News November 20, 2024

1000మంది ఉద్యోగుల్ని స్పెయిన్‌ పంపించిన చెన్నై కంపెనీ!

image

చెన్నైకు చెందిన రియల్ ఎస్టేట్ సంస్థ కాసాగ్రాండ్ తమ ఉద్యోగులు 1000 మందికి బంపరాఫర్ ఇచ్చింది. అన్ని ఖర్చుల్నీ భరిస్తూ స్పెయిన్‌కు వారం రోజుల టూర్‌కు పంపించింది. ఉద్యోగులకు ప్రోత్సాహాన్నిచ్చేందుకు 2013లో తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది. అప్పటి నుంచి అనేక దేశాలకు ఉద్యోగుల్ని పంపించామని తెలిపింది. కరోనా సమయంలోనూ ఈ సంప్రదాయాన్ని కొనసాగించడం గమనార్హం.

News November 20, 2024

టాలీవుడ్‌లోకి క్రికెటర్ చాహల్ భార్య ఎంట్రీ?

image

భారత స్టార్ క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ భార్య ధనశ్రీ వర్మ తెలుగు సినిమాలో నటించనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ సర్కిళ్లలో ఈ విషయం చక్కర్లు కొడుతోంది. త్వరలో షూటింగ్ ప్రారంభమయ్యే ఓ పెద్ద సినిమాలో ఆమె కీలక పాత్ర పోషించనున్నట్లు సమాచారం. రియాల్టీ, డాన్స్ షోల ద్వారా ధనశ్రీ పాపులర్ అయ్యారు.

News November 20, 2024

ఇన్వెస్టర్లకు నితిన్ కామ‌త్‌ హెచ్చరిక

image

ట్రేడింగ్ పేరుతో న‌కిలీ యాప్‌, వెబ్‌సైట్‌ల ఆగ‌డాలు పెరుగుతుండ‌డంతో జాగ్ర‌త్త‌గా ఉండాలని ఇన్వెస్ట‌ర్లను జిరోదా కో-ఫౌండ‌ర్ నితిన్ కామ‌త్ హెచ్చ‌రించారు. ఇలాంటి ఉదంతాల గురించి చ‌ద‌వ‌ని, విన‌ని రోజ‌ంటూ లేద‌ని పేర్కొన్నారు. అందువ‌ల్ల పెట్టుబ‌డులు పెట్టేట‌ప్పుడు ఆత్రుతపడకుండా ఆయా వేదికలను ధ్రువీకరించుకోవాలని సూచించారు. మరీ ఆక‌ర్ష‌ణీయ ప్ర‌క‌ట‌న‌లు క‌చ్చితంగా న‌కిలీవి అయ్యుంటాయ‌ని హెచ్చ‌రించారు.

News November 20, 2024

TIMES NOW-JVC: మహాయుతిదే మహారాష్ట్ర

image

మహారాష్ట్రలో మహాయుతి 150-167 స్థానాలతో మరోసారి అధికారం చేపడుతుందని టైమ్స్ నౌ-JVC సర్వే అంచనా వేసింది. MVA 107-125, ఇతరులు 13-14 సీట్లకు పరిమితం అవుతారని వెల్లడించింది. మరోవైపు దైనిక్ భాస్క‌ర్ MVAకి అత్యధిక సీట్లు వస్తాయని పేర్కొంది. MVA 135-150 సీట్లు, మ‌హాయుతికి 125-140 సీట్లు ద‌క్కుతాయ‌ని వెల్లడించింది. ఇత‌రులు 20 నుంచి 25 స్థానాల్లో గెలిచే అవకాశం ఉంద‌ని తెలిపింది.

News November 20, 2024

ఏపీ క్యాబినెట్ కీలక నిర్ణయాలు

image

✒ అమరావతి పనులకు కొత్తగా టెండర్లు
✒ రూ.85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి SIPB నిర్ణయాలకు ఆమోదం
✒ పీడీ యాక్ట్ పటిష్ఠం చేసే సవరణ బిల్లు, లోకాయుక్త సవరణ బిల్లు, ఆలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించే చట్టసవరణ బిల్లుకు ఆమోదం
✒ కర్నూలులో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
✒ ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం
✒ కాంట్రాక్టర్లకు మొబిలైజేషన్ అడ్వాన్స్‌ల పునరుద్ధరణ

News November 20, 2024

చిన్నారులపై లైంగికదాడులు.. కలెక్టర్ కన్నీళ్లు

image

AP: కాకినాడలో విద్యార్థినులను వేధించిన టీచర్, చిన్నారులపై అఘాయిత్యాలపై మాట్లాడుతూ కలెక్టర్ షాన్ మోహన్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ‘కీచక టీచర్ల గురించి తెలిసికూడా చెప్పకపోతే తప్పు. చేజేతులా పిల్లల జీవితాలను నాశనం చేసినవారవుతారు. నా పేరెంట్స్ టీచర్లు. వాళ్లు కష్టపడి నన్ను ఇంతదాకా తీసుకొచ్చారు. వాళ్లు స్కూల్‌లో డ్యూటీ చేయకపోయినా, వాళ్ల వల్ల పిల్లలు చెడిపోయినా ఆ పాపం మాకు వచ్చేది’ అని పేర్కొన్నారు.

News November 20, 2024

గంభీర్ ఎక్కువ కాలం ఉండకపోవచ్చు: సైమన్ డౌల్

image

భారత కోచ్‌గా గంభీర్ ఎక్కువ కాలం కొనసాగకపోవచ్చని న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ సైమన్ డౌల్ అభిప్రాయపడ్డారు. గ్రెగ్ చాపెల్ కంటే తక్కువ కాలంలోనే ఉద్వాసనకు గురవుతారని అన్నారు. ‘గంభీర్‌కు అసహనం ఎక్కువ. BGTలో ఎలా ఆడాలన్నదానిపై ఆటగాళ్లను కూర్చోబెట్టి మాట్లాడటం కీలకం. ఈ సిరీస్‌లో ఫలితాలు బాగుంటే ఓకే. ఒకవేళ భారత్ 1-4 లేదా 0-5 తేడాతో ఓడిపోతే ఆయన కోచ్‌గా కొనసాగేది అనుమానమే’ అని స్పష్టం చేశారు.

News November 20, 2024

రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (1)

image

‘బిట్‌కాయిన్ స్కామ్’ చిన్నదేం కాదు! దీని విలువ ఏకంగా రూ.6600 కోట్లు. మహారాష్ట్ర, పంజాబ్‌లో 40 FIRs నమోదయ్యాయి. 2018లో పుణేలో కేసు నమోదవ్వగానే మాస్టర్ మైండ్ అమిత్ భరద్వాజ్ దుబాయ్‌కు పారిపోయారు. 2022 JANలో ఆయన మరణించారు. దీంతో కుటుంబం మొత్తంపై 2024లో ED ఛార్జిషీట్ వేసింది. 2017లో ఆయన కంపెనీ వేరియబుల్ టెక్ మల్టీలెవల్ మార్కెటింగ్ విధానంలో రూ.6600 కోట్ల BTCలను కలెక్ట్ చేసింది. ఆ తర్వాతేం జరిగిందంటే..

News November 20, 2024

రూ.6600 కోట్ల బిట్‌కాయిన్ స్కామ్.. మలుపు మలుపుకో ట్విస్ట్ (2)

image

సాధారణంగా బిట్‌కాయిన్లను వ్యాలెట్లో స్టోర్ చేస్తారు. దర్యాప్తులో తేలిందేమిటంటే రూ.6600 కోట్ల BTCలు అసలు వ్యాలెట్ నుంచి మాయమయ్యాయి. ఇద్దరు పోలీసాఫీసర్లు వీటిని మరో వ్యాలెట్లోకి బదిలీ చేశారని తెలిసింది. మొత్తంగా ఈ స్కామ్‌లో 2 లేయర్లు ఉన్నాయి. మొదటి దాంట్లో అమిత్ వంటివాళ్లు, రెండో దాంట్లో గౌరవ్ మెహతా, సుప్రియా సూలె, నానా పటోలే వంటి నేతలు ఉన్నారని ఆరోపణ. డబ్బులున్న వ్యాలెట్ వీరికి తెలుసని సమాచారం.

News November 20, 2024

AXIS MY INDIA: ఝార్ఖండ్ ‘ఇండియా’దే

image

ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమి మరోసారి అధికారాన్ని నిలబెట్టుకుంటుందని AXIS MY INDIA అంచనా వేసింది. ఇండియా 53, ఎన్డీఏ 25, అదర్స్ 3 సీట్లు గెలుస్తాయని పేర్కొంది.