News March 20, 2024

ఇతరులతో పోలిస్తే ఆయన డిఫరెంట్: జహీర్

image

టీమ్ ఇండియా మాజీ సారథి ధోనీ ఆలోచించకుండా ఎలాంటి నిర్ణయాలు తీసుకోడని మాజీ బౌలర్ జహీర్ ఖాన్ అన్నారు. ఇతర ఆటగాళ్లతో పోలిస్తే ధోనీ డిఫరెంట్ అని చెప్పారు. రిటైర్మెంట్ తర్వాత ఏం చేయాలో ముందే నిర్ణయించుకున్నాడని తెలిపారు. జీవితంలో క్రికెట్ ఓ భాగమేనని గుర్తించి.. అందుకు అనుగుణంగా తన జీవితాన్ని తీర్చిదిద్దుకున్నాడన్నారు.

News March 20, 2024

తండ్రిని మోసం చేసిన కూతురు

image

రాజస్థాన్‌లో ఓ యువతి కిడ్నాప్ వ్యవహారం తల్లిదండ్రులతో పాటు పోలీసులకు చెమటలు పట్టించింది. శివ్‌పురికి చెందిన కావ్య స్నేహితులతో కలిసి ఫారిన్ ట్రిప్ వెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో డ్రామాకు తెరతీసింది. చేతులకు కట్లు వేయించుకుని తండ్రికి ఫొటోలు పంపి బెదిరించింది. రూ.30 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసింది. కేంద్రమంత్రి సింధియా సైతం ఆ యువతిని త్వరగా కాపాడాలని పోలీసులను ఆదేశించారు. చివరకు నాటకం బయటపడింది.

News March 20, 2024

100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు: BRS

image

TG: రేవంత్ రెడ్డి సర్కారు 100 రోజుల్లోనే రూ.16,400 కోట్ల అప్పు చేసిందని BRS విమర్శించింది. ‘తెచ్చిన అప్పులన్నీ ఎక్కడికి పోతున్నయ్? కాంగ్రెస్ ఖజానాలోకా.. లేక రేవంత్ జేబులోకా?’ అని ట్వీట్ చేసింది. ఇన్ని కోట్ల అప్పులు చేసినా పూర్తిస్థాయిలో రైతుబంధు అందజేయలేదని, పెన్షన్లు పెంచలేదని పోస్ట్ చేసింది.

News March 20, 2024

సర్ఫరాజ్ తండ్రితో నేను క్రికెట్ ఆడా: రోహిత్

image

టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. తన చిన్నతనంలో సర్ఫరాజ్ ఖాన్ తండ్రి నౌషద్ ఖాన్‌తో కలిసి కంగా లీగ్‌లో ఆడానని తెలిపారు. సర్ఫరాజ్ తండ్రి ఆ సమయంలో చాలా ఫేమస్ అని గుర్తు చేశారు. సర్ఫరాజ్‌ను ఈ స్థాయికి తీసుకొచ్చేందుకు సూచనలు ఇచ్చిన ఆయనకు రోహిత్ అభినందనలు తెలిపారు.

News March 20, 2024

‘లెజెండ్’ మళ్లీ వస్తోంది

image

టాలీవుడ్‌లో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతోంది. గతంలో సూపర్ హిట్ కొట్టిన సినిమాలు ఇప్పుడు బాక్సాఫీసు వద్ద మళ్లీ రిలీజ్ అయి సందడి చేస్తున్నాయి. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ‘లెజెండ్’ చిత్రం తాజాగా రీరిలీజ్‌కు సిద్ధమైంది. ఈ నెల 30న థియేటర్లలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. 2014 ఎన్నికలకు ముందు విడుదలైన ఈ చిత్రం పొలిటికల్ డైలాగ్‌లతో భారీ హిట్ కొట్టిన విషయం తెలిసిందే.

News March 20, 2024

క్యాన్సిల్ టికెట్లతో వందల కోట్ల ఆదాయం

image

వెయిటింగ్ లిస్ట్‌లో ఉండి క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా భారత రైల్వేకు వందల కోట్లలో ఆదాయం వస్తోంది. 2021 నుంచి జనవరి 2024 వరకు ఈ క్యాన్సిల్ అయిన టికెట్ల ద్వారా రైల్వే శాఖకు ఏకంగా రూ.1229.85 కోట్ల ఆదాయం సమకూరిందట. ఈ సమయంలో 128 మిలియన్ల కంటే ఎక్కువ వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌లు రద్దయ్యాయి. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెల్లడైంది. పండుగల సమయంలోనే రైల్వే ఖజానాకు రూ.కోట్లలో ఆదాయం వచ్చింది.

News March 20, 2024

IPL 2024: సూర్య స్థానంలో ఆడేది ఎవరు?

image

NCA ఫిట్‌నెస్ టెస్టులో ఫెయిలైన సూర్య కుమార్ యాదవ్‌కు రేపు మరోసారి టెస్ట్ జరగనుంది. ఒకవేళ అతను ఫిట్‌నెస్ నిరూపించుకోలేకపోతే IPL సీజన్ మొత్తానికి దూరం కానున్నారు. ఈ నేపథ్యంలో ముంబై ఇండియన్స్ తుది జట్టులో అతడి స్థానంలో ఎవరాడుతారనే దానిపై చర్చ మొదలైంది. నేహాల్ వధేరా, విష్ణు వినోద్‌లలో ఒకరికి చోటు దక్కే అవకాశముంది. గత సీజన్‌లో రాణించిన వధేరాకే మొగ్గు చూపే ఛాన్సుందని క్రీడావర్గాలు చెబుతున్నాయి.

News March 20, 2024

ఫోన్ల లాక్ తీయించి ప్రశ్నలు!

image

TG: ఎమ్మెల్సీ కవితను ఈడీ నాలుగో రోజు విచారించింది. ఇవాళ ఆమె పీఏలు రాజేశ్, రోహిత్‌లను కూడా విచారించినట్లు సమాచారం. కవిత అరెస్టు సమయంలో పీఏల ఫోన్లను అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. వారి సమక్షంలోనే ఫోన్‌లను లాక్ తీయించి అందులోని సమాచారం ఆధారంగా ఈడీ ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. ఇక రాత్రి 7గంటల సమయంలో కవితను మాజీ మంత్రి కేటీఆర్, లాయర్ మోహిత్ కలిశారు. ధైర్యంగా ఉండాలని చెప్పినట్లు సమాచారం.

News March 20, 2024

ఆపరేషన్ పిఠాపురం

image

AP: పిఠాపురంలో పవన్ కళ్యాణ్‌ను ఓడించేందుకు వైసీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ‘ఆపరేషన్ పిఠాపురం’లో భాగంగా ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే ద్వారంపూడితో పాటు కాపు నేతలైన ముద్రగడ పద్మనాభం, దాడిశెట్టి రాజా, కురసాల కన్నబాబులతో ప్రచారం చేయించనున్నట్లు తెలుస్తోంది. కీలక నేతలకు వార్డుల వారీగా బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. త్వరలోనే పిఠాపురంలో సీఎం జగన్ బస్సుయాత్ర కూడా ఉండనున్నట్లు తెలుస్తోంది.

News March 20, 2024

కవిత త్వరగా బయటకు రావాలంటే..: అర్వింద్

image

TS: కవిత అరెస్టుతో BJP, BRS మధ్య ఒప్పందం ఉందనే ప్రచారం అబద్ధమేనని తేలిపోయిందని నిజామాబాద్ ఎంపీ అర్వింద్ అన్నారు. మొదటి నుంచి తాము ఇదే చెబుతున్నామని వ్యాఖ్యానించారు. కవిత త్వరగా బయటకు రావాలంటే ఆమె భర్త అనిల్ తప్పించుకుని తిరగకుండా.. ఈడీ విచారణకు సహకరించాలని సూచించారు. తెలంగాణలోని 16 ఎంపీ సీట్లలో BRS డిపాజిట్ కోల్పోతుందని, ఒక్క మెదక్ స్థానంలోనే BRSకు డిపాజిట్ వస్తుందని జోస్యం చెప్పారు.