news

News September 18, 2024

నేడు ఏపీ ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం

image

AP: రాష్ట్రంలో నేడు ఎన్డీఏ శాసనసభాపక్ష సమావేశం జరగనుంది. మంగళగిరిలోని సీకే కన్వెన్షన్‌ సెంటర్‌లో జరిగే ఈ సమావేశానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర చీఫ్ పురందీశ్వరి, మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఏపీలో ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి కావడంతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చించే అవకాశముంది. MLAల పనితీరు, భవిష్యత్తు కార్యచరణపై సీఎం దిశానిర్దేశం చేయనున్నారు.

News September 18, 2024

ఆ కారణంతో రాబోయే 25 ఏళ్లలో 3.9 కోట్ల మంది మృతి!

image

వైద్యానికి లొంగని సూపర్ బగ్స్ లేదా యాంటీ మైక్రోబియల్ రెసిస్టెన్స్(AMR) వల్ల గత 31 ఏళ్లలో 10 లక్షల మంది మరణించారని ఓ గ్లోబల్ సర్వే పేర్కొంది. రాబోయే 25 ఏళ్లలో ఈ సంఖ్య 3.9 కోట్లకు పైగా ఉండొచ్చని అంచనా వేసింది. ముఖ్యంగా భారత్, పాకిస్థాన్, బంగ్లాదేశ్‌ తదితర దక్షిణాసియా దేశాల్లో సుమారు 1.18 కోట్ల మంది మరణిస్తారని హెచ్చరించింది. వైద్యరంగంలో ఎంతో సాంకేతికత సాధించినా AMR ఇప్పటికీ సవాల్‌గానే ఉంది.

News September 18, 2024

రూ.లక్ష కడితే టీడీపీలో శాశ్వత సభ్యత్వం: చంద్రబాబు

image

AP: ₹లక్ష చెల్లించిన వారికి TDP శాశ్వత సభ్యత్వం కల్పిద్దామని పార్టీ నేతలతో CM చంద్రబాబు అన్నారు. లక్ష మంది సభ్యులు చేరితే, వచ్చిన డబ్బును కార్యకర్తల సంక్షేమానికి ఉపయోగించవచ్చని తెలిపారు. పలువురు నేతలతో నిన్న ఆయన సమావేశమయ్యారు. కార్యకర్తలకు లబ్ధి చేకూరేలా కార్యాచరణ రూపొందిస్తున్నట్లు చెప్పారు. గత 100 రోజుల్లో ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంపై దిశానిర్దేశం చేశారు.

News September 18, 2024

మండుతున్న ఎండలు.. 40.1 డిగ్రీల ఉష్ణోగ్రత

image

రెండు వారాల క్రితం తెలుగు రాష్ట్రాలను వరదలు ముంచెత్తగా ఇప్పుడు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. నిన్న ఏపీలోని కావలిలో 40.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నైరుతి గాలులు పూర్తిగా పొడిగా మారడం, మేఘాలు లేకపోవడంతో ఎండ తీవ్రత పెరుగుతోంది. ఏసీ, ఫ్యాన్లు లేకుండా ఉండలేకపోతున్నామని, వేసవి పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు చెబుతున్నారు.

News September 18, 2024

పంటల వారీగా నష్టపరిహారం ఇలా..

image

AP: నీట మునిగిన పంటలకు CM చంద్రబాబు పరిహారం ప్రకటించారు. హెక్టార్ల ప్రకారం తమలపాకు తోటలకు ₹75వేలు, అరటి, పసుపు, మిరప, జామ, నిమ్మ, మామిడి, కాఫీ, సపోటా తదితర తోటలకు ₹35వేలు, పత్తి, వేరుశనగ, వరి, చెరకు, టమాటా, పువ్వులు, ఉల్లి, పుచ్చకాయ పంటలకు ₹25వేలు, సజ్జలు, మినుములు, మొక్కజొన్న, రాగులు, కందులు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, కొర్రలు, సామలకు ₹15వేలు, ఆయిల్‌పామ్, కొబ్బరిచెట్లకు ఒక్కోదానికి ₹1,500.

News September 18, 2024

వారికి రూ.3వేల నిరుద్యోగ భృతి!

image

AP: రాష్ట్రంలో వేద విద్యను అభ్యసించి నిరుద్యోగులుగా ఉన్నవారికి రూ.3,000 నిరుద్యోగ భృతి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలుస్తోంది. నిరుద్యోగుల వివరాలను పంపాలని అన్ని జిల్లాల దేవాదాయశాఖ అధికారులకు ఎండోమెంట్ కమిషనర్ ఈ నెల 17న మెమో పంపినట్లు సమాచారం. అయితే ఆ మెమోలో ఈ నెల 16లోపు పంపాలని పేర్కొన్నారు. దీనిపై ప్రభుత్వం నుంచి క్లారిటీ రావాల్సి ఉంది.

News September 18, 2024

ఆకట్టుకుంటున్న ‘దేవర’ కొత్త పోస్టర్లు

image

‘దేవర’ మూవీ నుంచి తాజాగా విడుదలైన పోస్టర్లు ఆకట్టుకుంటున్నాయి. గత కొన్ని రోజులుగా మూవీ టీమ్ రిపీటెడ్ పోస్టర్స్ రిలీజ్ చేస్తోందని ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మూవీ టీమ్ కొత్త పోస్టర్లను రిలీజ్ చేసింది. మరోవైపు నిన్న చెన్నైలో ప్రమోషనల్ ఈవెంట్ నిర్వహించారు. ప్రమోషన్స్ కోసం ఎన్టీఆర్ రేపు చండీగఢ్‌కు, ఈనెల 23న అమెరికా వెళ్తారని సమాచారం. ఈలోగా 22న HYDలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండనుంది.

News September 18, 2024

రైల్లో ఫుడ్ డెలివరీ.. మరిన్ని స్టేషన్లలో ‘జొమాటో’ సేవలు

image

రైలు ప్రయాణికులకు ZOMATO తన సేవలను విస్తరించింది. ట్రైన్‌లో ఉండగా ఫుడ్ ఆర్డర్ చేస్తే సీట్ల వద్దకే డెలివరీ చేస్తోంది. 2023లో 5 ప్రధాన రైల్వే స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులోకి రాగా, ప్రస్తుతం దేశవ్యాప్తంగా 100 స్టేషన్లలో అందిస్తోంది. ఇప్పటివరకు 10లక్షల ఆర్డర్లు డెలివరీ చేసింది. వెయిటింగ్ ప్యాసింజర్లకూ ఈ సేవలను అందిస్తోంది. ప్రయాణికులు తమకు నచ్చిన రెస్టారెంట్ నుంచి నచ్చిన ఫుడ్‌ను ఆర్డర్ చేయవచ్చు.

News September 18, 2024

ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం: మంత్రి శ్రీధర్ బాబు

image

TG: రాష్ట్రంలో ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ సౌకర్యం కల్పిస్తామని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. సంగుపేట(సంగారెడ్డి), మద్దూరు(నారాయణ పేట), అడవి శ్రీరాంపూర్(పెద్దపల్లి) గ్రామాల్లో ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేయనున్నట్లు మీడియాతో చెప్పారు. ఇంటర్నెట్‌తో పాటు కేబుల్ టీవీ సేవలు, 20 MBPS అపరిమిత డేటా ఆప్టికల్ ఫైబర్ ద్వారా అందిస్తామన్నారు. ఇప్పటి వరకు 8వేల గ్రామాలకు ఫైబర్ కేబుల్ ఏర్పాటు చేశామని వెల్లడించారు.

News September 18, 2024

‘హిరోషిమా’పై జేమ్స్ కామెరూన్ మూవీ?

image

వరల్డ్ వార్-2లో హిరోషిమా, నాగసాకిలపై US అణుబాంబులతో దాడి చేసినప్పుడు జపాన్ ఇంజినీర్ సుటోము యమగుచి ప్రాణాలతో బయటపడ్డారు. ఆయన జీవితంపై US రచయిత చార్లెస్ ‘లాస్ట్ ట్రైన్ ఫ్రమ్ హిరోషిమా’ అనే బుక్ రాశారు. అదే పేరుతో హాలీవుడ్ డైరెక్టర్ జేమ్స్ కామెరూన్ సినిమా చేస్తారని టాక్. అవతార్ 3, 4, 5 చిత్రాల తర్వాత చేస్తారా? లేక ముందే తీస్తారా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.