Khammam

News March 5, 2026

జిమ్‌లో వ్యాయామం చేస్తూ సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి మృతి

image

ఖమ్మం జిల్లాకు చెందిన నాగండ్ల అనిల్ చౌదరి (36) హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌లో జిమ్‌లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో మృతి చెందారు. జూబ్లీహిల్స్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. రోడ్ నం.36లోని ఎస్బో జిమ్‌లో ఈ నెల 3 మధ్యాహ్నం వ్యాయామం పూర్తి చేసుకున్న అనిల్ చౌదరి వాష్ రూమ్‌కు వెళ్లిన సమయంలో అస్వస్థతకు గురై కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించగా గుండెపోటుతో మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

News March 5, 2026

ఖమ్మం:కొత్త పింఛన్ల కోసం ఎదురుచూపులు

image

ఖమ్మం జిల్లాలో కొత్త పింఛన్ల మంజూరుపై ఉత్కంఠ కొనసాగుతోంది. ప్రభుత్వం మారి రెండేళ్లు గడుస్తున్నా, సుమారు 17 వేల మంది అర్హులు ఆశగా వేచి చూస్తున్నారు. గత మూడేళ్లుగా కొత్త దరఖాస్తులపై స్పందన లేకపోవడంతో వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. త్వరలో జరగనున్న బడ్జెట్ సమావేశాల్లోనైనా తమకు ‘చేయూత’ లభిస్తుందని బాధితులు ఆశీస్తున్నారు

News March 5, 2026

ఖమ్మం: సర్కారు దవాఖానలో ‘దాహ’ మంటలు..

image

ఖమ్మం ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో తాగునీటి ఎద్దడి రోగులను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి వచ్చే వందలాది మంది రోగులు, వారి సహాయకులకు కనీసం మంచినీరు కూడా అందకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎండలు ముదురుతుండటంతో బయట నీళ్ల బాటిళ్లు కొనలేక పేదలు అవస్థలు పడుతున్నారు. గతంలో దాతలు ఏర్పాటు చేసిన ఆర్‌ఓ (RO) ప్లాంట్ ప్రస్తుతం నిరుపయోగంగా మారడంతో ఈ దుస్థితి నెలకొంది.

News March 5, 2026

ఖమ్మం అడవుల్లో కెమెరాకు చిక్కిన చిరుత, ఎలుగుబంటి

image

ఖమ్మం జిల్లాలోని రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతాల్లో వన్యప్రాణుల సంచారం పెరిగింది. అటవీ శాఖ ఏర్పాటు చేసిన కెమెరా ట్రాప్‌లలో ఇటీవల చిరుతపులి, ఎలుగుబంటికి సంబంధించిన దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇది జిల్లా అటవీ పర్యావరణ వ్యవస్థలో జీవవైవిధ్యం ఆరోగ్యంగా ఉందనడానికి నిదర్శనమని అధికారులు తెలిపారు. వన్యప్రాణుల జనాభాను శాస్త్రీయంగా పర్యవేక్షించేందుకు, వాటి రక్షణకు అటవీ శాఖ నిరంతరం కృషి చేస్తోంది.

News March 5, 2026

భానుడి భగభగ.. ఖమ్మంలో 37 డిగ్రీల సెగ!

image

వేసవి కాలం ఆరంభంలోనే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఎండలు సెగలు పుట్టిస్తున్నాయి. గత వారం రోజులుగా ఉష్ణోగ్రతలు అకస్మాత్తుగా పెరగడంతో ప్రజలు ఉక్కపోతతో అల్లాడుతున్నారు. మంగళవారం జిల్లాలో గరిష్ఠంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. గతేడాది 47 డిగ్రీల వరకు వెళ్లిన రికార్డులను ఈసారి అధిగమించే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. ఎండల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

News March 5, 2026

ఖమ్మంలో ఇంటర్‌ జవాబు పత్రాల మూల్యాంకనం ప్రారంభం

image

ఖమ్మం జిల్లాలో ఇంటర్మీడియట్‌ వార్షిక పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకన ప్రక్రియ బుధవారం లాంఛనంగా ప్రారంభమైంది. నయాబజార్‌ ప్రభుత్వ జూనియర్ కళాశాల కేంద్రంలో తొలుత సంస్కృతం పేపర్ల దిద్దుబాటును చేపట్టినట్లు DIEO రవిబాబు తెలిపారు. ఈ విధులకు మొత్తం 48 మంది అధ్యాపకులను కేటాయించగా, తొలిరోజు 32 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు పారదర్శకంగా, పకడ్బందీగా మూల్యాంకనం నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేశారు.

News March 5, 2026

రేపు ఖమ్మంలో జాబ్ మేళా

image

ఖమ్మం నగరంలోని టేకులపల్లి ప్రభుత్వ ఐటీఐ, మోడల్ కెరీర్ సెంటర్ వేదికగా శుక్రవారం ఉదయం 10 గంటలకు జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి అధికారిణి మాధవి తెలిపారు. ప్రైవేట్ రంగంలో 322 ఖాళీల భర్తీకి ఈ ప్రక్రియ చేపట్టారు. ఫార్మసిస్ట్, సీఎస్‌ఏ, జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు అర్హులు ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు. ఎంపికైన వారికి హైదరాబాద్‌లో ఉద్యోగంతో పాటు ఉచిత వసతి కల్పిస్తామని వెల్లడించారు.

News March 4, 2026

సీఎంఆర్‌ బియ్యం సేకరణలో జాప్యం వద్దు: అదనపు కలెక్టర్

image

మిల్లింగ్‌ చేసిన సీఎంఆర్‌ (కస్టమ్‌ మిల్లింగ్‌ రైస్‌) బియ్యాన్ని గోదాములకు చేరవేయడంలో ఎలాంటి ఆలస్యం జరగకూడదని అదనపు కలెక్టర్‌ పి. శ్రీనివాస రెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో గోడౌన్‌ మేనేజర్లు, ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ ఇన్‌చార్జులతో ఆయన సమీక్ష నిర్వహించారు. మిల్లర్లు బియ్యం తీసుకొచ్చినప్పుడు సకాలంలో లోడింగ్‌, అన్ లోడింగ్‌ చేసేలా హమాలీలను సిద్ధంగా ఉంచాలన్నారు.

News March 4, 2026

ఖమ్మం జిల్లాలో నయా మోసం

image

ఖమ్మం జిల్లాలో నకిలీ మొక్కల ముఠా కలకలం సృష్టిస్తోంది. కేరళ నుంచి నాణ్యమైన మామిడి మొక్కలు తెస్తామంటూ నకిలీ బిల్లులతో రైతులను నమ్మిస్తున్నారు. ఒక్కో మొక్కకు రూ.370 నిర్ణయించి, అడ్వాన్సులు వసూలు చేసి ఉడాయిస్తున్నారు. తిరుమలాయపాలెం మండలం పాతర్లపాడుకు చెందిన రైతు నుంచి రూ.23 వేలు కాజేశారు. అపరిచిత వ్యక్తులకు ఫోన్ పే, జీపే చేయవద్దని, నకిలీ నర్సరీల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.

News March 4, 2026

ఖమ్మంలో ఈ-నామ్ 2.0 సేవలు షురూ

image

ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌లో కేంద్రం ప్రవేశపెట్టిన ‘ఈ-నామ్ 2.0’ వెర్షన్ అందుబాటులోకి వచ్చింది. పంట నాణ్యత తనిఖీకి ఏఐ (AI) సాంకేతికతను వాడుతున్నారు. బిడ్డింగ్ ధర, తూకం, కమీషన్ వివరాలు నేరుగా రైతు ఫోన్‌కు మెసేజ్ వస్తాయి. దీనివల్ల పారదర్శకత పెరగడమే కాకుండా, రైతులు తమ ఉత్పత్తులను దేశంలో ఎక్కడైనా అమ్ముకునే వీలుంటుందని మార్కెట్ అధికారులు వెల్లడించారు.