Nellore

News June 12, 2024

నెల్లూరు జిల్లా సీనియర్లకు నిరాశే!

image

ఉమ్మడి నెల్లూరు జిల్లాకు రెండు మంత్రి పదవులు దక్కిన విషయం తెలిసిందే. అయితే ఆశావహులుగా ఉన్న సీనియర్ నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, కురుగొండ్ల రామకృష్ణకు నిరాశే ఎదురైంది. మహిళా కోటా నుంచి వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి మంత్రి పదవి ఆశించినా దక్కలేదు.

News June 12, 2024

పొంగూరు నారాయణ, ఆనంకు మంత్రి పదవులు

image

ఉమ్మడి జిల్లా నుంచి ఇద్దరికి మంత్రి పదవులు వరించాయి. నెల్లూరు సిటీ ఎమ్మెల్యే పొంగూరు నారాయణ, ఆత్మకూరు ఎమ్మెల్యే ఆనం నారాయణరెడ్డికు కేబినెట్లో చోటు దక్కింది. మొత్తం 24 మంది మంత్రుల జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేయగా.. జనసేనకు 3, బీజేపీకి ఒకటి కేటాయించారు. గతంలో వీరు మంత్రులుగా పనిచేశారు. నారాయణ గత టీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేయగా.. ఆనం గత కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా చేశారు.

News June 11, 2024

చంద్రబాబు ప్రమాణస్వీకారానికి పక్కా ఏర్పాట్లు: వికాస్ మర్మత్

image

సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని ప్రత్యక్షంగా వీక్షించేందుకు జిల్లాలో ఎల్‌ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేసినట్లు ఇన్‌ఛార్జ్ కలెక్టర్ వికాస్ మర్మత్ తెలిపారు. మంగళవారం ఉదయం నెల్లూరు కార్పొరేషన్‌లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో చంద్రబాబు ప్రమాణ స్వీకార కార్యక్రమ ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించారు. ఎటువంటి ఇబ్బందులు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు.

News June 11, 2024

రూ.1200 కోట్ల విలువైన క్వార్ట్జ్ దోపిడీ

image

నెల్లూరు జిల్లాలో జరిగిన క్వార్ట్జ్ దోపిడీకి సంబంధించి 275 కేసులు నమోదు చేశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో వెంకటగిరి నియోజకవర్గంలోని సైదాపురం, సర్వేపల్లిలోని పొదలకూరు మండలాల్లో భారీ ఎత్తున మైనింగ్ జరిగింది. అక్రమ మైనింగ్ పై అప్పట్లో సత్యాగ్రహం చేపట్టిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి కూడా ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో రూ.1200 కోట్ల విలువైన క్వార్ట్జ్ ను అక్రమంగా తవ్వినట్లు గుర్తించారు.

News June 11, 2024

నెల్లూరు : తొలిసారి అసెంబ్లీకి ఐదుగురు

image

ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీ ఘనవిజయం సాధించింది. ఈ క్రమంలో జిల్లా నుంచి ఐదుగురు తొలిసారిగా ఎమ్మెల్యేలుగా ఎన్నికై అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారు. పొంగూరు నారాయణ గతంలో ఎమ్మెల్సీగా ఉన్నప్పటికీ ఎమ్మెల్యేగా మొదటిసారి గెలిచారు. ఆయనతో పాటు నెలవల విజయశ్రీ(సూళ్లూరుపేట), వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి(కోవూరు), కావ్యా కృష్ణారెడ్డి(కావలి), కాకర్ల సురేష్ (ఉదయగిరి) ఉన్నారు.

News June 11, 2024

నెల్లూరులో మూడు చోట్ల ఎల్ఈడీ స్క్రీన్లు

image

ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం కార్యక్రమాన్ని ప్రజలు తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఈ మేరకు నెల్లూరు నగర నియోజకవర్గానికి సంబంధించి కోటమిట్ట షాదీమంజిల్, నవాబుపేటలోని బీవీఎస్ ఉన్నత పాఠశాల, స్వతంత్ర పార్కులో ఏర్పాట్లు జరుగుతున్నాయి. కస్తూరిబా కళాక్షేత్రంలోనూ ఎల్ఈడీ స్క్రీన్ ఏర్పాటు చేయనున్నారు.

News June 11, 2024

పోస్టింగుల కోసం పోలీసుల పాట్లు ! .

image

కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో జిల్లాలో పోస్టింగ్ ల కోసం పోలీసు అధికారులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కానిస్టేబుళ్ల నుంచి సీఐల వరకు జిల్లాలో టీడీపీ నేతలను ప్రసన్నం చేసుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. గతంలో ఏమైనా పొరపాట్లు చేసుంటే మన్నించాలని, ఒక్క అవకాశం ఇస్తే చెప్పినట్టు వింటామంటూ ప్రయత్నాల్లో నిమగ్నమయ్యారు. వచ్చే వారంలో అధికారుల బదిలీలు జరిగే అవకాశం కనిపిస్తోంది.

News June 11, 2024

ఎన్డీఏ సమావేశంలో నెల్లూరు ఎమ్మెల్యేలు

image

విజయవాడలోని ఏ కన్వెన్షన్ లో ఎన్డీఏ శాసనసభ పక్ష సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశానికి ఆత్మకూరు, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యేలు ఆనం రామ నారాయణ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు. గత అసెంబ్లీలో వైసీపీ ఎమ్మెల్యేలుగా ఉన్న ఆనం, కోటంరెడ్డి ఇప్పుడు టీడీపీ సభ్యులుగా విజయం సాధించి సభలో అడుగుపెట్టబోతున్నారు.

News June 11, 2024

దగదర్తిలో విమానం దిగేనా ! 

image

దగదర్తిలో ఎయిర్ పోర్టు నిర్మాణం పదేళ్లుగా హామీగా మిగిలిపోయింది. 2014-19 మధ్య కాలంలో అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఎయిర్ పోర్టు నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. ఆ తర్వాత ప్రభుత్వం మారింది. వైసీపీ హయాంలోనూ పనులు చేపట్టలేదు. ఇప్పుడు టీడీపీ అధికారంలోకి రావడం, ఆ పార్టీ ఎంపీ రాంమోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి కావడంతో దగదర్తి ఎయిర్ పోర్టు కల సాకారం కావాలని జిల్లా వాసులు కోరుకుంటున్నారు.

News June 11, 2024

నెల్లూరు జిల్లాలో మంత్రి పదవులపై తీవ్ర ఉత్కంఠ

image

కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో మంత్రి పదవులపై నెల్లూరు జిల్లాలో ఉత్కంఠ నెలకొంది. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి సీనియర్‌ నేతలుగా గుర్తింపు పొందగా.. పొంగూరు నారాయణ అధిష్ఠానానికి అత్యంత సన్నిహితుడిగా ఉన్నారు. మహిళా కోటలో వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి పేరు వినిపిస్తోంది. కాగా ముగ్గురికి మంత్రి పదవులు రావొచ్చని తెలుస్తోంది.