News March 29, 2024

10 సీట్లు కొట్టాల్సిందేనంటున్న కమలం పార్టీ

image

తెలంగాణలో కచ్చితంగా 10 ఎంపీ సీట్లు గెలవాలని బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. గత పార్లమెంట్ ఎన్నికలతో పోలిస్తే ఈసారి ఓటు బ్యాంక్ భారీగా పెరిగినట్లు భావిస్తోంది. పక్కాగా 10 సీట్లు, 35% ఓట్లు వచ్చే విధంగా పని చేయాలని అగ్రనాయకత్వం రాష్ట్ర నేతలకు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. ప్రధాని మోదీ చరిష్మాతో పాటు అయోధ్య రామమందిరం బాగా కలిసొస్తాయని కమలం పార్టీ అంచనా వేస్తోంది.

News March 29, 2024

లండన్ మేయర్‌పై కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు

image

లండన్ మేయర్ సాదిక్ ఖాన్‌పై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ కెవిన్ పీటర్సన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ‘లండన్‌లో ఖరీదైన వాచ్ పెట్టుకోలేం. చేతిలో ఫోన్‌తో నడవలేం. మహిళల ఆభరణాలు, బ్యాగుల్ని కూడా తస్కరిస్తున్నారు. కార్లను పగలగొట్టి చోరీలు చేస్తున్నారు. సాదిక్ తాను సృష్టించిన దానిపట్ల గర్వంగా ఉన్నారేమో’ అని అన్నారు. ఇస్లామిక్ దేశాల నుంచి భారీగా శరణార్థుల్ని లండన్‌కు రప్పించారన్న ఆరోపణలు సాదిక్‌పై ఉన్నాయి.

News March 29, 2024

‘డ్రగ్స్’తో మా కుటుంబానికి సంబంధం లేదు: పురందీశ్వరి

image

AP: వైజాగ్‌లో ఇటీవల పట్టుబడిన డ్రగ్స్‌తో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని ఏపీ బీజేపీ చీఫ్ పురందీశ్వరి తెలిపారు. ‘వైఎస్ జగన్ ప్రజలకు ఏం చేశారో చెప్పుకోలేని స్థితిలో నాపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు. ప్రజల్ని ఇలాంటి వ్యాఖ్యలతో మభ్యపెట్టకుండా వారికి మీరేం చేశారో చెప్పండి. ఈ తరహా దుష్ప్రచారాలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారు’ అని పేర్కొన్నారు.

News March 29, 2024

రేపే పిఠాపురానికి పవన్

image

AP: జనసేనాని పవన్ కళ్యాణ్ రేపు పిఠాపురానికి 3రోజుల పర్యటనకు రానున్నారు. ఆయన అక్కడి నుంచే బరిలో దిగనున్న సంగతి తెలిసిందే. పట్టణానికి చేరుకోగానే తొలుత శక్తిపీఠాన్ని సందర్శించి, పాదగయ క్షేత్రంలో పూజలు చేస్తారని జనసేన వర్గాలు తెలిపాయి. వారాహి వాహనానికి కూడా ప్రత్యేక పూజలు జరిపించిన అనంతరం ప్రచారం మొదలుపెడతారని పేర్కొన్నాయి. అక్కడి పర్యటన నుంచి పవన్ ఉత్తరాంధ్రలో పర్యటించనున్నట్లు వెల్లడించాయి.

News March 29, 2024

రష్యాలో జర్నలిస్టుకు రెండేళ్ల జైలు.. ఎందుకంటే!

image

ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధాన్ని తీవ్రంగా విమర్శించిన మిఖాయిల్ ఫెల్డ్‌మాన్ అనే జర్నలిస్టుకు రష్యా కోర్టు రెండేళ్ల జైలు శిక్ష విధించింది. ఆయన సహా ఐదుగురు పాత్రికేయుల్ని గత 2 రోజుల్లో అధికారులు అరెస్టు చేశారు. వారిలో ఒకరిని తీవ్రంగా కొట్టారని, మరొకరిని జైలుకు తరలించారని పుతిన్ వ్యతిరేకులు ఆరోపిస్తున్నారు. రష్యాలో సర్కారును విమర్శించే వారిపై అధికారులు ఉక్కుపాదం మోపుతున్న సంగతి తెలిసిందే.

News March 29, 2024

టెస్లాకు పోటీగా షావోమీ నుంచి కారు!

image

ఇతర బ్రాండ్స్‌తో పోలిస్తే తక్కువ ధరలో మంచి స్మార్ట్ ఫోన్లు అందించే షావోమీ సంస్థ ఇప్పుడు కార్ల తయారీలోకి దిగింది. టెస్లా, బీవైడీ వంటి వాటికి పోటీగా తమ తొలి విద్యుత్ కారు ‘స్పీడ్ అల్ట్రా 7’ను మార్కెట్‌లోకి తెచ్చింది. నిన్నటి నుంచి అమ్మకాలు ప్రారంభమయ్యాయి. 3 వేరియెంట్లలో లభించే ఈ కారు ప్రారంభ ధర రూ.25 లక్షలుగా ఉంది. ప్రస్తుతానికి చైనాకే పరిమితమైనా త్వరలోనే భారత్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

News March 29, 2024

IPL: నేడు ఆర్సీబీతో కేకేఆర్ ఢీ

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు ఆర్సీబీ, కేకేఆర్ బెంగళూరులో తలపడనున్నాయి. ఇరువైపులా బలమైన హిట్టర్లు ఉండటం, చిన్నస్వామి స్టేడియం చిన్నది కావడంతో భారీ స్కోర్లు నమోదు కావొచ్చని క్రీడావిశ్లేషకులు అంచనా వేస్తున్నారు. నిన్న మ్యాచ్‌తో సహా ఇప్పటి వరకు హోం టీమ్స్‌ గెలిచాయి. ఈరోజు ఆర్సీబీని మట్టికరిపించి ఆ రికార్డును మార్చాలని భావిస్తోంది కేకేఆర్. అటు ఆర్సీబీ సైతం బలంగానే ఉండటంతో రసవత్తరమైన మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.

News March 29, 2024

మట్టి కుండలో నీరు తాగితే కలిగే ప్రయోజనాలు ఇవే!

image

ప్రస్తుతం వేసవికాలంలో ఫ్రిజ్‌లోని చల్లటి నీరు తాగేందుకు అందరూ ఆసక్తి చూపుతారు. కానీ ఫ్రిజ్‌కు బదులు మట్టి కుండలో నీరు తాగితే ఎక్కువ ప్రయోజనాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. మట్టి కుండలో నీరు సహజంగా రుచిగా ఉంటాయి. ఆ నీరు తాగితే గ్యాస్, అసిడిటీ, శ్వాసకోశ సమస్యలు రావు. జీర్ణక్రియ కూడా మెరుగవుతుంది. ఈ నీటిని తాగడం వల్ల డీహైడ్రేషన్ నుంచి తప్పించుకోవచ్చు. జిడ్డు, మొటిమల నుంచి చర్మాన్ని కాపాడుకోవచ్చు.

News March 29, 2024

ఈరోజు నాకు చాలా ప్రత్యేకం: అల్లు అర్జున్

image

దుబాయ్‌లోని మేడమ్ టుస్సాడ్స్ స్టేడియంలో నిన్న సాయంత్రం అల్లు అర్జున్ తన మైనపు విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బన్నీ ట్విటర్‌లో స్పందించారు. ‘ఈరోజు చాలా ప్రత్యేకం. నా తొలి సినిమా గంగోత్రి 2003లో ఈరోజే విడుదలైంది. ఈరోజు టుస్సాడ్స్‌లో నా విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నా. ఈ 21ఏళ్ల ప్రయాణం మర్చిపోలేనిది. దీనిలో నాకు అండగా నిలిచిన వారికి, నా ఫ్యాన్స్‌కు కృతజ్ఞతలు’ అని పేర్కొన్నారు.

News March 29, 2024

కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటా: దానం నాగేందర్

image

తనకు బీఆర్ఎస్‌లో అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు రుణపడి ఉంటానని కాంగ్రెస్ నేత దానం నాగేందర్ తెలిపారు. ‘ఆయన గొప్ప నాయకుడు. కానీ వారి చుట్టూ కందిరీగల్లా కొంతమంది చేరారు. వారి గురించి త్వరలోనే తెలుసుకుంటారు. నాకు ఆత్మగౌరవం ముఖ్యం. కాంగ్రెస్‌లో నిర్మొహమాటంగా, స్వేచ్ఛగా మాట్లాడగలను’ అని పేర్కొన్నారు. కాగా.. దానంపై బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ మండిపడ్డారు. కేసీఆర్ ఆయన్ను కన్నబిడ్డలా చూసుకున్నారని వివరించారు.