాయింట్ ఇన్స్పెక్షన్ కమిటీ సమావేశాన్ని కలెక్టర్ డా.ఏ.సిరి నిర్వహించారు. విద్యార్థులు సీజనల్ వ్యాధుల బారిన పడకుండా ప్రభుత్వ వసతి గృహాలు, పాఠశాలల్లో నీటి నమూనాలను 15 రోజులకు ఒకసారి సేకరించి పరీక్షించాలని ఆమె ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈని ఆదేశించారు. పరిశుభ్రమైన తాగునీరు అందించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.

News March 6, 2026

కర్నూలు జిల్లాలో ఇంటర్ పరీక్షలకు 262 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లా వ్యాప్తంగా శుక్రవారం జరిగిన ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 262 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా ఇంటర్ బోర్డు ప్రాంతీయ అధికారి లాలప్ప తెలిపారు. 10,709 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా, 10,447 మంది హాజరయ్యారని వెల్లడించారు. జిల్లాలోని అన్ని పరీక్షా కేంద్రాల్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోలేదని, పరీక్షలు అత్యంత ప్రశాంత వాతావరణంలో జరిగాయని ఆయన స్పష్టం చేశారు.

News March 6, 2026

వాట్సాప్ ద్వారా పదో తరగతి హాల్ టికెట్లు

image

పదో తరగతి హాల్ టికెట్లను విద్యార్థులు వాట్సాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చని DEO ఎల్.సుధాకర్ తెలిపారు. ఈనెల 16 నుంచి పరీక్షలు ప్రారంభం కానున్న నేపథ్యంలో, ‘మనమిత్ర’ మొబైల్ సంఖ్య 9552300009 నుంచి వీటిని పొందవచ్చన్నారు. ప్రభుత్వం విద్యార్థుల సౌలభ్యం కోసం ఈ విధానాన్ని అందుబాటులోకి తెచ్చిందని పేర్కొన్నారు. సాంకేతికతను ఉపయోగించుకుని హాల్ టికెట్లు సులభంగా పొందేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన వివరించారు.

News March 6, 2026

కర్నూలు జిల్లాలో 8 సమస్యాత్మక పరీక్ష కేంద్రాలు ఇవే

image

కర్నూలు జిల్లాలో ఈనెల 16 నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభంకానున్నాయి. 160 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా, 8 కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా తేల్చారు. గార్గేయపురం, వసంత నగర్, ఉలిందకొండ, సి.బెలగల్, దేవనకొండ, ఆస్పరి పరిధిలోని ప్రధాన పాఠశాలలు ఈ జాబితాలో ఉన్నాయి. పరీక్షల నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు. విద్యార్థులు ఎలాంటి ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు అధికారులు వెల్లడించారు.

News March 6, 2026

కర్నూలు: 37,331 పది విద్యార్థులకు బస్ ఫ్రీ

image

కర్నూలు జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణానికి అనుమతించాలని సంస్థ యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది. జిల్లా వ్యాప్తంగా 37,331 మంది విద్యార్థులు 160 కేంద్రాల్లో పరీక్షలకు హాజరు కానున్నారు. వీరందరికీ పరీక్షలు జరిగే ఈ నెల 16 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు పల్లె వెలుగు, అల్ట్రా డీలక్స్, ఆర్డీనరీ బస్సుల్లో ఈ సౌకర్యం ఉంటుంది.

News March 6, 2026

మహిళలను సన్మానించండి: కర్నూలు కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో మహిళా దినోత్సవ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. మహిళా పారిశ్రామిక వేత్తలు, వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు ప్రశంసా పత్రాలు అందచేసి సన్మానించాలని సూచించారు.

News March 5, 2026

కర్నూలు: 15న ఫైనల్ పరీక్ష

image

అక్షరాంధ్ర కార్యక్రమంలో భాగంగా కర్నూలు జిల్లాలో ఈనెల 15న ఫైనల్ పరీక్ష జరగనుంది. 1.61లక్షల మంది హాజరయ్యేలా చూడాలని కలెక్టర్ డా.ఏ.సిరి అధికారులను ఆదేశించారు. ఫైనల్ పరీక్షల నిర్వహణలో తీసుకోవాల్సిన చర్యలపై వయోజన విద్య, డీఆర్డీఏ, మెప్మా, ఐసీడీఎస్ తదితర శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. అందరూ ఉత్తీర్ణులు కావాలని ఆకాంక్షించారు.

News March 5, 2026

కర్నూలు: ఇంటర్ పరీక్షలకు 79 మంది డుమ్మా

image

కర్నూలు జిల్లాలో గురువారం ఇంటర్ ఓపెన్ స్కూల్ హిందీ, తెలుగు, ఉర్దూ పరీక్షలు జరిగాయి. 79 మంది విద్యార్థులు గైర్హాజరైనట్లు జిల్లా విద్యా శాఖ అధికారి ఎల్.సుధాకర్ తెలిపారు. 889మంది పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 810మంది వచ్చారు. ఫ్లయింగ్ స్క్వాడ్ 4 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసింది. డీఈవో 2 సెంటర్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.

News March 5, 2026

కర్నూలు జిల్లాకు అవార్డు రావాలి: కలెక్టర్

image

స్వచ్ఛ సర్వేక్షణ్ మార్గదర్శకాల అమలు, కార్యక్రమాల నిర్వహణపై కర్నూలు కలెక్టర్ డా.ఏ.సిరి మున్సిపల్ కమిషనర్లతో సమీక్ష నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. స్వచ్ఛ సర్వేక్షణ్‌లో గతేడాది వచ్చిన ర్యాంక్ కంటే ఈసారి మెరుగైన ఫలితాలు సాధించాలని చెప్పారు. కచ్చితంగా జిల్లాకు అవార్డులు వచ్చేలా పనిచేయాలని మున్సిపల్ కమిషనర్లను ఆదేశించారు. శానిటేషన్‌లో మెరుగుపడితే అవార్డులు వస్తాయని సూచించారు.