India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో జలధార పథకం కింద భూగర్భ జలాల మట్టం పెంపుదలకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డీకే బాలాజీ అధికారులను ఆదేశించారు. జలధార కార్యాచరణ ప్రణాళికపై సోమవారం మచిలీపట్నం కలెక్టరేట్ మీటింగ్ హాలులో సంబంధిత అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలోని అన్ని చెరువుల పూడికలను ఉపాధి హామీ పథకం కింద తీసేందుకు మంజూరు ఉత్తర్వులు సిద్ధం చేయాలన్నారు.

జిల్లాలోని ప్రతి పోలింగ్ కేంద్రానికి బూత్ స్థాయి ఏజెంట్లను తక్షణమే నియమించాలని కలెక్టర్ డీకే బాలాజీ రాజకీయ పక్షాల ప్రతినిథులను కోరారు. సోమవారం తన ఛాంబర్లో రాజకీయ పక్షాలతో సమావేశమై పలు అంశాలపై సమీక్షించారు. రానున్న సమావేశం లోపు ఏజెంట్లను నియమించాలన్నారు. ఏజెంట్ల నియామకం పూర్తయిన వెంటనే వారికి శిక్షణా తరగతులు నిర్వహిస్తామన్నారు. దీని ద్వారా స్వచ్ఛమైన ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు.

మచిలీపట్నం కార్పొరేషన్ పరిధిలో తాగునీటి సమస్య జటిలమవుతోంది. వేసవి ఉష్ణోగ్రతలు పెరుగుతున్నా, నేతలు రాజకీయాల్లో మునిగితేలుతూ ప్రజల దాహాన్ని విస్మరిస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. పోతేపల్లి, ఈడేపల్లి, బాలరామునిపేట, గిలకలదిండి, భాస్కరపురం వంటి ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. బోర్ల నుంచి వచ్చే ఉప్పునీరే దిక్కవడంతో, ప్రజలు బయట ప్రైవేట్ ప్లాంట్ల వద్ద నీటిని కొనుగోలు చేస్తున్నారు.

మచిలీపట్నం కార్పొరేషన్లో పన్నుల వసూళ్లు నత్తనడకన సాగుతున్నాయి. రూ.39 కోట్ల లక్ష్యానికి గానూ కేవలం రూ.16 కోట్లే వసూలయ్యాయి. అక్రమ కట్టడాల కూల్చివేతపై చూపే ఉత్సాహం వసూళ్లలో కనిపించడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పొరుగున ఉన్న గుడివాడ మెరుగైన ఫలితాలు సాధించగా, జిల్లా కేంద్రం మాత్రం వెనుకబడింది. ఏప్రిల్ నెలాఖరు వరకు ఉన్న 50% వడ్డీ రాయితీతోనైనా అధికారులు బకాయిలు రాబడతారో లేదో చూడాలి.

పెడన నియోజకవర్గంలోని గూడూరు, కృత్తివెన్ను, బంటుమిల్లి మండలాల్లో మట్టి మాఫియా బరితెగిస్తోంది. చిన్నగొల్లపాలెం, కృత్తివెన్ను ప్రాంతాల నుంచి అక్రమంగా తవ్విన మట్టి ఏకంగా జిల్లాలు దాటుతోంది. గ్రామస్థులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది. కొంకేపూడి-ఈదుముడి కనెక్టింగ్ బ్రిడ్జిపై నిత్యం వందలాది లారీలు తిరుగుతుండడంతో ఆ వంతెన బలహీనపడి కూలిపోయే స్థితికి చేరుకుంది.

మచిలీపట్నంలో ‘సర్వే డే’ పురస్కరించుకొని నిర్వహించిన రక్తదాన శిబిరంలో కలెక్టర్ డీకే బాలాజీ, జాయింట్ కలెక్టర్ నవీన్ స్వయంగా రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. రక్తదానం ప్రాణదానంతో సమానమని, అత్యవసర సమయాల్లో ప్రాణాలు కాపాడేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. కార్యక్రమంలో అధికారులు, సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని రక్తదానం చేశారు.

కృష్ణాజిల్లాలో మరోసారి దేవాలయ భూములపై వివాదం రేకెత్తింది. మచిలీపట్నం బచ్చుపేట వేంకటేశ్వర స్వామి దేవాలయానికి చెందిన భూముల్లో అక్రమ మైనింగ్ కార్యకలాపాలు జరుగుతున్నాయంటూ పెడన(M) కొంకెపూడి గ్రామస్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దేవాలయానికి చెందిన సుమారు 4 ఎకరాల భూమిలో నల్ల మట్టిని భారీగా తవ్వి ట్రాక్టర్లలో తరలిస్తున్నారన్నారు. ఒక్కో ట్రాక్టర్ మట్టి రూ.900కు విక్రయిస్తున్నారని ఆరోపిస్తున్నారు.

మచిలీపట్నం 6వ డివిజన్లో నిర్మాణంలో ఉన్న ఓ జనసైనికుడి ఇళ్లు కూల్చివేత కూటమిలో అంతర్యుద్ధానికి దారి తీసిందనే చర్చ నడుస్తోంది. అక్రమ కట్టడమంటూ ఇంటిని ఇటీవల మున్సిపల్ అధికారులు కూల్చివేశారు. ఇది కూటమిలోని TDP Vs జనసేనగా మారింది. మంత్రి కొల్లు రవీంద్రేమో దీన్ని అక్రమ కట్టడమని అధికారుల చర్యలను సమర్ధిస్తే.. జనసేన MP బాలశౌరి కూల్చివేతపై ఆగ్రహం వ్యక్తం చేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది.

కృష్ణా జిల్లా కలెక్టర్ డీకే బాలాజీ బాపులపాడు మండలం మడిచర్లలోని పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. 9వ తరగతి విద్యార్థులతో మమేకమై వారి చదువు అలవాట్లను తెలుసుకున్నారు. ప్రతిరోజూ ఉదయం 5 గంటలకు లేచి చదవాలన్నారు. పరీక్షల ముందు కాకుండా నిరంతరం అభ్యాసం చేయాలని సూచించారు. మార్కుల కోసం కాకుండా జ్ఞానం కోసం చదవాలని ప్రోత్సహించారు. వాలంటీర్లు వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని ఆదేశించారు.

కృష్ణా జిల్లాలో పశు గ్రాసం కొరతతో పాడి రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎకరం గడ్డి కొనుగోలుకు సుమారు రూ. 10,000 ఖర్చవుతుండగా, రవాణా, కూలీల ఖర్చులతో మరో రూ. 5,000 అదనంగా వెచ్చించాల్సి వస్తోంది. మొత్తం రూ. 15 వేల వరకు ఖర్చు చేసినా సరిపడా గడ్డి దొరకని పరిస్థితి నెలకొంది. దీంతో పశువుల పోషణ కష్టమై పాడి పరిశ్రమపై తీవ్ర ప్రభావం పడుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Sorry, no posts matched your criteria.