Nalgonda

News October 12, 2025

నల్గొండ: లిఫ్ట్ ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం

image

NLG అబ్బాయ్య కాలనీలోని ఖాజా మంజీల్ అపార్ట్‌మెంట్‌లో లిఫ్ట్ ప్రమాదం జరిగి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి ఖాజా మొయినుద్దీన్ మృతి చెందాడు. లిఫ్ట్ డోర్ తెరుచుకోవడంతో రెండో అంతస్తు నుంచి కిందపడిపోయిన మొయినుద్దీన్‌పై లిఫ్ట్ పడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2025

మిర్యాలగూడలో వ్యభిచార గృహంపై దాడి

image

మిర్యాలగూడ హౌసింగ్ బోర్డు కాలనీలో వ్యభిచార గృహంపై వన్ టౌన్ పోలీసులు దాడులు చేశారు. ఇద్దరు నిర్వాహకులు, ఒక మహిళ, ఒక విటుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి రెండు బైకులు, రెండు సెల్‌ఫోన్లు, రూ.1,500 నగదును స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News October 11, 2025

‘వాడపల్లి ఎస్సైపై చర్యలు’ కథనం అవాస్తవం: ఎస్పీ

image

వాడపల్లి ఎస్సై, కానిస్టేబుల్‌పై చర్యలు తీసుకోవాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశించినట్లుగా ప్రచురించిన వార్తల్లో వాస్తవం లేదని జిల్లా ఎస్పీ స్పష్టం చేశారు. వాస్తవాలు తెలుసుకోకుండా అసత్య ప్రచారం చేస్తే, సంబంధిత వ్యక్తులు, పత్రికలపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ హెచ్చరించారు. అవాస్తవ కథనాలు ప్రచురించడం తగదని సూచించారు.

News October 11, 2025

నల్గొండ: స్పందన కరువు: పెరిగిన ఫీజే కారణం?

image

జిల్లాలో మద్యం షాపుల దరఖాస్తులకు స్పందన కరువైంది. 2025–27 సంవత్సరానికి 154 దుకాణాలకు గాను ఇప్పటివరకు కేవలం 96 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి. 2023లో 155 షాపులకు 7,037 దరఖాస్తులు వచ్చాయి. ప్రభుత్వం దరఖాస్తు ఫీజును భారీగా పెంచడం వల్లే ఈసారి ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. గత నెల 26న ఎక్సైజ్ శాఖ టెండర్ నోటిఫికేషన్ జారీ చేసింది.

News October 11, 2025

NLG: కమీషన్ డబ్బులు ఇచ్చేది ఎప్పుడో!?

image

రేషన్ డీలర్లకు రాష్ట్ర ప్రభుత్వం కమీషన్ బకాయిలు చెల్లించకపోవడంతో పరేషాన్ అవుతున్నారు. నెలల తరబడి కమీషన్ డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని, దుకాణాల అద్దెలు సైతం కట్టలేకపోతున్నామని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కమీషన్ చెల్లింపులు ఆలస్యం కావడంతో జిల్లాలో 997 రేషన్ షాపుల డీలర్లు నిరసన తెలిపారు. ప్రభుత్వం స్పందించి కమీషన్ బకాయిలను చెల్లించాలని కోరారు.

News October 11, 2025

NLG: ఎవరైనా టెండర్ వేయొచ్చు.. భయపడొద్దు

image

కొత్త పాలసీ ప్రకారం మద్యం దుకాణాలకు అర్హులంతా నిర్భయంగా దరఖాస్తు చేయాలని జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ శాఖ సూపరింటెండెంట్ సంతోష్ తెలిపారు. జిల్లాలో 154 దుకాణాలకు ST వర్గానికి 4, SC వర్గానికి 14, గౌడ సామాజిక వర్గానికి 34 దుకాణాలు కేటాయించినట్లు పేర్కొన్నారు. రిజర్వేషన్ల దుకాణాలకు తమ సంఘాలతో కలిసి మాత్రమే టెండర్ వేయాలని ఇతరులతో కలిసి వేయరాదంటూ కొందరు ఒత్తిడి చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు.

News October 11, 2025

చెరువుగట్టు హుండీ ఆదాయం @40.46 లక్షలు

image

ప్రసిద్ధ శైవక్షేత్రమైన చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వరస్వామి దేవస్థానంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు కానుకల రూపంలో సమర్పించుకున్న నగదు మొత్తం రూ. 40,46,640లు లభించాయి. గట్టుపైన స్వామివారి ప్రధానాలయ హుండీ, ఉపాలయాల హుండీలను తెరిచి లెక్కించగా రూ.34,07,100, గుట్ట కింద పార్వతీ అమ్మవారి ఆలయం వద్ద హుండీలను తెరిచి లెక్కించగా రూ.6,39,540ల ఆదాయం లభించిందని ఈవో నవీన్ కుమార్ తెలిపారు.

News October 11, 2025

NLG: మద్యం దుకాణాలకు 96 దరఖాస్తులు

image

నల్గొండ జిల్లాలో మద్యం దుకాణాలకు శుక్రవారం మరో 22 దరఖాస్తులు అందినట్లు జిల్లా ప్రొహిబిషన్ & ఎక్సైజ్ అధికారి సంతోష్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 154 మద్యం దుకాణాలు ఉండగా.. నేటి వరకు 96 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఈనెల 18 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని పేర్కొన్నారు.

News October 11, 2025

NLG: ‘కారు’ బేరంతో బయటపడ్డ బాగోతం

image

అక్రమ సంపాదచనతో బాలాజీ రాజకీయాల్లో చక్రం తిప్పాలని చూశాడు. ST మహిళకు రిజర్వ్ అయిన నల్గొండ ZP ఛైర్మన్ పీఠాన్ని తన కుటుంబ సభ్యులకు కట్టబెట్టేందుకు జిల్లాకు చెందిన ఓ అధికార పార్టీ ముఖ్య నేతతో మంతనాలు జరిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ పదవి కోసం సదరు నేత ‘రేంజ్‌రోవర్’ కారును కానుకగా అడిగినట్లు, ఈ ‘కారు కక్కుర్తి’ బేరం బయటకు పొక్కడంతోనే అసలు బాగోతం వెలుగులోకి వచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది.

News October 11, 2025

వడ్డీ మోసం.. నిందితుడిపై చర్యలు తీసుకుంటాం: ఎస్పీ

image

నల్గొండ: అధిక వడ్డీ మోసాల నిందితుడు బాలాజీ నాయక్‌పై కఠిన చర్యలు తీసుకుంటామని, బాధితులకు న్యాయం చేస్తామని ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ స్పష్టం చేశారు. బాలాజీ దుబాయ్‌కు వెళ్లిన వార్తలు అవాస్తవమని, అతని పాస్‌పోర్ట్‌ను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రెండు ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నామని, త్వరలోనే పట్టుకుంటామని ఆయన అన్నారు. అనుచరుల బెదిరింపుల ఆరోపణలపైనా దృష్టి సారించామన్నారు.