India's largestHyperlocal short
news App
Get daily news updates that are tailored for you based on your preferred language & location.

జిల్లాలో రెండో వాహనం కొనుగోలు చేసేవారికి రవాణా శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. టూవీలర్ ఉండి, కారు కొంటే ఇప్పటివరకు వసూలు చేస్తున్న 2% అదనపు పన్నును ప్రభుత్వం రద్దు చేసింది. సోమవారం (23వ తేదీ) నుంచి ఈ నూతన విధానంతో ‘వాహన్’ పోర్టల్ అందుబాటులోకి వచ్చింది. ఇకపై ఎలాంటి అదనపు భారం లేకుండా వాహనాలు కొనుగోలు చేయొచ్చు. దీని ద్వారా క్రయవిక్రయాలు, లైసెన్సుల సేవలు కూడా మరింత సులభతరం కానున్నాయి.

జిల్లా కేంద్రంతో పాటు ప్రధాన పట్టణాల్లో గ్యాస్ కొరత సెగ ‘కర్రీ పాయింట్ల’కు తగులుతోంది. నిత్యం వందలాది మంది బ్యాచిలర్లు, ఉద్యోగులు, విద్యార్థులకు ఆకలి తీర్చే ఈ కేంద్రాలు గ్యాస్ సిలిండర్ల సరఫరా లేక వరుసగా మూతపడుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కూరగాయలు, ఆకుకూరల ధరలు సామాన్యులకు అందుబాటులోనే ఉన్నాయి. కానీ, వాటిని వండటానికి అవసరమైన గ్యాస్ సిలిండర్లు సకాలంలో అందకపోవడం శాపంగా మారింది.

నల్గొండ జిల్లాలో బాల్య వివాహాలు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. అధికారులు అడ్డుకున్న వివాహాల లెక్కలే ఇందుకు నిదర్శనం. 2022-23లో 37, 2023-24లో 24, 2024-25లో 37, ఇక 2025-26లో ఏకంగా 56 బాల్య వివాహాలను అధికారులు అడ్డుకున్నారు. ఆడపిల్లలను భారం అనుకుంటూ కొందరు తల్లిదండ్రులు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేస్తున్నారు. ఎక్కడైనా బాల్య వివాహాలు జరిగితే 1098, 181, 100కు కాల్ చేసి సమాచారం ఇవ్వాలని అధికారులు కోరారు.

రాజధానిలో బీజేపీ తలపెట్టిన ‘అసెంబ్లీ ముట్టడి’ పిలుపుతో జిల్లా వ్యాప్తంగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ పర్యటనను అడ్డుకోవడమే ధ్యేయంగా పోలీసులు జిల్లా వ్యాప్తంగా బీజేపీ కీలక నేతలు, కార్యకర్తలను ఎక్కడికక్కడ అక్రమంగా అరెస్టు చేస్తున్నారు. కాగా శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును ప్రభుత్వం కాలరాస్తుందని బిజెపి జిల్లా నాయకత్వం మండిపడుతోంది.

జిల్లాలో ఎండలు మండిపోతుండటంతో నీటి వినియోగం ఒక్కసారిగా పెరిగింది. ఇదే అదనుగా భావిస్తున్న కొందరు కేటుగాళ్లు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. ‘మినరల్ వాటర్’ పేరుతో నాణ్యత లేని కలుషిత నీటిని విక్రయిస్తూ అక్రమంగా ఆర్జిస్తున్నారు. ఫలితంగా జిల్లా వ్యాప్తంగా వైరల్ జ్వరాలు, దగ్గు, జలుబు వంటి వ్యాధులు ప్రబలుతున్నాయి. జిల్లాలో పుట్టగొడుగుల్లా వాటర్ ప్లాంట్లు వెలిశాయి.

జిల్లాలోని ఒక కార్పొరేషన్, 7 మున్సిపాలిటీల్లో ఆస్తిపన్ను వసూళ్లపై పుర యంత్రాంగం వేగం పెంచింది. ఈ నెల 31తో గడువు ముగియనుండటంతో, లక్ష్యాన్ని చేరుకోవడానికి అధికారులు ‘స్పెషల్ డ్రైవ్’ నిర్వహిస్తున్నారు. పన్ను చెల్లింపుదారుల సౌకర్యార్థం యూపీఐ, క్యూఆర్ కోడ్, నెట్ బ్యాంకింగ్ వంటి డిజిటల్ మార్గాలను అందుబాటులోకి తెచ్చారు. కేవలం 8 రోజులే సమయం ఉండటంతో మున్సిపల్ సిబ్బంది వసూళ్లలో వేగం పెంచారు.

మహిళల వంటింటి కష్టాలను తీర్చేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘మహాలక్ష్మి’ పథకం పట్టాలు తప్పుతోంది. రూ.500కే గ్యాస్ సిలిండర్ అందిస్తామన్న హామీపై NLG జిల్లాలోని పేద, మధ్యతరగతి మహిళలు పెట్టుకున్న నమ్మకం సడలుతోంది. 12 నెలలకు పైగానే లబ్ధిదారుల ఖాతాల్లో సబ్సిడీ సొమ్ము జమకాకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 6.12 లక్షలకు పైగా LPG గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి.

జిల్లాలోని సాగునీటి ప్రాజెక్టుల విషయంలో జరుగుతున్న అన్యాయంపై సీపీఐ సమరశంఖం పూరించింది. ముఖ్యంగా డిండి ప్రాజెక్టు నిర్మాణంలో ప్రదర్శిస్తున్న వివక్షను ఎండగడుతూ భారీ ఉద్యమాలకు ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ అన్యాయాన్ని నిరసిస్తూ ఏప్రిల్ 1, 2 తేదీలలో బీసీ టన్నెల్, ఏదుల రిజర్వాయర్ ప్రాజెక్టులను సీపీఐ బృందం సందర్శించి వాస్తవాలను పరిశీలించనుంది. ఏప్రిల్ 5న అఖిలపక్ష సదస్సును నిర్వహించనున్నారు.

జిల్లాలోని అన్నదాతల నిరీక్షణకు తెరపడనుంది. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘రైతు భరోసా’ నిధులు రేపటి నుంచి రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి. యాసంగి సీజన్ ముగింపు దశకు వస్తున్న తరుణంలో, ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం రైతాంగంలో కొత్త ఉత్సాహాన్ని నింపింది. జిల్లాలో ఈ సీజన్లో రికార్డు స్థాయిలో 5.56 లక్షల ఎకరాల్లో వరి సాగు జరిగింది. సాగు కోసం అప్పులు చేసి ఇబ్బందులు పడుతున్న రైతులకు ఊరట కలగనుంది.

నల్గొండ జిల్లా ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో రక్షణ కరువైంది. ఎక్స్రే విభాగంలో శిక్షణ పొందుతున్న ఓ పారామెడికల్ విద్యార్థినిపై అక్కడే అవుట్సోర్సింగ్ టెక్నీషియన్గా పనిచేస్తున్న వ్యక్తి గత కొంతకాలంగా లైంగిక వేధింపులకు తెగబడుతున్నాడు. నిందితుడి వేధింపులు మితిమీరడంతో భరించలేకపోయిన బాధితురాలు శనివారం ‘డయల్ 100’కు ఫిర్యాదు చేసింది.
Sorry, no posts matched your criteria.