Hyderabad

News September 9, 2024

HYD: నగరంలో వర్షాలతో తగ్గిన వాయు కాలుష్యం

image

కొద్దిరోజులుగా కురుస్తున్న వర్షాలతో నగరంలో వాతావరణం పూర్తిగా మారింది. దీంతో కాలుష్య స్థాయులు తగ్గాయని పీసీబీ అధికారులు వెల్లడించారు. 10 కేంద్రాల్లో వాయునాణ్యత సూచీని లెక్కించగా 53గా నమోదైందని తెలిపారు. హెచ్సీయూ కేంద్రం వద్ద అత్యల్పంగా 23, న్యూమలక్‌పేట్ వద్ద అత్యధికంగా 73గా నాణ్యత సూచీ నమోదైందని వెల్లడించారు. జూ పార్కు 28, కొంపల్లి 55, ఈసీఐఎల్ 56, సనత్ నగర్ 59, నాచారం 62గా నమోదైంది.

News September 9, 2024

స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌లో హైదరాబాద్‌కు 25వ ర్యాంకు

image

కేంద్ర కాలుష్యనియంత్రణ మండలి నిర్వహించిన స్వచ్ఛ వాయు సర్వేక్షణ్‌-2024లో 10 లక్షలకు పైగా జనాభా ఉన్న నగరాల్లో హైదరాబాద్‌ 25వ స్థానంలో నిలిచింది. గతంతో పోలిస్తే గాలిలో ధూళికణాల మెరుగుదల ఆధారంగా నగరాల పనితీరును లెక్కించి ఈ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో దేశవ్యాప్తంగా 10 లక్షలకు పైగా జనాభా ఉన్న 47 నగరాల్లో హైదరాబాద్‌ 163.3 మార్కులతో 25వ స్థానంలో నిలిచింది.

News September 9, 2024

HYD: నరాల సమస్యకు నిమ్స్ ఆధునిక వైద్యం

image

నరాల సంబంధిత సమస్యలతో బాధపడే వారికి ఆధునిక వైద్యం అందించేందుకు టీఎంఎస్ యంత్రం అందుబాటులోకి వచ్చిందని నిమ్స్ డైరెక్టర్ ప్రొఫెసర్ నగరి బీరప్ప చెప్పారు. ఆదివారం ఆసుపత్రి కార్యశాలలో ఆయన మాట్లాడారు. ఈయంత్రం సాయంతో మెదడులో ఏవైనా సమస్యలు తలెత్తితే బైపాస్ పద్ధతిలో చికిత్స చేసి తిరిగి పూర్వస్థితికి తీసుకురావచ్చన్నారు. రూ.2 కోట్ల విలువైన టీఎంఎస్ యంత్రంతో తక్కువ సమయంలో ఆధునిక వైద్యం అందించవచ్చని తెలిపారు.

News September 9, 2024

HYD: మాదాపూర్‌లో దేశంలోనే అతిపెద్ద సదస్సు

image

దేశంలోనే అతిపెద్ద ఇంధన పొదుపు సదస్సు హైదరాబాద్ వేదికగా కానుంది. సీఐఐ ఆధ్వర్యంలో 10 నుంచి 12వ తేదీ వరకు మాదాపూర్‌లోని HICCలో జరగనుంది. ఈ కార్యక్రమంలో 23వ ఎనర్జీ ఎఫిషియన్సీ సమ్మిట్, సీఐఐ నేషనల్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ ఎనర్జీ మేనేజ్‌మెంట్ సిల్వర్ జూబ్లీ, పవర్ ప్లాంట్ సమ్మిట్ 2024, పేపర్ టెక్ 2024, గ్రీన్ షుగర్ సమ్మిట్ 2024 వంటి 3 ప్రధాన రంగాలపై ప్రత్యేక సదస్సులు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు.

News September 9, 2024

HYD: BRSకు గడ్డం శ్రీనివాస్ యాదవ్ రాజీనామా

image

BRS హైదరాబాద్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, నగర ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం కేసీఆర్, కేటీఆర్‌కు రాజీనామా లేఖను పంపించారు. అయితే తర్వాత ఏ పార్టీలో చేరుతారనే విషయాన్ని వెల్లడించలేదు. కాగా గత లోక్‌సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి BRS అభ్యర్థిగా పోటీ చేసిన శ్రీనివాస్ యాదవ్ ఓడిపోయారు.

News September 9, 2024

HYD: యువత నైపుణ్యాభివృద్ధికి బల్దియా తోడు: ఆమ్రపాలి

image

చదువుకున్న యువతకు నైపుణ్య శిక్షణ నిచ్చి జీవనోపాధి కల్పించే దిశగా GHMC అడుగులు వేస్తోంది. గతేడాది బల్దియా సహకారంతో చందానగర్‌లో ఏర్పాటైన లైట్ హౌస్ కమ్యూనిటీస్ ఫౌండేషన్ సెంటర్ ద్వారా పలువురికి భిన్న రంగాల్లో ఉద్యోగాలు లభించాయి. ఇదే మాదిరి గ్రేటర్‌లోని సర్కిళ్ల పరిధిలో కేంద్రాలను ఏర్పాటు చేయాలని కమిషనర్ ఆమ్రపాలి భావిస్తున్నారు. 2 నెలల్లో 4 చోట్ల ఈ కేంద్రాలను నెలకొల్పే లక్ష్యంగా చర్చలు సాగుతున్నాయి.

News September 9, 2024

HYD: రేపటి కోసం.. కొత్త నగరం..!

image

భవిష్యత్ నగరానికి బంగారు బాటలు వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. HYD సమీపంలో తలపెట్టిన ‘ఫ్యూచర్ సిటీ’కి నగరం నుంచి రాకపోకలు చేసేందుకు వీలుగా నాలుగు విధాలుగా మార్గాలను అధికారులు సూచించారు. వీటన్నిటినీ శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి ఫోర్త్ సిటీ (స్కిల్ యూనివర్సిటీ)కి చేరుకునేలా ప్లాన్ చేశారు. ఇందులో రెండు మెట్రో రైలు రూట్‌లు, మరో రెండు ఎలక్ట్రిక్ బస్ రోడ్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టం మార్గాలున్నాయి.

News September 9, 2024

సికింద్రాబాద్: గాంధీ ఆసుపత్రి సమస్యలు తీరేనా..!

image

ఇటీవల గాంధీ ఆసుపత్రి మొదటిసారిగా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజానర్సింహ సందర్శించారు. ఈ సందర్భంగా అధికారులు సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. మంత్రి కూడా ఆసుపత్రి అభివృద్ధికి పలు సూచనలు చేశారు. వీటిన్నింటినీ అమలు చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేయాలని అసుపత్రి వర్గాలు కోరుతున్నాయి. సరిపడా వైద్య సిబ్బంది, పారిశుద్ధ్యం, సెక్యూరిటీ, తదితర సిబ్బందిని నియమించాలి.

News September 9, 2024

HYD: నగర వాసులకు ముఖ్య గమనిక

image

16వ కేంద్ర ఆర్థిక సంఘంతో మహాత్మ జ్యోతిబా ఫులే ప్రజాభవన్‌లో నిర్వహించే ముఖ్య సమావేశాల కారణంగా మంగళవారం నిర్వహించాల్సిన ప్రజావాణి కార్యక్రమం బుధవారానికి వాయిదా వేసినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా అర్జీదారులంతా విషయాన్ని గమనించి బదులుగా బుధవారం ప్రజావాణి కార్యక్రమానికి హాజరుకావాలని విజ్ఞప్తి చేశారు.

News September 8, 2024

HYD ఇన్‌స్టాలో పరిచయం.. 20రోజులు ఓయోలో బంధించాడు

image

హైదరాబాద్‌లో మరో దారుణం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాలు.. భైంసాకు చెందిన బాలికకు ఇన్‌స్టాలో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు. ఆ పరిచయంతో అతడి కోసం ఇక్కడకు వచ్చిన బాలికను నారాయణగూడలోని ఓయో రూమ్‌లో 20 రోజులు బంధించాడు. బాలిక తల్లిదండ్రలకు వాట్సాప్‌‌లో లొకేషన్ షేర్ చేయడంతో బాధితులు షీటీమ్స్‌ను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన పోలీసులు బాలికను విడిపించి నిందితుడిపై కేసు నమోదు చేశారు.