News January 12, 2025

లక్ష్య సాధనలో ఓటములా.. ఈ మాటలు వినండి!

image

వివేకానంద జయంతి సందర్భంగా యువతను చైతన్య పరిచేలా ఆయన చెప్పిన వ్యాఖ్యలను గుర్తుచేసుకుందాం. ‘విజయం వరించిందని విర్రవీగకు, ఓటమి ఎదురైందని నిరాశచెందకు. విజయమే అంతం కాదు, ఓటమి తుది మెట్టు కాదు’. మరొకటి ‘ఒక ఆలోచనను స్వీకరించండి. దాని గురించే ఆలోచించండి. దాని గురించే కలగనంది. మీ నరనరాల్లో ఆ ఆలోచనను జీర్ణించుకుపోనీయండి. మిగతా ఆలోచనలను పక్కనబెట్టండి. ఇలా చేస్తే విజయం మిమ్మల్ని తప్పక వరిస్తుంది’.

News January 12, 2025

కేజీ చికెన్ ధర ఎంతంటే?

image

తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. హైదరాబాద్, ఉమ్మడి కృష్ణా జిల్లాలో స్కిన్ లెస్ చికెన్ రూ.220గా ఉంది. రెండు రాష్ట్రాల్లోని చాలా ప్రాంతాల్లో దాదాపు ఇవే ధరలు ఉన్నాయి. సంక్రాంతి పండగ దగ్గర పడటంతో ఎక్కువ మంది నాటుకోళ్లు కొనేందుకు మొగ్గు చూపుతున్నారు.

News January 12, 2025

‘రిపబ్లిక్ డే’ ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు?

image

ఈ ఏడాది గణతంత్ర వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటోను ఆహ్వానించాలని భారత సర్కారు భావిస్తున్నట్లు సమాచారం. ఈ సందర్భంగా ఇరు దేశాల బంధం బలోపేతానికి సంబంధించి పలు చర్చల్లో పీఎం మోదీ, సుబియాంటో పాల్గొంటారని తెలుస్తోంది. సుబియాంటో గత ఏడాది అక్టోబరులో ఇండోనేషియా అధ్యక్షుడిగా బాధ్యతల్ని స్వీకరించారు. నిరుడు రిపబ్లిక్ డేకి ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.

News January 12, 2025

రాష్ట్రంలో సంక్రాంతి సందడి లేదు: YCP

image

AP: రాష్ట్రంలో సంక్రాంతి సందడి కానరావడం లేదని వైసీపీ ట్వీట్ చేసింది. ‘ప్రజల చేతుల్లో డబ్బుల్లేక ఎక్కడా కొనుగోళ్లు లేవు. దిగువ మధ్యతరగతి ప్రజల చేతుల్లో డబ్బు ఆడడం లేదు. దీంతో పండగ షాపింగ్ చేసే పరిస్థితి లేకుండా పోయింది. జగనన్న ఉండి ఉంటే తమకు ఏదో ఒక పథకం ద్వారా డబ్బులు వచ్చేవని, దాంతో పండగ గడిచిపోయేదని ప్రజలు అంటున్నారు. ఇప్పుడు పండగ చప్పగా ఉందని చెబుతున్నారు’ అని పేర్కొంది.

News January 12, 2025

అకౌంట్లలోకి రూ.12,000.. మార్గదర్శకాలు విడుదల

image

TG: రాష్ట్ర ప్రభుత్వం రైతు భరోసా మార్గదర్శకాలను విడుదల చేసింది. జనవరి 26 నుంచి సంవత్సరానికి ఎకరాకు రూ.12వేలు పెట్టుబడి సాయం అందించనున్నట్లు పేర్కొంది. భూభారతి (ధరణి)లో నమోదైన వ్యవసాయ యోగ్యమైన భూములకే ఈ సాయం అందనుంది. ROFR పట్టదారులకూ ఈ పథకం వర్తిస్తుంది. వ్యవసాయ యోగ్యం కాని భూములను రైతుభరోసా నుంచి తొలగించాలని ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి కలెక్టర్ బాధ్యులుగా ఉంటారని తెలిపింది.

News January 12, 2025

మనిషి ఆయుష్షును పెంచిన తెలుగోడు ఎల్లాప్రగడ సుబ్బారావు

image

నేడు మనిషి జీవన ప్రమాణం మెరుగుపడిందంటే అందుకు కారణం మన తెలుగువాడు ఎల్లాప్రగడ సుబ్బారావు. APలోని భీమవరంలో 1895, జనవరి 12న ఆయన జన్మించారు. బోదకాలుకు ఔషధం హెట్రోజన్, యాంటీబయాటిక్ టెట్రాసైక్లిన్, క్షయను కట్టడి చేసే ఐసోనికోటినిక్ యాసిడ్ హైడ్రాజైడ్, క్యాన్సర్ చికిత్సలో ఉపకరించిన మెథోట్రెక్సేట్.. ఇలా ఎన్నో ఔషధాలతో మానవాళిని రక్షించిన ఆయన 1948, ఆగస్టు 9న కన్నుమూశారు. నేడు ఆ మహనీయుడి జయంతి.

News January 12, 2025

మహాకుంభమేళాలో స్టీవ్ జాబ్స్ భార్య

image

ఉత్తరప్రదేశ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు దివంగత యాపిల్ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ భార్య లారెన్ పావెల్ హాజరయ్యారు. తొలుత ఆమె వారణాసిలోని కాశీ విశ్వనాథ ఆలయాన్ని సందర్శించారు. కైలాసనంద గిరి జీ మహరాజ్‌తో కలిసి ఆమె ఆలయానికి వచ్చారు. భారతీయ వస్త్రధారణలో ఆలయంలో ప్రార్థనలు చేశారు. అయితే, ఆలయ ఆచారం ప్రకారం విదేశీయులు లింగాన్ని తాకకూడదనే నిబంధన ఉండటంతో ఆమె గర్భగుడి బయటే ఉండిపోయారు.

News January 12, 2025

విటమిన్-డి లభించే ఆహారమిదే..

image

శరీరంలో రోగనిరోధక శక్తి కోసం విటమిన్-డి చాలా అవసరం. ఉరుకుల పరుగుల జీవితంలో ఎండలోకి వెళ్లక కొందరిలో విటమిన్-డి లోపం ఏర్పడుతుంది. అలాంటి వారు విటమిన్-డి లభించే ఆహారం తీసుకోవడం వల్ల దానిని అధిగమించవచ్చు. పుట్ట గొడుగులు, గుడ్డు పచ్చసొన, ఆరెంజ్ జ్యూస్, సాల్మన్ చేప, పాల ఉత్పత్తులు, పొద్దుతిరుగుడు గింజలు, నెయ్యి వంటివి తీసుకుంటే శరీరానికి మేలు చేస్తాయి.

News January 12, 2025

స్టీల్ ప్లాంట్‌ ఉద్యోగులకు వీఆర్ఎస్‌

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం ఉద్యోగులకు స్వచ్ఛంద విరమణ పథకాన్ని(వీఆర్ఎస్) ప్రకటించింది. వచ్చే ఏడాది జనవరి 1 తర్వాత ఉద్యోగంలో ఉన్నవారికి ఇది వర్తిస్తుందని, ఆలోపు రిటైర్ అయ్యేవారికి కుదరదని తెలిపింది. అర్హత కలిగిన వారు ఈ నెల 15 నుంచి 31 తేదీల మధ్యలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. కాగా.. ప్రైవేటీకరణలో భాగంగానే మేనేజ్‌మెంట్ ఈ పథకాన్ని తీసుకొచ్చిందని విశాఖ ఉక్కు పరిరక్షణ కమిటీ ఆరోపించింది.

News January 12, 2025

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పోటీ

image

ఢిల్లీలో వచ్చే నెలలో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్ పార్టీ బరిలోకి దిగుతోంది. ఢిల్లీలో మొత్తం 70 నియోజకవర్గాలుండగా మైనారిటీ ఓట్లు కీలకంగా ఉన్న 10 నుంచి 12 చోట్ల ఆ పార్టీ పోటీ చేయనున్నట్లు సమాచారం. వీటిలో చాందినీ చౌక్, కార్వాన్ నగర్ వంటి కీలక స్థానాలున్నాయి. ఇప్పటికే రెండు స్థానాల్లో ఆ పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. వచ్చే నెల 5న ఎన్నికలు జరగనుండగా, అదే నెల 8న ఫలితాల్ని ప్రకటించనున్నారు.