Nellore

News December 24, 2024

నెల్లూరు: ఈ-చలాన్లు చెల్లించని వారికి ALERT 

image

ఈ-చలాన్లు చెల్లించకుండా తిరుగుతున్న వాహనదారులపై హైకోర్టు ఆదేశాలతో కొరడా ఝుళిపించేందుకు నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు సిద్ధమయ్యారు. తక్షణమే చలాన్లు చెల్లించకపోతే వాహనాలను సీజ్ చేసే అవకాశం ఉంది. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకు పోలీసు అధికారులు ఈ చలాన్లు విధిస్తుంటారు. దీంతో నెల్లూరు ట్రాఫిక్ పోలీసులు మంగళవారం నుంచి నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. దీనిపై విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.

News December 24, 2024

క్రైస్తవ మతం 2వేల సంవత్సరాలకు పైగా ఉంది :కలెక్టర్

image

మానవ జీవితంలో ప్రతిఒక్కరూ ఐక్యత, ప్రేమ, దయతో నిజాయితీగా జీవించడమే క్రీస్తు బోధనల సారాంశమని జిల్లా కలెక్టర్‌ ఆనంద్‌ అన్నారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్‌లోని తిక్కన ప్రాంగణంలో జిల్లా మైనార్టీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్‌ వేడుకలు హైటీ కార్యక్రమాన్ని నిర్వహించారు. భారతదేశంలో క్రైస్తవ మతం సుమారు 2వేల సంవత్సరాలకు పైగా ఉందని కలెక్టర్ తెలిపారు.

News December 23, 2024

నెల్లూరు: మందల వెంకట శేషయ్య అరెస్ట్!

image

మాజీమంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్య అనుచరుడు, వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మందల వెంకటశేషయ్య అరెస్ట్ అయ్యారు. వెంకటాచలం పోలీస్ స్టేషన్లో నమోదు అయిన ఓ కేసులో పోలీసులు అరెస్ట్ చేశారు. వెంకటశేషయ్యను నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌లో ఉంచినట్లు సమాచారం. నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కి శేషయ్య కుటుంబ సభ్యులు, స్నేహితులు ఇప్పటికే చేరుకున్నట్లు సమాచారం. మరికొద్ది సేపట్లో కాకాణి చేరుకోనున్నారు.

News December 23, 2024

వచ్చే మూడేళ్లలో మున్సిపాలిటీల్లో పూర్తి వసతులు: నారాయణ

image

వచ్చే మూడేళ్లలో రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలలో పూర్తిస్థాయి మౌలిక వసతులు కల్పిస్తామని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. సోమవారం మౌలిక వసతుల్లో కల్పనపై అమరావతిలో వర్క్ షాప్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. దేశంలోనే ఉత్తమ మున్సిపాలిటీలు గల రాష్ట్రంగా ఏపీని తీర్చిదిద్దుతామన్నారు. మున్సిపాలిటీల అభివృద్ధి కోసం సంస్కరణలు తీసుకొస్తామన్నారు.

News December 23, 2024

ఇంటర్ ఫీజు చెల్లింపునకు తత్కాల్ పథకం

image

2025 మార్చి నెలలో జరగనున్న ఇంటర్ పబ్లిక్ పరీక్షల ఫీజు చెల్లించని విద్యార్థులు సౌకర్యార్థం ఈనెల 24 నుంచి 31 తేదీ వరకు తత్కాల్ పథకంలో చెల్లించవచ్చునని ఆర్ఐఓ డాక్టర్ ఏ. శ్రీనివాసులు తెలిపారు. 3000 రూపాయల అపరాధ రుసుముతో ఫీజు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఈ అవకాశాన్ని తల్లిదండ్రులు, విద్యార్థులు గమనించాల్సిందిగా ఆయన కోరారు.

News December 23, 2024

బాలాయపల్లిలో ఎర్రచందనం దొంగ అరెస్ట్

image

మూడు ఎర్రచందనం దుంగలు కలిగి ఉన్న ఒక వ్యక్తిని టాస్క్ ఫోర్సు పోలీసులు అరెస్టు చేశారు. తిరుపతి టాస్క్ ఫోర్స్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. హెచ్‌సీ సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. బాలాయపల్లి మండలం గంగరాజుపల్లి సమీపంలోని సున్నపురాళ్ల కోన వద్దకు చేరుకోగా ఒక వ్యక్తి అనుమానస్పదంగా కనిపించాడు. విచారించగా అతని వద్ద మూడు ఎర్రచందనం దుంగలు లభ్యమయ్యాయని, అతడిని అరెస్టు చేసినట్లు వెల్లడించారు.

News December 23, 2024

NLR: పాపం.. బిర్యానీలో విషం పెట్టి చంపేశారు..!

image

అందరూ అయ్యో పాపం అనేలా ఉమ్మడి నెల్లూరు జిల్లాలో సోమవారం దారుణ ఘటన వెలుగు చూసింది. సూళ్లూరుపేట గాండ్ల వీధి షార్ బ్రిడ్జి కింద పదుల సంఖ్యలో కుక్కలు చనిపోయాయి. ఎవరో కావాలనే బిర్యానీలో విషం పెట్టి కుక్కలను చంపేశారని స్థానికులు చెబుతున్నారు. వాటితో ఇబ్బంది ఉంటే పట్టుకెళ్లి దూరంగా వదిలేయాలి కానీ.. ఇలా విషం పెట్టి చంపడం ఘోరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

News December 23, 2024

నెల్లూరు: స్మార్ట్ మీటర్లకు డబ్బులు వసూలు చేస్తే చర్యలు 

image

నెల్లూరు జిల్లాలో ఏర్పాటు చేస్తున్న విద్యుత్ స్మార్ట్ మీటర్లకు వినియోగదారులు డబ్బులు చెల్లించనవసరం లేదని APSPDCL సర్కిల్ ఎస్ఈ విజయన్ తెలిపారు. ఉచితంగా మీటర్లను బిగిస్తామని ఆయన వెల్లడించారు. కొత్తగా విద్యుత్ సర్వీసు కనెక్షన్లు కావాలనుకునే వారు ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ నిర్దేశించిన రుసుం మాత్రమే చెల్లించాల్సి ఉంటుందన్నారు. సిబ్బంది అదనంగా నగదు వసూలు చేస్తే వారిపై చర్యలు తప్పవన్నారు.   

News December 23, 2024

నెల్లూరు: జికా వైరస్ ఎఫెక్ట్.. పెద్దాస్పత్రిలో వార్డు ఏర్పాటు

image

నెల్లూరు ప్రభుత్వ సర్వ జన ఆస్పత్రి (పెద్దాస్పత్రి)లో జికా వైరస్ బాధితుల కోసం ముందస్తుగా వార్డును ఏర్పాటు చేశారు. మర్రిపాడు మండలం వెంకటాపురంలో ఓ బాలుడికి జికా వైరస్ సోకినట్లు ముంబయిలోని ఓ ప్రైవేట్ ల్యాబ్ నిర్ధారించింది. వైద్యశాఖ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పెద్దాస్పత్రి పల్మనాలజీ విభాగంలోని ఒక ఫ్లోర్‌లో 5 పడకలతో ఒక వార్డును ప్రత్యేకంగా సిద్ధం చేశారు.

News December 23, 2024

నేడు నెల్లూరులో జాబ్ మేళా

image

నెల్లూరులోని వెంకటేశ్వరపురం ప్రభుత్వ బాలుర ఐటీఐలో ఇవాళ ఉదయం 9 గ.లకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ తెలిపారు. పలు ప్రముఖకంపెనీ ప్రతినిధులు హాజరై ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా చదివిన వారు అర్హులు అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు.