News March 22, 2024

రెండు నెలలు పండుగే.. బెట్టింగ్ జోలికి వెళ్లకండి!

image

బిజీ లైఫ్‌‌లో కాస్త ఉపశమనం ఇచ్చేందుకు బిగ్గెస్ట్ క్రికెట్ ఫెస్టివల్ సిద్ధమైంది. రెండు నెలల పాటు నాన్ స్టాప్ ఎంటర్‌టైన్మెంట్‌ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. 10 టీమ్స్ తలపడే టోర్నీలో రెండు నెలల పాటు 74 మ్యాచ్‌లు జరగనున్నాయి. మరి ఈసారి IPL ట్రోఫీ గెలిచేదెవరో చూడాలి. క్రికెట్‌ను చూస్తూ ఎంజాయ్ చేయండి. కానీ, బెట్టింగ్ పెట్టి అప్పులపాలై కుటుంబాన్ని రోడ్డున పడేయకండి.

News March 22, 2024

ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ

image

TG: రైతులకు ఒకేసారి రూ.2లక్షల రుణమాఫీ చేసేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. నిజామాబాద్, కామారెడ్డిలో వడగళ్లతో దెబ్బతిన్న పంట పొలాలను పరిశీలించిన ఆయన.. ‘ప్రాథమిక అంచనా ప్రకారం 40వేల ఎకరాల్లో నష్టం జరిగింది. అధికారుల సర్వే పూర్తయ్యాక ఎకరానికి ₹10వేల పరిహారం అందిస్తాం. KCR చేసిన ₹8లక్షల కోట్ల అప్పులకు ₹60వేల కోట్ల వడ్డీ కట్టాల్సి వస్తోంది’ అని విమర్శించారు.

News March 22, 2024

విశాఖ తీరంలో డ్రగ్స్ ఉప్పెన.. పార్టీల విమర్శల హోరు

image

AP: వైజాగ్ పోర్టులో 25,000 KGల డ్రగ్స్‌ను CBI స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్ట్స్ పేరిట కంటైనర్ డెలివరీకాగా, ఆ కంపెనీ ఎండీ కూనం వీరభద్రరావు, సీఈవో కోటయ్య చౌదరి చుట్టూ రాజకీయాలు తిరుగుతున్నాయి. వారిద్దరికీ బీజేపీ, టీడీపీ నేతలతో సంబంధాలున్నాయని వైసీపీ.. అధికార పార్టీతో లింకులున్నాయని విపక్షాలు ఫొటోలు రిలీజ్ చేస్తున్నాయి. ఎన్నికల వేళ ఈ కేసు ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.

News March 22, 2024

రోజూ బిర్యానీ తినిపించేవాడినే పెళ్లాడతా: హీరోయిన్

image

ప్రతీ రోజూ జోక్స్ వేస్తూ.. ఒక పూట బిర్యానీ తినిపించేవాడినే పెళ్లాడతానని హీరోయిన్ ప్రసాద్ కోమలి అన్నారు. ‘గతంలో ఓ వ్యక్తిని ప్రేమించా. కానీ మా ఇద్దరికీ బ్రేకప్ అయింది. ప్రస్తుతం నేను సింగిల్‌గానే ఉన్నా. నేను తెలుగమ్మాయిని కాబట్టే సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. కానీ కొంతమంది నేను ముంబై నుంచి వచ్చానని అనుకుంటారు’ అని ఆమె పేర్కొన్నారు. హిట్ 2, నేను సీతాదేవి, శశివదనే సినిమాల్లో ఆమె నటించారు.

News March 22, 2024

అరెస్టయిన మాజీ సీఎంలు వీరే..

image

పదవిలో ఉండగా అరెస్టయిన మొదటి వ్యక్తిగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ నిలిచారు. గతంలో ఏడుగురు మాజీ సీఎంలు పలు అవినీతి కేసుల్లో అరెస్టయ్యారు. దాణా కుంభకోణం కేసులో లాలూ ప్రసాద్ యాదవ్, జగన్నాథ్ మిశ్రా(బిహార్), అక్రమాస్తుల కేసులో జయలలిత(తమిళనాడు), టీచర్ నియామకాల్లో అవినీతి కేసులో ఓం ప్రకాశ్ చౌతాలా(హరియాణా), మైనింగ్ కేసులో మధుకొడా, హేమంత్ సోరెన్(ఝార్ఖండ్), స్కిల్ స్కామ్‌ కేసులో చంద్రబాబు జైలుపాలయ్యారు.

News March 22, 2024

ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది: చద్దా

image

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ను ఈడీ అధికారులు అరెస్ట్ చేయడంపై ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా మండిపడ్డారు. ‘ఎమర్జెన్సీని ప్రకటించనప్పటికీ.. ఇండియాలో పరిస్థితులు అలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యం తీవ్ర ప్రమాదంలో ఉంది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సీఎంలను లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేస్తున్నారు. ఇదివరకు ఏజెన్సీలను దుర్వినియోగం చేయడం చూడలేదు. బలమైన ప్రతిపక్షాల గొంతు నొక్కేస్తున్నారు’ అని ట్వీట్ చేశారు.

News March 22, 2024

అజ్ఞాతంలోకి ప్రభాకర్‌రావు?

image

TG: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించిన SIB మాజీ చీఫ్ ప్రభాకర్‌రావు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు సమాచారం. మాజీ DSP ప్రతీణ్‌రావు అరెస్టుతో అప్రమత్తమైన ప్రభాకర్ USA వెళ్లినట్లు పోలీసులు భావిస్తున్నారు. త్వరలోనే ఆయన హైకోర్టును ఆశ్రయించే అవకాశం ఉంది. 2018 నుంచే ప్రభాకర్ ఆధ్వర్యంలో ట్యాపింగ్ సాగినట్లు భావిస్తున్న పోలీసులు.. ఇందుకోసం ఇజ్రాయెల్ నుంచి అత్యాధునిక పరికరాలు కొనుగోలు చేసినట్లు తేల్చారు.

News March 22, 2024

హీరోయిన్ ఆరోగ్యం విషమం..

image

రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మలయాళ హీరోయిన్ <<12877028>>అరుంధతి<<>> నాయర్ ఆరోగ్య పరిస్థితి విషమంగానే ఉంది. తలకు బలమైన గాయం కావడంతో మెదడులో రక్తం గడ్డకట్టిందని, పక్కటెముకలు విరిగిపోయాయని వైద్యులు వెల్లడించారు. దీంతో ఆర్థిక సాయం కోరుతూ పలువురు స్నేహితులు సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు. ఈమె తమిళ, మలయాళ సినిమాల్లో హీరోయిన్‌గా చేశారు. విజయ్ ఆంటోనీ ‘భేతాళుడు’ సినిమాతో ఈమె తెలుగు ప్రేక్షకులకూ పరిచయమయ్యారు.

News March 22, 2024

INSTAGRAM మళ్లీ పనిచేయట్లేదు!

image

ఇన్‌స్టాగ్రామ్ పనిచేయట్లేదని కొందరు ట్విటర్‌లో పోస్ట్ చేస్తున్నారు. ‘ఉదయాన్నే మొబైల్‌లో ఇన్‌స్టా ఓపెన్ చేయగానే లాగౌట్ అయింది. తిరిగి ప్రయత్నిస్తే పాస్‌వర్డ్ చేంజ్ చేశారని నోటిఫికేషన్ వచ్చింది. మళ్లీ ప్రయత్నిస్తే అసలు తమ అకౌంటే లేదని చూపిస్తోంది’ అని పోస్టులు పెడుతున్నారు. దీంతో INSTAGRAM DOWN హాష్‌ట్యాగ్ ట్రెండ్ అవుతోంది. మీకూ ఇలానే అవుతోందా? కామెంట్ చేయండి.

News March 22, 2024

నేడు సుప్రీంకోర్టులో కవిత పిటిషన్‌పై విచారణ

image

TG: ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని, క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను క్వాష్ చేయాలంటూ ఆమె కోర్టును ఆశ్రయించారు. జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సుందరేశ్, జస్టిస్ బేలా త్రివేదిలతో కూడిన త్రిసభ్య ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించనుంది. ప్రస్తుతం కవిత ఈడీ కస్టడీలో ఉన్న సంగతి తెలిసిందే.