News April 10, 2024

దానం నాగేందర్‌పై హైకోర్టులో బీఆర్ఎస్ పిటిషన్

image

TG: దానం నాగేందర్ అనర్హత పిటిషన్ వ్యవహారంలో బీఆర్ఎస్ పార్టీ హైకోర్టును ఆశ్రయించింది. బీఆర్ఎస్ తరఫున గెలిచి కాంగ్రెస్‌లో చేరిన దానంపై అనర్హత వేటు వేయాలని కోర్టును కోరింది. దీనిపై స్పీకర్ ఇంకా స్పందించడం లేదని.. త్వరగా చర్యలు తీసుకునేలా సభాపతిని ఆదేశించాలని విజ్ఞప్తి చేసింది. సోమవారం ఈ పిటిషన్‌ను న్యాయస్థానం విచారించనుంది.

News April 10, 2024

బోగస్ ఓట్లతో గెలిచేందుకు వైసీపీ కుట్ర: కొణతాల

image

AP: రాష్ట్రంలో బోగస్ ఓట్లతో గెలవాలని వైసీపీ కుట్ర పన్నుతోందని అనకాపల్లి జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ ఆరోపించారు. ఈ మేరకు బోగస్ ఓట్లను తొలగించాలని ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. గతంలో తిరుపతి ఉపఎన్నికల్లో బోగస్ ఓట్లతో గెలిచారని పేర్కొన్నారు. చాలా చోట్ల డబుల్ ఎంట్రీ, ఒకే ఇంటి నెంబర్‌తో ఓట్లు ఉన్నాయని తెలిపారు.

News April 10, 2024

రాజధాని ఏదో ప్రభుత్వం తేల్చలేదు: ఆర్బీఐ జీఎం

image

AP: అమరావతిలో ఆర్బీఐ కార్యాలయం ఏర్పాటుపై సందిగ్ధత నెలకొంది. రాజధాని ఏదో ఏపీ ప్రభుత్వం తేల్చలేదని ఆర్బీఐ జీఎం సుమిత్ తెలిపారు. గుంటూరుకి చెందిన జాస్తి వీరాంజనేయులు అనే వ్యక్తి రాసిన లేఖకు ఆయన సమాధానమిచ్చారు. అయితే 2016లోనే అమరావతిలో ఆర్బీఐకి 11 ఎకరాలు కేటాయించారని.. కేంద్ర ప్రభుత్వం మ్యాప్‌లోనూ ఏపీ రాజధానిని అమరావతిగా గుర్తించిందని వీరాంజనేయులు గుర్తు చేశారు.

News April 10, 2024

మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు రాహిల్‌కు బెయిల్

image

BRS మాజీ MLA షకీల్ కుమారుడు రాహిల్‌కు హిట్ అండ్ రన్ కేసులో ఊరట లభించింది. ఏప్రిల్ 8న అరెస్టై చంచల్‌గూడ జైలులో ఉన్న అతనికి నాంపల్లి కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ మేరకు పోలీస్ కస్టడీ పిటిషన్‌ను కొట్టివేసింది. కాగా ప్రగతి భవన్ వద్ద కారు ప్రమాదం కేసులో నిందితుడిగా ఉన్న రాహిల్ ఆ తర్వాత దుబాయ్ పారిపోయారు. దుబాయ్ నుంచి హైదరాబాద్ తిరిగి వస్తుండగా పంజాగుట్ట పోలీసులు అరెస్ట్ చేశారు.

News April 10, 2024

హాల్‌టికెట్లు విడుదల

image

AP: 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి మోడల్ స్కూళ్లలో 6వ తరగతి ప్రవేశపరీక్ష హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఈ నెల 21న ఉదయం 10 గంటల నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్ష జరగనుంది. విద్యార్థులు తమ ఐడీ, DOB ఎంటర్ చేసి హాల్‌టికెట్లు పొందవచ్చు. విద్యార్థులు తెలుగు/ఇంగ్లిష్ మాధ్యమాల్లో పరీక్ష రాయవచ్చని విద్యాశాఖ తెలిపింది. హాల్‌టికెట్ల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.

News April 10, 2024

అత్యంత వృద్ధుడు మా దేశంలో ఉన్నాడు: పెరూ

image

వెనిజులకు చెందిన జువాన్‌ మోరా(114) మరణించడంతో బ్రిటన్‌కు చెందిన జాన్ టిన్నిస్‌వుడ్ (111) ప్రపంచంలోనే అత్యంత వృద్ధుడిగా నిలిచిన విషయం తెలిసిందే. అయితే, టెన్నిస్‌వుడ్ కంటే ఎక్కువ వయసు కలిగిన వ్యక్తి తమ దేశంలో ఉన్నారని పెరూ ప్రతినిధులు పేర్కొన్నారు. హువానుకోలోని సెంట్రల్ పెరువియన్ ప్రాంతానికి చెందిన మార్సెలినో అబాద్ 1900లో జన్మించారు. ఆయన వయసు 124 ఏళ్లు. దీనిని అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది.

News April 10, 2024

కర్ణాటక పోలీసులకు ఇన్ఫోసిస్ భారీ విరాళం

image

కర్ణాటక పోలీసులకు ఐటీ దిగ్గజ సంస్థ ఇన్ఫోసిస్ భారీ విరాళాన్ని అందించింది. సైబర్ క్రైమ్‌పై పోరాటానికి గాను రూ.33 కోట్లను బెంగళూరు పోలీసులకు ఇచ్చింది. సంస్థ సీఎస్ఆర్ విభాగం ఈ విషయాన్ని ప్రకటించింది. అంతేకాక సీఐడీ, భారత సమాచార భద్రత మండలితో ఒప్పందాల్ని కుదుర్చుకున్నట్లు తెలిపింది. సైబర్‌ క్రైమ్ దర్యాప్తు కేంద్రంతో తమ అనుబంధాన్ని మరో నాలుగేళ్ల పాటు పొడిగించుకున్నట్లు వెల్లడించింది.

News April 10, 2024

ఎన్నికల తర్వాత టారిఫ్ పెంచనున్న నెట్‌వర్క్స్?

image

టెలికాం సంస్థలు త్వరలో మొబైల్ టారిఫ్ పెంచే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు ముగిశాక జూన్-అక్టోబరు మధ్య సంస్థలు 15%-17% ధరలు పెంచే అవకాశం ఉందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ పెంపుతో ఎక్కువగా ఎయిర్‌టెల్ లబ్ధిపొందుతుందన్నారు. ఎయిర్‌టెల్‌కు యూజర్ నుంచి వచ్చే సగటు రెవెన్యూ ప్రస్తుతం రూ.208గా ఉండగా FY27కు అది రూ.286కి పెరగనుందట. కాగా 2021 DECలో 20%, 2019లో 20-40% చొప్పున టారిఫ్ పెరిగింది.

News April 10, 2024

డీఎంకే అహంకారంలో మునిగిపోయింది: పీఎం మోదీ

image

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో ఆ రాష్ట్ర అధికార పార్టీ డీఎంకేపై పీఎం మోదీ మండిపడ్డారు. ‘ఆ పార్టీ అహంకారంలో మునిగిపోయింది. ఆ దురహంకారాన్ని ప్రజలు హర్షించరు. విభజన రాజకీయాలే డీఎంకే మార్గం. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న ధ్యాస లేదు. మేం రాష్ట్రాల్లో రక్షణ నడవాలను నిర్మిస్తున్నాం. విభజనే లక్ష్యంగా పనిచేసే ఇండియా కూటమి అలా చేయగలదా? వారసత్వ రాజకీయాలే వారి లక్ష్యం’ అని స్పష్టం చేశారు.

News April 10, 2024

స్వల్పంగా పెరిగిన మారుతీ కార్ల ధరలు

image

దిగ్గజ కార్ల సంస్థ మారుతీ సుజుకీ స్విఫ్ట్ సహా పలు గ్రాండ్ విటారా వేరియంట్ల ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. స్విఫ్ట్ కార్ల ధర రూ.25వేలు, గ్రాండ్ విటారాలోని సిగ్మా వేరియంట్ ధర రూ.19వేలు పెంచినట్లు తెలిపింది. నిర్వహణ ఖర్చు పెరిగిన నేపథ్యంలో పలు మోడళ్లకు ధరలను పెంచాల్సి వచ్చిందని సంస్థ వివరణ ఇచ్చింది. మార్చిలో అంతర్జాతీయ, దేశీయ మార్కెట్లలో కలిపి 1,87,196 యూనిట్లు సేల్ అయినట్లు తెలిపింది.