News August 16, 2024

ప్రశ్నించినందుకు వైద్యురాలి ఇంటికి పోలీసులు!

image

కోల్‌కతాలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన హత్యాచార ఘటన మరువక ముందే మరో వైద్యురాలికి చేదు అనుభవం ఎదురైంది. బర్ద్వాన్ విశ్వవిద్యాలయంలో జరిగిన ఓ ఘటనపై సోషల్ మీడియాలో ప్రశ్నించినందుకు పోలీసులు అడ్రెస్ తెలుసుకొని తన ఇంటికి వచ్చినట్లు ఆమె తెలిపారు. రాత్రిపూట పోలీసులు ఇంటికి రావడంతో తన తల్లి భయాందోళనకు గురైందని, పోస్ట్ డిలీట్ చేయాలని వారు బెదిరించినట్లు చెప్పారు. దీనిపై తీవ్ర విమర్శలొస్తున్నాయి.

News August 16, 2024

1.8KM దూరానికి రూ.700.. నెటిజన్ పోస్టు వైరల్

image

క్యాబ్ సర్వీసులు ఇష్టానుసారం రేట్లు పెంచి ప్రయాణికులను దోచుకోవడం సర్వసాధారణమైంది. ఈ వ్యవహారంపై ఓ నెటిజన్ చేసిన పోస్టు వైరలవుతోంది. ‘ఓలా, ఉబర్, ర్యాపిడో తదితర సంస్థలు తక్కువ ధరతో సర్వీస్ అందిస్తామని చెబుతుంటాయి. అయితే కొన్ని వర్షపు చినుకులు రాలగానే 300% అధికంగా డిమాండ్ చేస్తాయి. ఢిల్లీలో 1.8KMల దూరానికి కారు సర్వీసుకు ఏకంగా రూ.699 రేటు చూపుతోంది’ అని అతను రాసుకొచ్చారు.
మీకూ ఇలాంటి సమస్య ఎదురైందా?

News August 16, 2024

RGకర్ ఆస్పత్రి విధ్వంసం కేసులో 19 మంది అరెస్టు

image

RGకర్ ఆస్పత్రి విధ్వంసం కేసులో 19 మందిని అరెస్టు చేశామని కోల్‌కతా పోలీసులు Xలో ప్రకటించారు. వీరిలో ఐదుగురిని సోషల్ మీడియా ఫీడ్‌బ్యాక్ ద్వారా గుర్తించామన్నారు. తాము ఇంతకు ముందు చేసిన పోస్టుల్లో ఇంకెవరినైనా గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రజల మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆస్పత్రి బారికేడ్లపై నిలబడ్డ కొందర్ని సర్కిల్ చేసి ఫొటోలు, వీడియోలను పోలీసులు సోషల్ మీడియాలో పెట్టిన సంగతి తెలిసిందే.

News August 16, 2024

ఓ వైపు వేడుకలు.. మరో వైపు వేధింపులు

image

TG: స్వాతంత్ర్యం వచ్చి 78 ఏళ్లు పూర్తయినా ఓ మహిళ ఇప్పటికీ ఒంటరిగా ప్రయాణించలేకపోతోంది. నిన్న సాయంత్రం HYDలోని JBS మెట్రో స్టేషన్ వద్ద 23 ఏళ్ల యువతిని ఓ వ్యక్తి వేధింపులకు గురిచేశాడు. JBS బస్‌స్టాండ్‌ వైపు వెళ్లేదారిలో వరద చేరడంతో మరోవైపు నుంచి వెళ్తుండగా గుర్తు తెలియని వ్యక్తి ఆమె వెంటపడి తప్పుగా ప్రవర్తించాడు. ఆమె గట్టిగా అరవడంతో అతడు పారిపోయాడు. కాగా మారేడ్‌పల్లి పోలీసులకు ఆమె ఫిర్యాదు చేశారు.

News August 16, 2024

నిండు కుండలా నాగార్జునసాగర్

image

నాగార్జునసాగర్ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంది. 590 అడుగుల నీటి మట్టంతో నిండు కుండను తలపిస్తోంది. అధికారులు 4 క్రస్ట్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లో 79,528 క్యూసెక్కులుగా ఉంది. సాగర్ పూర్తి నిల్వ సామర్థ్యం 312.5టీఎంసీలు కాగా ప్రస్తుతం అంతే మొత్తంలో నిల్వ ఉంది.

News August 16, 2024

ALERT: రెండు గంటల్లో వర్షం

image

రానున్న రెండు గంటల్లో తెలంగాణలోని పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. జగిత్యాల, కామారెడ్డి, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, ఆదిలాబాద్ జిల్లాల్లో మోస్తరు వాన పడే ఛాన్స్ ఉందని పేర్కొంది. గంటకు 40కి.మీ మేర ఈదురుగాలులు వీస్తాయని వెల్లడించింది.

News August 16, 2024

సీఎంతో టాటా గ్రూప్ ఛైర్మన్ భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ భేటీ అయ్యారు. అలాగే పరిశ్రమల సమాఖ్య ప్రతినిధులు కూడా సీఎంతో సమావేశమయ్యారు. రాష్ట్రంలో చేపట్టనున్న నూతన పారిశ్రామిక విధానంపై సీఐఐ ప్రతినిధులతో సీఎం చర్చించారు.

News August 16, 2024

కార్లపై డబుల్ డిస్కౌంట్లు కంటిన్యూ

image

నిరుడు ఆగస్టు నుంచి కార్ల విక్రయాలపై మొదలైన రెట్టింపు రాయితీలు పండుగల సీజన్ పూర్తయ్యే వరకు కొనసాగొచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. FY25ని 3 లక్షల యూనిట్లతో కంపెనీలు మొదలుపెట్టాయి. అమ్మకాలు తగ్గడంతో మరో లక్ష వీటికి జత కలిశాయి. భారత్ స్టేజ్ 6 ఎమిషన్ లక్ష్యాన్ని చేరుకోవాలంటే ఇన్వెంటరీని తగ్గించుకోవాలని కంపెనీలు భావిస్తున్నాయి. అందుకే దసరా, దీపావళి, క్రిస్మస్ పండుగలకు ఆఫర్లు ఇవ్వనున్నాయి.

News August 16, 2024

22న శంకర్‌దాదా MBBS రీరిలీజ్

image

చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 22న శంకర్‌దాదా MBBS మూవీ మరోసారి థియేటర్లలో ప్రేక్షకులను అలరించనుంది. జయంత్ సి.పరాన్జీ డైరెక్షన్ వహించిన ఈ చిత్రం 2004లో విడుదలై సూపర్ హిట్‌గా నిలిచింది. మెగాస్టార్ కామెడీ టైమింగ్, ఏటీఎం పాత్రలో శ్రీకాంత్ నటన సినిమాకు హైలైట్‌గా నిలిచాయి. సోనాలీ బింద్రే హీరోయిన్‌గా నటించారు. బాలీవుడ్‌లో తెరకెక్కిన మున్నాభాయ్ MBBSకు రీమేక్‌గా ఈ మూవీ రూపొందింది.

News August 16, 2024

తగ్గిన భయాలు.. పెరిగిన మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. మెరుగైన అమెరికా అమ్మకాలు, సీపీఐ డేటా, త్వరలోనే వడ్డీరేట్ల కోత, రిసెషన్ భయాలు తగ్గిపోవడమే ఇందుకు కారణాలు. ప్రస్తుతం బీఎస్ఈ సెన్సెక్స్ 505 పాయింట్ల లాభంతో 79609, ఎన్ఎస్ఈ నిఫ్టీ 150 పాయింట్లు ఎగిసి 24295 వద్ద ట్రేడవుతున్నాయి. LTIM, విప్రో, అపోలో హాస్పిటల్స్, M&M, టీసీఎస్ టాప్ గెయినర్స్. హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఎక్కువ నష్టపోయాయి.