News July 3, 2024

హాథ్రస్ ఘటనపై హోంమంత్రి ప్రకటన చేయాలి: ఖర్గే

image

యూపీ హాథ్రస్ తొక్కిసలాట ఘటనపై హోంమంత్రి ప్రకటన విడుదల చేయాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే రాజ్యసభలో డిమాండ్ చేశారు. ఈ ఘటన చాలా దురదృష్టకరమన్నారు. నకిలీ బాబాలను నియంత్రించాలని కోరారు. సత్సంగ్ లాంటి కార్యక్రమాలకు మార్గదర్శకాలు, ప్రత్యేక చట్టాలు రూపొందించాలని సూచించారు. మరోవైపు ఈ ఘటనపై రాజ్యసభ సభ్యులు సంతాపం తెలియజేశారు.

News July 3, 2024

ఉప్పాడ తీరాన్ని పరిశీలించిన పవన్ కళ్యాణ్

image

AP: కాకినాడ జిల్లాలో మూడో రోజు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతోంది. ఉప్పాడ సముద్ర తీరంలో కోతకు గురవుతున్న ప్రాంతాన్ని ఆయన పరిశీలిస్తున్నారు. తుఫాన్ పరిస్థితులపై ఫొటో గ్యాలరీని పరిశీలించారు. సాయంత్రం పిఠాపురంలో వారాహి సభలో పవన్ పాల్గొననున్నారు. ఈ సభలో డిప్యూటీ సీఎం హోదాలో ఆయన ఇచ్చే ప్రసంగంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

News July 3, 2024

మరోసారి సీఎంగా హేమంత్ సోరెన్: ఝార్ఖండ్ మంత్రి

image

ఇవాళ ఎమ్మెల్యేల సమావేశంలో హేమంత్ సోరెన్‌ మరోసారి సీఎంగా ఎన్నికవడం ఖాయమని మంత్రి సత్యానంద్ భోక్తా తెలిపారు. శాసనసభా పక్ష సమావేశంలో హేమంత్ సోరెన్‌ను ఎమ్మెల్యేలంతా నాయకుడిగా ఎన్నుకుంటారని చెప్పారు. మరోవైపు శాసనసభా పక్ష నేతగా చంపై సోరెన్ రాజీనామా చేస్తారన్నారు. ఆ తర్వాత నూతన ముఖ్యమంత్రిగా హేమంత్ ప్రమాణస్వీకారం చేస్తారని వెల్లడించారు. తాను కూడా కొత్త మంత్రివర్గంలో ఉంటానని తెలిపారు.

News July 3, 2024

పట్టాలెక్కిన రెండో లైను.. 3 గంటల్లోనే సికింద్రాబాద్ నుంచి గుం’టూరు’

image

సికింద్రాబాద్-గుంటూరు రూట్‌లో నల్లపాడు-BBనగర్ మధ్య 248KM మేర 2వ లైన్ నిర్మాణం, విద్యుదీకరణ పనులు పట్టాలెక్కాయి. ₹2853కోట్ల ఈ ప్రాజెక్టును 4 దశల్లో పూర్తి చేయాలని రైల్వేశాఖ లక్ష్యంగా పెట్టుకుంది. ఆగస్టులో పనులు ప్రారంభం కానున్నాయి. పూర్తైతే 3 గంటల్లో గమ్యం చేరుకోవచ్చు. ప్రస్తుతం సింగిల్ లైన్ వల్ల ఒక రైలు వస్తుంటే మరొకటి స్టేషన్‌లో ఆగాల్సి వస్తోంది. 140% సామర్థ్యంతో ఈ రూట్‌లో రైళ్లు నడుస్తున్నాయి.

News July 3, 2024

విషాదం నుంచి విజయానికి!

image

కేరళకు చెందిన జాతీయ స్థాయి స్విమ్మర్ షాన్ ఎస్ ఎన్నో విషాదాలను తట్టుకొని విజయాన్ని ముద్దాడారు. 2013లో జరిగిన రైలు ప్రమాదంలో రెండు కాళ్లు కోల్పోవడంతో అతని జీవితం తలకిందులైంది. అయినా క్రీడల పట్ల తనకున్న అభిరుచిని కోల్పోలేదు. కాళ్లు లేకపోయినా కష్టపడి స్విమ్మింగ్ నేర్చుకుని జాతీయ స్థాయిలో రాణిస్తున్నారు. ఎవరెస్ట్ శిఖరాన్ని సైతం అధిరోహించేందుకు సిద్ధమవుతూ ఎందరికో ప్రేరణనిస్తున్నారు.

News July 3, 2024

త్వరలో ప్రసారభారతి ఓటీటీ.. ప్రైవేట్ కంపెనీల్లో ఆందోళన?

image

కేంద్రానికి చెందిన ప్రసారభారతి సొంత ఓటీటీని లాంచ్ చేయాలని ప్లాన్ చేస్తున్న వేళ ప్రైవేట్ బ్రాడ్‌కాస్టర్లలో ఆందోళన వ్యక్తమవుతున్నట్లు తెలుస్తోంది. ఆ ఓటీటీలో స్పోర్ట్స్ ఫ్రీగా లైవ్ ప్రసారం చేస్తే తాము భారీగా నష్టపోతామని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. అయితే స్పోర్ట్స్ ప్రసారంపై కేంద్రం క్లారిటీ ఇవ్వలేదు. కాగా వార్తలు, వినోదం, క్రీడలు మొదలైన విభాగాలపై ప్రసారభారతి ఓటీటీని తీసుకురానున్నట్లు సమాచారం.

News July 3, 2024

విధులకు ఆలస్యంగా వచ్చిన ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం

image

TG: మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి హైదరాబాద్‌లోని ఆర్ అండ్ బీ కార్యాలయంలోని పలు విభాగాల్లో తనిఖీలు నిర్వహించారు. ఉదయం 11 గంటలైనా విధులకు హాజరుకాని ఉద్యోగులపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. అటెండెన్స్ బుక్‌ను పరిశీలించిన ఆయన, ప్రతి ఉద్యోగి విధిగా సమయానికి రావాలని ఆదేశించారు.

News July 3, 2024

హాథ్రస్ విషాదం.. కాల్వలో పడ్డవాళ్లని తొక్కుకుంటూ వెళ్లారు

image

UPలోని హాథ్రస్ <<13553522>>తొక్కిసలాట<<>>లో 121 మంది భక్తులు దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే. ప్రమాద సమయంలో అక్కడి భయానక దృశ్యాలను ప్రత్యక్ష సాక్షులు వెల్లడించారు. ‘సత్సంగ్ అయిపోగానే ఒక్కసారిగా అందరూ బయటకొచ్చారు. తోపులాటలో ప్రాంగణం బయట రోడ్డు కింద ఉన్న మురికి కాల్వలో చాలా మంది పడ్డారు. వాళ్లను జనం తొక్కుకుంటూ వెళ్లారు. కింద ఉన్న వాళ్లు ఇరుక్కుపోయి ఊపిరాడక చనిపోయారు’ అని తెలిపారు.

News July 3, 2024

ఢిల్లీకి బయల్దేరిన సీఎం రేవంత్

image

TG: సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయల్దేరారు. పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేతో ఆయన భేటీ కానున్నారు. మంత్రి వర్గ విస్తరణ, పీసీసీ చీఫ్ నియామకంపై తుది నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. మరోవైపు ఇవాళ సాయంత్రం కేశవరావు(కేకే) ఖర్గే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. గతంలో కేకే కూతురు విజయలక్ష్మీ హస్తం గూటికి చేరిన సంగతి తెలిసిందే.

News July 3, 2024

BREAKING: కవిత కస్టడీ పొడిగింపు

image

TG: BRS ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. ఆమె జుడీషియల్ కస్టడీని ఈ నెల 25 వరకు పొడిగిస్తూ ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈడీ కేసులో ఇవాళ్టితో ఆమె కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అధికారులు కోర్టులో హాజరుపరిచారు. కస్టడీ పొడిగించిన న్యాయమూర్తి తదుపరి విచారణను ఈ నెల 25కు వాయిదా వేశారు. కాగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మార్చి 15న కవిత అరెస్టయ్యారు.