Guntur

News August 21, 2024

శాసనమండలి ప్రతిపక్షనేత పదవికి అప్పిరెడ్డి రాజీనామా

image

ఏపీ శాసనమండలి ప్రతి పక్షనేత పదవికి లేళ్ల అప్పిరెడ్డి రాజీనామా చేశారు. సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు అవకాశం కల్పించాలని వైఎస్ జగన్‌ను అప్పిరెడ్డి కోరారు. బుధవారం అప్పిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఫ్లోర్’ పదవికి సీనియర్ నేత బొత్స సత్యనారాయణకు ఇస్తే బాగుంటుందని వైఎస్ జగన్‌ను కోరా. ఆ పదవిలో సీనియర్ నేత ఉంటే బాగుంటుందని చెప్పా. నా ప్రతిపాదనకు ఆయన ఆమోదం తెలిపారని వివరించారు.

News August 21, 2024

తాడేపల్లి: రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

image

గుంటూరు జిల్లా తాడేపల్లి పరిధి కనకదుర్గమ్మ వారధిపై బుధవారం రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మంగళగిరి ఏపీఎస్పీ 6వ బెటాలియన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్న కె.తారక రామారావు అక్కడికక్కడే మృతి చెందారు. ద్విచక్ర వాహనాన్ని లారీ వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News August 21, 2024

అంతరాష్ట్ర దొంగల్ని అరెస్ట్ చేసిన గుంటూరు పోలీసులు

image

అంతర్రాష్ట్ర దొంగల ముఠాని గుంటూరు సీసీఎస్ పోలీసులు బుధవారం పట్టుకున్నారు. అబ్బినేనిగుంట వారిపాలెం అడ్డరోడ్డు వద్ద ముగ్గురు నిందితులను పట్టుకొని వారి నుంచి రూ.4,94,500 విలువైన బంగారు, వెండి నగలను స్వాధీనం చేసుకున్నారు. ఎస్పీ సతీశ్ కుమార్ ఆదేశాల మేరకు నేరవిభాగం అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, సీసీఎస్ డీఎస్పీ శివాజీ పర్యవేక్షణలో ఇన్స్ పెక్టర్ V.చౌదరి‌, ఎస్సై రాజ్ కుమార్ నిందితులను పట్టుకున్నారు.

News August 21, 2024

హాస్టల్లో బయటి ఆహారాన్ని అనుమతించొద్దు: మంత్రి సవిత

image

BC సంక్షేమ వసతి గృహాలు, గురుకులాల నిర్వహణలో అధికారులు, వార్డెన్లు నిరంతరం అప్రమత్తంగా ఉండాలని మంత్రి సవితా స్పష్టం చేశారు. ఈ మేరకు మంగళవారం రాత్రి ఆమె ఓ ప్రకటన విడుదల చేశారు. నిర్లక్ష్యంగా వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బయటి ఆహారాన్ని వసతి గృహాల్లోకి అనుమతించొద్దని ఆదేశించారు. విద్యార్థులు బయటకు వెళ్లకుండా చూడాలన్నారు. వసతి గృహాల పరిసరాలు శుభ్రంగా ఉంచాలన్నారు.

News August 21, 2024

GNT: సీఎం చంద్రబాబు నేటి షెడ్యూల్ ఇదే!

image

సీఎం చంద్రబాబు నాయుడు బుధవారం కార్యక్రమం వివరాలను సీఎం కార్యాలయం విడుదల చేసింది. సీఎం 12.00 గంటలకు వెలగపూడి సచివాలయానికి వెళతారు. ముందుగా హోం శాఖపై సమీక్ష చేస్తారు. అనంతరం ఇసుక విధానం అమలు, రవాణా శాఖ, యువజన సర్వీసులు-క్రీడల శాఖపై సీఎం రివ్యూ చేస్తారు. రివ్యూ కార్యక్రమంలో సంబంధిత శాఖల మంత్రులు, అధికారులు పాల్గొంటారని సీఎం కార్యాలయం తెలియజేసింది

News August 21, 2024

గుంటూరు: భారత్ బంద్.. పరీక్షల తేదీల్లో మార్పులు

image

దళిత సంఘాలు భారత్ బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయ పరిధిలో బుధవారం జరిగే పరీక్షల తేదీలలో మార్పులు చేసినట్లు పరీక్షల నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ఓ ప్రకటనలో తెలిపారు. బీఈడీ మొదటి సెమిస్టర్ పరీక్షలు 27కి, బీటెక్ మొదటి, 2వ సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షలు, బీటెక్ 2వ ఏడాది ఫస్ట్ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్షలు వచ్చే నెల 3వ తేదీకి మార్పు చేసినట్లు తెలిపారు.

News August 21, 2024

తాడేపల్లి: లోకేశ్‌తో హెచ్‌సీఎల్ ప్రతినిధుల భేటీ

image

ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ హెచ్‌సీఎల్ రాష్ట్రంలో విస్తరణకు సిద్ధమైంది. సంస్థ ప్రతినిధులు మంగళవారం ఉండవల్లిలో మంత్రి నారా లోకేశ్‌తో సమావేశమయ్యారు. ఏపీలో విస్తరణ ద్వారా మరో 5500 వేల మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ప్రతినిధులు తెలిపారు. ఫేజ్-2లో భాగంగా నూతన కార్యాలయ భవనం నిర్మాణం చేపట్టి మరో పది వేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పారు.

News August 20, 2024

మంగళగిరి జనసేన కార్యాలయంలో మినీ మ్యూజియం

image

మంగళగిరిలోని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రైవేట్ క్యాంప్ కార్యాలయంలో తాను నిర్వహిస్తున్న మంత్రిత్వ శాఖలకు సంబంధించిన గొప్పతనాన్ని తెలియజేసేలా మినియేచర్ బొమ్మలతో మ్యూజియం తరహా విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా ఇప్పటికే సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఇస్రో ఘనతను తెలియజేశారు. బొమ్మలు, శిల్పాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేయించారు. ఈ మేరకు మంగళవారం పవన్ మ్యూజియంలో ఉన్న ఫొటోలు బయటకు వచ్చాయి.

News August 20, 2024

టీడీఆర్ బాండ్ల జారీపై మంత్రి సమీక్ష

image

టీడీఆర్ బాండ్ల జారీలో అక్రమాలకు అడ్డుకట్ట వేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ తెలిపారు. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో మున్సిపల్, టౌన్ ప్లానింగ్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉన్నతాధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. టౌన్ ప్లానింగ్ విభాగంతో రిజిస్ట్రేషన్ శాఖ అనుసంధానం చేసేలా ప్రత్యేక సాఫ్ట్వేర్ రూపకల్పన చేయాలన్నారు.

News August 20, 2024

చెరుకుపల్లి: పిడుగుపాటుకు గురై మహిళ మృతి

image

పిడుగుపాటుకు గురై మహిళ మృతి చెందిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. చెరుకుపల్లి మండల పరిధిలోని పొన్నపల్లి గ్రామానికి చెందిన వారే తిరుపతమ్మ(35) పొలంలో నాటు వేస్తుంది. ఈ క్రమంలో పిడుగుపాటుకు గురై అక్కడికక్కడే మరణించింది. మృతురాలికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.