News May 12, 2024

IPLలో ఈరోజు మ్యాచ్‌లు

image

ఐపీఎల్‌లో భాగంగా నేడు మధ్యాహ్నం 3.30 గంటలకు చెన్నై, రాజస్థాన్.. రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ, ఆర్సీబీ తలపడనున్నాయి. ప్లే ఆఫ్స్ రేసు టఫ్‌గా ఉన్న నేపథ్యంలో నాలుగు జట్లకూ ఈ మ్యాచులు కీలకమే. ముఖ్యంగా చెన్నై, ఢిల్లీ, ఆర్సీబీ జట్లకు నేడు చావో రేవో అన్న పరిస్థితి ఉంది. రాజస్థాన్‌ 16 పాయింట్లతో ఉన్నప్పటికీ.. తొలి రెండు స్థానాల్లో నిలవాలంటే చెన్నైపై గెలవాల్సిందే.

News May 12, 2024

ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలివే!

image

AP: ఎన్నికల్లో సమస్యాత్మక ప్రాంతాలుగా 14 సెగ్మెంట్లను అధికారులు గుర్తించారు. మాచర్ల, ఆళ్లగడ్డ, పెదకూరపాడు, ఒంగోలు, తిరుపతి, చంద్రగిరి, విజయవాడ సెంట్రల్, పుంగనూరు, పీలేరు, పలమనేరు, రాయచోటి, తంబళ్లపల్లి తదితర నియోజకవర్గాలు వీటిలో ఉన్నాయి. వీటన్నింటికీ కలిపి 28,897 పోలింగ్ కేంద్రాల్లో వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేయనున్నారు. కాగా.. ఎన్నికల విధులకు 3.30 లక్షల మంది సిబ్బంది హాజరుకానున్నట్లు తెలుస్తోంది.

News May 12, 2024

నేడు పోలింగ్ కేంద్రాలకు సిబ్బంది

image

AP: పోలింగ్ విధుల్లో ఉండే సిబ్బంది ఈరోజు సాయంత్రం తమకు కేటాయించిన ప్రాంతాలకు ఈవీఎంలతో వెళ్లనున్నారు. పోలింగ్‌కు 90 నిముషాల ముందు మాక్‌పోల్ నిర్వహిస్తామని ఏపీ ఎన్నికల ప్రధానాధికారి ముకేశ్ కుమార్ మీనా తెలిపారు. రేపు ఉదయం సరిగ్గా ఏడింటికి పోలింగ్ స్టార్ట్ అవుతుందని వెల్లడించారు. దీనికి సంబంధించి ఇప్పటికే పోలింగ్ ఏజెంట్లకు మార్గదర్శకాలు జారీ చేసినట్లు ఆయన స్పష్టం చేశారు.

News May 12, 2024

ఈసారి భారీ పోలింగ్ నమోదు?

image

AP: గత ఎన్నికలతో పోలిస్తే ఆంధ్రాలో ఈసారి పోలింగ్ భారీగా నమోదయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. పొరుగు రాష్ట్రాల నుంచి ప్రజలు మునుపెన్నడూ లేనంతగా ఓటర్లు స్వస్థలాలకు తండోపతండాలుగా తరలివచ్చారు. ఈసారి యువత చైతన్యవంతంగా కనిపిస్తున్నారని, ఫలితాల విషయంలో ఇది కీలకం కానుందని ఎన్నికల పరిశీలకులు చెబుతున్నారు. అటు పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్‌కూ ఉద్యోగుల నుంచి అనూహ్య స్పందన లభించిన సంగతి తెలిసిందే.

News May 12, 2024

అరుదైన ఘనతకు చేరువలో కోహ్లీ

image

ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరో అరుదైన రికార్డుకు చేరువలో ఉన్నారు. ఈరోజు ఢిల్లీతో జరగనున్న మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. ప్రొఫెషనల్ క్రికెట్‌లో వంద సెంచరీల మార్కును చేరుకోనున్నారు. ప్రస్తుతం విరాట్ ఫస్ట్ క్లాస్‌లో 36 సెంచరీలు, లిస్ట్-ఏలో 54 సెంచరీలు, టీ20ల్లో 9 సెంచరీలు చేసి మొత్తం 99 శతకాల వద్ద ఉన్నారు. గత మ్యాచ్‌లో ఆయన 8 పరుగుల తేడాతో శతకాన్ని చేజార్చుకున్న సంగతి తెలిసిందే.

News May 12, 2024

యూపీలో 93మంది ఎన్నికల సిబ్బందిపై కేసు

image

యూపీలోని లక్నోలో ఎన్నికల విధుల శిక్షణకు గైర్హాజరైన 93మంది సిబ్బందిపై కేసు నమోదుకానుంది. ఎన్నికల సంఘం నిబంధనల్ని అనుసరించి వీరందరిపైనా చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నామని, ఎఫ్ఐఆర్ నమోదు చేస్తున్నామని అధికారులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల కోసం స్థానిక జననారాయణ్ పీజీ కళాశాలలో సెషన్ శిక్షణ నిర్వహించగా 93మంది రాలేదని స్పష్టం చేశారు. యూపీలో 80 సీట్లకు 7 దశల్లో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి.

News May 12, 2024

యూటీఐ సమస్యకు బ్రిటన్ పరిశోధకుల వ్యాక్సిన్

image

మూత్రనాళ ఇన్ఫెక్షన్ చాలామందిని ఇబ్బంది పెడుతుంటుంది. ప్రధానంగా స్త్రీలను వేధించే ఈ సమస్యకు ఇంగ్లండ్‌లోని బర్క్‌షైర్ పరిశోధకులు ఓ పరిష్కారాన్ని కనుగొన్నారు. యూరోమ్యూన్ అనే టీకాను వారు రూపొందించారు. దీన్ని నాలిక కింద స్ప్రే చేస్తే, శరీరంలోని 88 రకాల బ్యాక్టీరియాలపై పోరాడుతుందని వారు వివరించారు. ప్రయోగాల్లో భాగంగా టీకా తీసుకున్న వారిలో 9ఏళ్ల పాటు ఏ ఇన్ఫెక్షన్ రాలేదని వెల్లడించారు.

News May 12, 2024

విమానం నుంచి దూకేందుకు కేరళ వ్యక్తి యత్నం

image

ఓ ప్రయాణికుడు విమానం నుంచి దూకేందుకు యత్నించడం దుబాయ్ నుంచి మంగళూరు వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో కలకలం రేపింది. అతడిని కేరళకు చెందిన మహ్మద్‌గా గుర్తించినట్లు సిబ్బంది తెలిపారు. తమతో తప్పుగా ప్రవర్తించాడని, అనంతరం ఫ్లైట్ నుంచి దూకేస్తానంటూ బెదిరించాడని పేర్కొన్నారు. అడ్డుకుని ల్యాండ్ అవగానే విమానాశ్రయ అధికారులకు అప్పగించామని స్పష్టం చేశారు. ఘటనపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.

News May 12, 2024

ఆ ఫ్రాంచైజీ నాకింకా డబ్బివ్వలేదు: శ్రీశాంత్

image

2011లో ఐపీఎల్‌లో చేరిన కొచ్చి టస్కర్స్ కేరళ ఒక ఏడాదికే రద్దైన సంగతి తెలిసిందే. టీమ్ ఇండియా మాజీ బౌలర్ శ్రీశాంత్ ఆ జట్టుకు ఆడారు. తనతో పాటు శ్రీలంక ఆటగాళ్లు ముత్తయ్య మురళీధరన్, మహేల జయవర్ధనే వంటి వారికి కూడా ఆ జట్టు యాజమాన్యం బాకీ ఉందని శ్రీశాంత్ ఆరోపించారు. ఆ మొత్తం కోసం ఎదురుచూస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై బీసీసీఐ జోక్యం చేసుకుని ఏడాదికి 18శాతం వడ్డీ చొప్పున చెల్లింపు జరిగేలా చూడాలని కోరారు.

News May 12, 2024

రఫా నుంచి పౌరులు వెళ్లిపోవాలి: ఇజ్రాయెల్

image

గాజాలోని రఫా ప్రాంతంపై దాడులు నిర్వహిస్తున్న నేపథ్యంలో అక్కడ ఉన్న పాలస్తీనా పౌరులందరూ గాజాలోని వేరే ప్రాంతాలకు తరలిపోవాలని ఇజ్రాయెల్ తేల్చిచెప్పింది. ఈమేరకు ఆ దేశ సైనిక ప్రతినిధి ట్విటర్‌లో సూచించారు. దీంతో ఎక్కడికెళ్లినా దాడులు తప్పడం లేదంటూ పాలస్తీనా పౌరులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు గత రాత్రి ఇజ్రాయెల్ చేపట్టిన దాడుల్లో 37మంది పౌరులు మృతిచెందారని పాలస్తీనా ఆరోగ్య శాఖ ప్రకటించింది.