Vizianagaram

News July 24, 2024

ఢిల్లీ చేరుకున్న ఉమ్మడి విజయనగరం వైసీపీ నేతలు

image

రాష్ట్రంలో హత్యా రాజకీయాలతో కూటమి ప్రభుత్వం దమన కాండ చేస్తోందన్న ఆరోపణలతో ఢిల్లీలో నిరసనకు వైసీపీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం పీడిక రాజన్నదొర, రాజాం మాజీ ఎమ్మెల్యే కంబాల జోగులు తదితరులు ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో భేటీ అయ్యారు. వారి వెంట నెక్కల నాయుడు బాబు, కేవీ సూర్యనారాయణ రాజు ఉన్నారు.

News July 24, 2024

VZM: వరి మడిలో మహిళ అనుమానాస్పద మృతి

image

వరి మడిలో మహిళ అనుమాస్పదస్థితిలో మృతి చెందిన ఘటన మెరకముడిదాం మండలంలో చోటుచేసుకుంది. ఊటపల్లికి చెందిన బొత్స హైమావతి, ఆమె భర్త వేరు వేరుగా పొలానికి వెళ్లారు. వరి మడిలో పని చేస్తుండగా హైమావతి మూర్ఛ వచ్చి మృతి చెందింది. సమాచారం అందుకున్న చీపురుపల్లి సీఐ షణ్ముఖరావు ఘటనా స్థలాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తండ్రి ఫిర్యాదుతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశామని ఎస్ఐ లోకేశ్ తెలిపారు.

News July 24, 2024

VZM: ముద్రా రుణాలు.. గతేడాది ఎంతమందికి ఇచ్చారంటే?

image

కేంద్ర బడ్జెట్‌లో ముద్రా రుణ పరిమితిని రూ.20 లక్షల వరకు పెంచిన సంగతి తెలిసిందే. గత ఆర్థిక సంవత్సరంలో విజయనగరం జిల్లాలో 57,066 మందికి రూ.480.45 కోట్లు, పార్వతీపురం మన్యం జిల్లాలో 13,923 కోట్లు ముద్రా రుణాలు ఇచ్చారు. త్రీ, ఫోర్ వీలర్ కొనుగోలు, జిమ్, బ్యూటీ పార్లర్, షాపులు, తయారీ, ట్రేడింగ్, సేవారంగాల్లో రుణాలు ఇస్తారు. అర్హత, వ్యాపారాలను బట్టి రూ.50 వేల నుంచి లోన్‌కు అప్లే చేసుకోవచ్చు.

News July 24, 2024

గంజాయి నిర్మూలనకు కఠిన చర్యలు: ఎస్పీ

image

గంజాయిని సమూలంగా నిర్మూలించేందుకు కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందల్ సిబ్బందిని ఆదేశించారు. విజయనగరం 2వ పట్టణ పోలీసు స్టేషన్‌ను ఆయన మంగళవారం సందర్శించారు. కేసుల పురోగతిని తెలుసుకున్నారు. గంజాయి వినియోగదారులు ఎక్కువగా పట్టణ శివార్లలో నివసిస్తున్నారని, వారిని అదుపు చేసేందుకు చర్యలు చేపట్టాలని సూచించారు. విజిబుల్ పోలీసింగ్ నిర్వహించి, ప్రజలకు రక్షణ చట్టాల పట్ల అవగాహన కల్పించాలన్నారు.

News July 23, 2024

డిగ్రీ ప్రత్యేక విభాగాల విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన ప్రారంభం

image

డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసిన స్పెషల్ కేటగిరి విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన డాక్టర్ వి.ఎస్ కృష్ణ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం ప్రారంభమైంది. దృవపత్రాల పరిశీలన 23, 24, 25 తేదీలలో జరుగుతుందని, ప్రవేశాల కోఆర్డినేటర్ డి.రమేశ్ తెలియజేశారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, ఉభయ గోదావరి జిల్లాల విద్యార్థులకు ధ్రువపత్రాల పరిశీలన చేస్తామన్నారు.

News July 23, 2024

ఆ స్థలాలు రామతీర్థం దేవస్థానానివే: రెవెన్యూ అధికారులు

image

ఆలయం చుట్టూ ఉన్న స్థలాలు దేవాదాయ శాఖకు చెందినవేనని రెవెన్యూ అధికారులు తేల్చారు. ఆలయం వద్ద అభివృద్ధి పనులు చేపట్టడానికి అధికారులు సన్నాహాలు చేస్తుండగా స్థానిక దుకాణదారులు అడ్డగించారు. దీంతో పూర్తిస్థాయిలో సర్వేచేసి, తమ స్థలం అప్పగించాలని ఇటీవల రెవెన్యూ అధికారులకు లేఖ రాశారు. స్పందించిన రెవెన్యూ అధికారులు సోమవారం సర్వేచేసి, ఆలయం చుట్టూ స్థలం, కోనేరు దేవస్థానానికి చెందినట్లు తేల్చారు.

News July 23, 2024

విజయనగరంలో జాబ్ మేళా

image

విజయనగరం ప్రభుత్వ ఐటీఐ కాలేజీలో ఈనెల26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధికల్పన అధికారి డి.అరుణ వెల్లడించారు. అభ్యర్థుల వయస్సు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలని, పదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలని పేర్కొన్నారు. ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ.17 నుంచి రూ.19 వేల వ‌ర‌కు జీతం, ఈ.ఎస్.ఐ., పి.ఎఫ్., మెడికల్, ఓ.టి. వంటి ఇతర సౌకర్యాలను వర్తింపజేస్తారన్నారు. స్త్రీ, పురుష అభ్యర్థులు అర్హులన్నారు.

News July 23, 2024

విశాఖ- కిరండూల్ రైలు దారి మళ్లింపు

image

భారీ వర్షాల కారణంగా కొత్తవలస- కిరండూల్ మార్గంలో నడిచే పలు రైళ్లను దారి మళ్లించారు. విశాఖ- కిరండూల్ (18514), కిరండూల్- విశాఖ(18513) రైలు విజయనగరం, రాయగడ, కొరాపుట్ మీదుగా దంతెవాడ చేరుకుంటుందని తెలిపారు. తిరిగి అదే మార్గంలో విశాఖ వైపు వెళ్తుందని వాల్తేరు డివిజనల్ వాణిజ్య మేనేజర్ కె.సందీప్ వెల్లడించారు. విశాఖ- కిరండూల్ పాసింజర్ దంతెవాడ వరకు మాత్రమే రాకపోకలు సాగిస్తుందన్నారు.

News July 23, 2024

VZM: ‘పాఠశాలలకు సెలవు ప్రకటించాలని డిమాండ్’

image

రానున్న మూడు రోజుల పాటు జిల్లాలో భారీ వర్ష సూచన ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సెలవు ప్రకటించాలని విద్యార్థుల తల్లిదండ్రులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు ప్రకటించారని, అలాగే విజయనగరం జిల్లాలో కూడా సెలవు ప్రకటించాలని కోరుతున్నారు.

News July 23, 2024

మూడు రోజుల పాటు భారీ వర్షాలు: విజయనగరం కలెక్టర్

image

జిల్లాలో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపిందని కలెక్టర్ డా బి.ఆర్ అంబేడ్కర్ తెలిపారు. భారీ వర్ష సూచన దృష్ట్యా ప్రజలు, ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురు గాలులు బలంగా వీచే అవకాశం ఉన్నందున బహిరంగ ప్రదేశాల్లో, చెట్లు, విద్యుత్ స్తంభాల కింద తలదాచుకోకుండా జాగ్రత్త వహించాలని సూచించారు.