Nellore

News October 23, 2025

భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : వేమిరెడ్డి

image

జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. వర్షాల కారణంగా ప్రాణ నష్టం, పశు నష్టం జరగకుండా జిల్లా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు. అనుకోని అత్యవసర పరిస్థితులు ఏర్పడితే ముందు జాగ్రత్తగా అనువైన ఆశ్రయ కేంద్రాలకు తరలించాలన్నారు.

News October 22, 2025

కృష్ణపట్నంలో మూడో నెంబర్ ప్రమాద హెచ్చరిక

image

బంగాళాఖాతంలో వాయుగుండం నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టులో మూడో నెంబర్ ప్రమాద సూచికను ఎగురవేశారు. పోర్టుకు సమీపంలో తుఫాను ఉదృతి ఎక్కువగా ఉంటుందని అధికారులు తెలిపారు. జిల్లాలోని తీర ప్రాంతాల్లో ముఖ్యంగా ఆరు మండలాల ప్రజలను మెరైన్ పోలీసులు అప్రమత్తం చేశారు. ఇప్పటికే పెన్నా నదికి వరద ఉదృతి పెరిగింది. ఈ నెల 25వ తేదీ వరకు భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.

News October 22, 2025

కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు: కలెక్టర్

image

భారీ వర్షాల నేపథ్యంలో అన్ని ముందస్తు చర్యలు తీసుకున్నట్లు కలెక్టర్ హిమాన్షు శుక్ల తెలిపారు. బుధవారం ఆయన ప్రకటన విడుదల చేశారు. భారీ వర్షాల దృష్ట్యా ప్రజలకు అత్యవసర సేవలు అందించేందుకు కలెక్టరేట్‌లో కంట్రోలు రూంను ఏర్పాటుచేసినట్లు తెలిపారు. వర్షాల వలన ఇబ్బందులు తలెత్తితే కంట్రోలు రూం నెంబర్లు : 0861 2331261, 7995576699 నెంబర్లకు ఫోన్ చేసి సమాచారం తెలపవచ్చని కలెక్టర్ తెలిపారు.

News October 22, 2025

నెల్లూరు: దంపతుల ఆత్మహత్యాయత్నం.. భర్త మృతి

image

నెల్లూరు రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గుడిపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు తాళలేక మురళీధర్, అతని భార్య జలజ పురుగులు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించారు. మురళీధర్ మృతి చెందగా.. జలజను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుత ఆమె వైద్యుల పర్యవేక్షణలో ఉంది. సమాచారం తెలుసుకున్న రూరల్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి వివరాలు ఆరా తీస్తున్నారు.

News October 22, 2025

నావూరు పెద్దవాగును పరిశీలించిన జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల

image

పొదలకూరు మండలం నావూరుపల్లి వద్దనున్న నావూరు పెద్దవాగును బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ అజిత వేజెండ్ల పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటం, మూడు గ్రామాలకు రాకపోకలు బంద్ అవడంతో ఆమె వాగును‌ పరిశీలించారు. తుఫాన్ నేపథ్యంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భారీ వర్షాలు కురుస్తుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.

News October 22, 2025

25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు: నెల్లూరు కలెక్టర్

image

నెల్లూరు జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల అన్నారు. 23 నుంచి 25 వరకు భారీ నుంచి అతి భారీ వర్షాల ప్రభావం అధికంగా ఉండనున్న నేపథ్యంలో అధికారులను, ప్రజలను అప్రమత్తం చేశారు. ప్రజలు తీసుకోవలసిన ముందస్తు జాగ్రత్తలపై బుధవారం కలెక్టర్ ఒక ప్రకటన విడుదల చేశారు. తీర ప్రాంత మండలాలపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు.

News October 22, 2025

మనుబోలు: హైవేపై ప్రమాదం.. ఒకరి స్పాట్ డెడ్

image

మనుబోలు మండలం కాగితాల పూర్ క్రాస్ రోడ్డు వద్ద జాతీయ రహదారిపై బొలెరో, బైక్ ఢీకొనడంతో బుధవారం అక్కడికక్కడే మహిళ మృతి చెందింది. గొట్లపాలెం నుంచి కాగితాల పూర్‌కు బైకుపై హైవే క్రాస్ చేస్తుండగా బొలెరో ఢీకొట్టింది. దీంతో బైక్‌పై వెళ్తున్న కాగితాల పూర్‌కి చెందిన కొండూరు సుప్రజ(40) మృతిచెందగా, కొడుకు రాకేష్ గాయపడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News October 22, 2025

నెల్లూరు జిల్లాలో రేపు కూడా సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈక్రమంలో జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ పాఠశాలలు, కాలేజీలు, అంగన్వాడీ కేంద్రాలకు గురువారం సైతం కలెక్టర్ హిమాన్షు శుక్లా సెలవు ప్రకటించారు. ఈ ఉత్తర్వులను విధిగా అమలుచేయాలని కలెక్టర్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ సైతం సెలవు ఇచ్చిన విషయం తెలిసిందే.

News October 22, 2025

పెంచలకోన వాటర్‌ఫాల్స్‌కు రాకండి: ఎస్ఐ

image

భారీ వర్షాల నేపథ్యంలో రాపూరు ఎస్ఐ వెంకట్ రాజేశ్ కీలక ప్రకటన చేశారు. పెంచలకోన ఆలయ సమీపంలో ఉన్న వాటర్‌ఫాల్స్‌కు వర్షపు నీరు భారీగా వస్తోందని చెప్పారు. ప్రజలు ఎవరూ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లరాదని కోరారు. నీటి ప్రవాహం ఎక్కువగా ఉండటంతో ప్రమాదాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఎట్టిపరిస్థితుల్లోనూ వాటర్ ఫాల్స్ వద్దకు ఎవరినీ అనుమతించబోమని స్పష్టం చేశారు.

News October 22, 2025

నెల్లూరు: కాలేజీలకు సెలవు

image

నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లకు అధికారులు ప్రకటించారు. అలాగే అన్ని జూనియర్ కాలేజీలకు సైతం బుధవారం హాలిడే ఇవ్వాలని RIO వరప్రసాద్ ఆదేశించారు. ఈ ఆదేశాలకు విరుద్ధంగా ఎవరైనా తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మరోవైపు డిగ్రీ పరీక్షలు సైతం వాయిదా పడిన విషయం తెలిసిందే. మీకు సెలవు ఇచ్చారా? లేదా? కామెంట్ చేయండి.