Nalgonda

News April 13, 2026

నల్గొండ: రేపు మంత్రి కోమటిరెడ్డి పర్యటన

image

రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మంగళవారం నల్గొండలో పర్యటించనున్నారు. డా.బి.ఆర్. అంబేడ్కర్ జయంతి సందర్భంగా నిర్వహించే కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం తిప్పర్తిలో రూ. 10.5 కోట్లతో నిర్మించిన ఫోర్ లేన్ రహదారి, సెంట్రల్ లైటింగ్ పనులను మంత్రి పరిశీలిస్తారు. అక్కడ నూతనంగా ఏర్పాటు చేసిన అంబేడ్కర్, బాబు జగ్జీవన్ రామ్ విగ్రహాలను ఆవిష్కరిస్తారు.

News April 13, 2026

నల్గొండ: వ్యర్థాల నిర్వహణలో సిమెంట్ పరిశ్రమల పాత్ర కీలకం

image

పట్టణాల్లో పేరుకుపోతున్న ఘన వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణపై సిమెంట్ పరిశ్రమలు దృష్టి సారించాలని కలెక్టర్ బి.చంద్రశేఖర్ ఆదేశించారు. నల్గొండ, సూర్యాపేట జిల్లాల సిమెంట్ ఫ్యాక్టరీల యాజమాన్యాలతో సమీక్ష నిర్వహించారు. డంపింగ్ యార్డులకు 100 కి.మీ పరిధిలో ఉన్న పరిశ్రమలు, తమ ఇంధన అవసరాల్లో కనీసం 6 శాతం RDFను వాడాలని సూచించారు. వ్యర్థాల పునర్వినియోగం ద్వారా పర్యావరణాన్ని కాపాడవచ్చని ఆయన పేర్కొన్నారు.

News April 13, 2026

NLG: మైనారిటీ యువతకు గుడ్ న్యూస్..!

image

జిల్లాలోని నిరుద్యోగ మైనారిటీ యువతకు విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు TOMCOM ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి విజయేందర్ రెడ్డి తెలిపారు. ఆస్ట్రేలియా, జర్మనీ, ఒమన్, ఖతార్, గ్రీస్ దేశాలలో వెల్డర్లు, నర్సులు, ఎలక్ట్రీషియన్లు, అగ్రికల్చర్ ఇంజనీర్లు, హోటల్ సిబ్బంది వంటి వివిధ విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయన్నారు. అభ్యర్థులు రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు.

News April 13, 2026

నల్గొండ: ముగిసిన పదో తరగతి పరీక్షలు

image

జిల్లాలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా.. సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లావ్యాప్తంగా 106 పరీక్షా కేంద్రాల్లో రెగ్యులర్ విద్యార్థులు 19,698 మందికి గాను 19,661 మంది (99.84%) హాజరయ్యారు. ప్రైవేట్ విద్యార్థులు 13 మందికి గాను 12 మంది (92.30%) పరీక్ష రాశారు. జిల్లా విద్యాశాఖాధికారి 06 కేంద్రాలను, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 45 కేంద్రాలను తనిఖీ చేశాయి.

News April 13, 2026

నల్గొండ: ధాన్యం కుప్పలతో బైక్ స్కిడ్.. ఒకరి మృతి

image

మాటూరు గ్రామ పరిధిలో రోడ్డుపై ఆరబోసిన ధాన్యం కుప్పల వల్ల జరిగిన ప్రమాదంలో అడవిదేవులపల్లికి చెందిన భద్రయ్య మృతి చెందారు. మిర్యాలగూడ – అడవిదేవులపల్లి రహదారిపై ధాన్యం పట్టాల వల్ల బైక్ అదుపుతప్పడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. భద్రయ్య మృతితో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. రోడ్లపై ధాన్యం ఆరబోయకుండా నిరోధించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

News April 13, 2026

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వే పరిశీలన

image

నాగార్జునసాగర్ డ్యాం స్పిల్‌వేను కేంద్ర డ్యాం సేఫ్టీ బృందం ఛైర్మన్ శర్మ ఆధ్వర్యంలో పరిశీలించింది. స్పిల్‌వేపై ఏర్పడిన గుంతలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసి, భద్రతా ప్రమాణాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు. బకెట్ పోర్షన్‌లో నీరు ఉండటంతో కొంత ఇబ్బంది ఎదురైనప్పటికీ, ప్రాజెక్టు రక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కీలక సూచనలు చేశారు. ఈ పర్యటనలో సత్యనారాజ్, గౌతమ్ పాల్గొన్నారు.

News April 13, 2026

NLG: అంగన్‌వాడీలో చిన్నారులకు డ్రెస్‌కోడ్..!

image

అంగన్‌వాడీ కేంద్రాల్లో చదువుకునే చిన్నారుల కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 2026-27 విద్యాసంవత్సరం నుంచి చిన్నారులకు ప్రత్యేక డ్రెస్‌కోడ్‌ను అమలు చేయనున్నట్లు ఐసీడీఎస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ కృష్ణవేణి తెలిపారు. జిల్లావ్యాప్తంగా 9 ప్రాజెక్టుల పరిధిలో 2093 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని తెలిపారు. 45,543 మంది చిన్నారులకు త్వరలో దుస్తులు పంపిణీ చేస్తామన్నారు.

News April 13, 2026

NLG: ఒకే సీజన్‌లో రెండోసారి వాత

image

కాంప్లెక్స్ ఎరువుల ధరలు భారీగా పెరగడంతో ఉమ్మడి జిల్లాలో రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతోంది. ఈ యాసంగి సీజన్‌లోనే రెండోసారి ధరలు పెరగగా, తాజాగా బస్తాకు 225 రూపాయల నుంచి 300 రూపాయల వరకు అదనపు భారం పడింది. ఒక్క డీఏపీ, యూరియా మినహా పొటాష్ సహా మిగతా అన్ని రకాల ఎరువుల ధరలను కంపెనీలు అమాంతం పెంచేశాయి. దీనివల్ల ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రైతులపై సుమారు 109.50 కోట్ల రూపాయల మేర అదనపు ఆర్థిక భారం పడనుంది.

News April 13, 2026

నల్గొండ జిల్లాలో అమ్మాయిలదే హవా

image

ఇంటర్ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో NLG గత ఏడాది ఉన్న 68.84% ఉత్తీర్ణతను అధిగమించి, ఈసారి 73.69%తో అద్భుత ప్రగతిని కనబరిచింది. దీనివల్ల రాష్ట్రస్థాయి ర్యాంకింగ్‌లో గతేడాది 22వ స్థానంలో ఉండగా ఈసారి ఏకంగా 12వ స్థానానికి ఎగబాకి తన సత్తా చాటింది. ప్రథమ సంవత్సరంలోనూ ఉత్తీర్ణత శాతం 57.99 శాతం నుంచి 62.81%కి పెరగడంతో పాటు ర్యాంకు మెరుగుపడటం విశేషం. జిల్లాలో రెండేళ్లుగా అమ్మాయిలదే హవా నడుస్తోంది.

News April 13, 2026

నల్గొండ: రీఛార్జ్‌తో గ్యాస్ సరఫరా: కలెక్టర్

image

మొబైల్ తరహాలోనే ఇకపై గ్యాస్ వినియోగానికి ప్రీపెయిడ్ రీఛార్జ్ విధానం అందుబాటులోకి రానుందని కలెక్టర్ చంద్రశేఖర్ వెల్లడించారు. ఇళ్ల వద్ద ప్రత్యేక మీటర్లు అమర్చి, ‘మేఘా గ్యాస్’ యాప్ ద్వారా నగదు జమ చేసుకునే వెసులుబాటు కల్పిస్తున్నారు. వలిగొండ నుంచి నార్కెట్‌పల్లి మీదుగా నల్గొండ వరకు పైప్‌లైన్ పనులు శరవేగంగా సాగుతున్నాయని అయన తెలియజేశారు.