Kurnool

News April 9, 2026

చండ్ర రాజేశ్వరరావు మహానేత: సీపీఐ నేత రామకృష్ణ

image

చండ్ర రాజేశ్వరరావు పార్టీ బలోపేతానికి విశేష కృషి చేసిన మహానేత అని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ కొనియాడారు. పత్తికొండ సీపీఐ కార్యాలయంలో చండ్ర రాజేశ్వరరావు వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. రామకృష్ణ మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి, పేదలకు భూములు పంచిన త్యాగశీలి అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లేందుకు యువత, పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.

News April 9, 2026

246 చెరువులను పునరుద్ధరించనున్నాం: కలెక్టర్

image

నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు కోసం 100 రోజుల ప్రత్యేక కార్యక్రమం చేపడుతున్నట్లు కలెక్టర్ డా.సిరి తెలిపారు. కోసిగి మండలం డి.బెలగల్‌లో చెక్ డ్యామ్, నాగమ్మ చెరువును ఆమె గురువారం పరిశీలించారు. వాగులు-వంకల అడ్డంకులు తొలగించి చెరువులు నింపాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో భూగర్భ జల మట్టం సగటు 6.6 మీటర్ల నుంచి 4 మీటర్ల లోపు తగ్గించడమే లక్ష్యమన్నారు. 246 చెరువులను పునరుద్ధరించనున్నట్లు ఆమె తెలిపారు.

News April 9, 2026

ఆదోనిలో బాల్యవివాహం అడ్డగింత

image

ఆదోనిలోని తిరుమల నగర్‌లో బాల్యవివాహం జరగబోతోందనే సమాచారం అందడంతో అధికారులు బుధవారం అప్రమత్తమయ్యారు. ఇద్దరు మైనర్లకు పెళ్లి జరుపుతున్నారన్న సమాచారంతో శక్తి టీం అక్కడికి వెళ్లి విచారణ చేపట్టింది. కుటుంబ సభ్యులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. బాల్యవివాహం చట్టరీత్యా నేరమని వివరించారు. ఆదేశాలు పాటించకపోతే కేసులు నమోదు చేసి, పిల్లలను చైల్డ్ హోమ్‌కు తరలిస్తామని హెచ్చరించారు.

News April 8, 2026

కౌమార దశలో గర్భధారణ ప్రమాదకరం: కలెక్టర్

image

కౌమార దశలో గర్భధారణ బాలికల ఆరోగ్యం, విద్య, భవిష్యత్తుకు ప్రమాదకరమని కలెక్టర్ ఏ.సిరి తెలిపారు. స్త్రీ శిశు సంక్షేమ, వైద్య ఆరోగ్యశాఖల ఆధ్వర్యంలో రూపొందించిన అవగాహన పోస్టర్‌ను బుధవారం కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. బాల్య వివాహాల నివారణ, బాలికల విద్య ప్రోత్సాహం ద్వారా సమస్యను అరికట్టాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ విజయ, డీఎంహెచ్‌వో డా.కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

News April 8, 2026

ఎస్సై పదోన్నతి పరీక్షలను పరిశీలించిన ఐజీ

image

కర్నూలు జిల్లా దిన్నదేవరపాడు వద్ద ఉన్న జిల్లా పోలీసు శిక్షణా కేంద్రంలో జరుగుతున్న ఎస్సై పదోన్నతి ఎంపిక పరీక్షలను ఐజీ/అనంతపురం రేంజ్ ఇన్‌ఛార్జ్ డీఐజీ డా. షిమోషి, ఎస్పీ విక్రాంత్ పాటిల్ పరిశీలించారు. రాయలసీమ జోన్‌కు చెందిన 72 మంది ఏఎస్సైలకు డ్రిల్, ఆయుధాల పరిజ్ఞానం, నేరస్థల పరిశీలన, మౌఖిక పరీక్షలు నిర్వహించారు. ప్రతిభ ఆధారంగా పదోన్నతులు కల్పించనున్నారు.

News April 8, 2026

డ్రాగన్ బోట్ పోటీల్లో ఏకపక్ష నిర్ణయాలపై అభ్యంతరం

image

రాజమండ్రిలో మే 30, 31న జరగనున్న అంతర్జాతీయ డ్రాగన్ బోట్ లీగ్ పోటీలలో ఏపీ స్పోర్ట్స్ అథారిటీ ఏకపక్షంగా వ్యవహరిస్తోందని AP డ్రాగన్ బోట్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అవినాష్ ఆరోపించారు. కర్నూలులో ఆయన మాట్లాడుతూ.. అసోసియేషన్‌కు సమాచారం ఇవ్వకుండా పోటీలు నిర్వహించడం సరికాదన్నారు. అధికారిక గుర్తింపు ఉన్న ఫెడరేషన్‌లను సంప్రదించి పోటీలు నిర్వహించాలని, లేకపోతే న్యాయపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు.

News April 8, 2026

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత: ఎస్పీ

image

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత అని ఎస్పీ విక్రాంత్ పాటిల్ పేర్కొన్నారు. కిమ్స్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన కర్నూలులో హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన ప్రారంభించారు. యముడి వేషధారణతో నిర్వహించిన ఈ ర్యాలీ రాజ్ విహార్ సర్కిల్ నుంచి కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. హెల్మెట్ లేని వాహనదారులకు ఉచితంగా హెల్మెట్లు పంపిణీ చేశారు. జరిమానా కోసం కాదని, ప్రాణ రక్షణ కోసం హెల్మెట్ తప్పనిసరి అని ఎస్పీ అన్నారు.

News April 8, 2026

కర్నూలు: ఈతకు వెళ్లి 8వ తరగతి విద్యార్థి గల్లంతు

image

కర్నూలు జిల్లా సి.బెళగల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 8వ తరగతి విద్యార్థి తెలుగు మధు మంగళవారం చెరువు సమీపంలోని బావిలో ఈతకు వెళ్లి గల్లంతయ్యాడు. మంగళవారం సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు రంగమ్మ, మద్దిలేటి వెతకగా బావి వద్ద కుమారుని దుస్తులు కనిపించాయి. సమాచారం అందుకున్న జాలర్లు బావిలో గాలించినా మధు ఆచూకీ లభించలేదు. కుమారుని పరిస్థితి తలచుకుని తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమవుతున్నారు.

News April 8, 2026

కర్నూలు సమీపంలో రోడ్డు ప్రమాదం

image

కర్నూలు సమీపంలోని పెద్దపాడు వద్ద రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొని 10 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన వారిని సమీప ఆస్పత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.

News April 7, 2026

పరిశ్రమల పనులు వేగవంతం చేయాలి: కలెక్టర్

image

జిల్లాలో ఏర్పాటు చేస్తున్న పరిశ్రమల స్థాపన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి సూచించారు. మంగళవారం పరిశ్రమల పురోగతిపై యాజమాన్యాలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పనుల స్థితిగతులను ఆరా తీసిన కలెక్టర్.. ఎదురయ్యే సమస్యలను వెంటనే తెలియజేయాలని చెప్పారు. అధికారులు పూర్తి సహకారం అందిస్తున్నారని, పనులు వేగంగా పూర్తి చేస్తామని యాజమానులు వెల్లడించారు.