Nizamabad

News January 30, 2025

రుద్రూర్ చెరువులో చేపల వల చుట్టుకొని యువకుడి మృతి

image

రుద్రూర్ మండల కేంద్రంలోని పెద్ద చెరువులో బాబన్న(22) అనే యువకుడు చేపల వల చుట్టుకుని ప్రమాదవశాత్తు మృతి చెందినట్టు ఎస్‌ఐ సాయన్న తెలిపారు. బుధవారం ఉదయం నుంచి బాబన్న కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామంలో గాలించారు. సాయంత్రం చెరువులో బాబన్న మృతదేహం కన్పించడంతో పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ వివరించారు.

News January 30, 2025

NZB: గుర్తుతెలియని వృద్ధుడు మృతి

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహం లభ్యమైనట్లు వన్ టౌన్ SHO రఘుపతి బుధవారం తెలిపారు. టౌన్ పరిధిలోని గంజి మార్కెట్ ప్రాంతంలో ఓ వ్యక్తి మృతి చెంది ఉండడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుడు వయసు 55-60 సంవత్సరాల ఉండొచ్చని అంచనా వేశారు. ఎవరికైనా తెలిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.

News January 30, 2025

రెంజల్: చెరువులో మహిళ మృతదేహం లభ్యం

image

మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన రెంజల్​ మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బోర్గాం​ గ్రామానికి చెందిన స్వర్ణ, ఆమె భర్త పోతన్నకు నిత్యం గొడవలు జరుగుతుండేవి. బుధవారం స్థానిక చెరువులో ఆమె మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని వెలికి తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

News January 30, 2025

నిజామాబాద్: 31న సాగునీటి ప్రాజెక్టులపై జాగృతి రౌండ్ టేబుల్ సమావేశం

image

సాగునీటి ప్రాజెక్టులపై కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలను పటాపంచలు చేయడానికి ఈ నెల 31న సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలంగాణ జాగృతి వెల్లడించింది. ఈ సమావేశం ఉదయం 11 గంటల నుంచి జరుగుతుందని తెలిపారు. సమావేశంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కీలకోపన్యాసం చేయనున్నారని కార్యకర్తలు వెల్లడించారు.

News January 30, 2025

ధర్పల్లి: పని ఒత్తిడితో ఇంజినీర్ ఆత్మహత్య(UPDATE)

image

మిషన్ భగీరథ ఏఈఈ సాయి చరణ్ పని ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు డిచ్పల్లి ఎస్ఐ షరీఫ్ తెలిపారు. ఈ నెల 28న ధర్పల్లి లో విధులకు వెళుతున్నానని చెప్పి సాయి చరణ్ డిచ్పల్లి మండలం నడిపల్లి గ్రామ శివారులో పురుగుల మందు తాగినట్లు వివరించారు. HYDలోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ వివరించారు. మృతుని సోదరి హారిక ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

News January 30, 2025

NZB: జిల్లా కలెక్టర్‌కు ఒలింపిక్ సంఘం సన్మానం

image

జిల్లా ఒలింపిక్ సంఘం బాధ్యులు బుధవారం జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హన్మంతును మర్యాద పూర్వకంగా కలిసి సన్మానించారు. నగరంలోని 7 ఎకరాల 35 గుంటల భూమిని క్రీడా ప్రాంగణానికి కేటాయించడంపై కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లా పాత కలెక్టర్ మైదానం వద్ద గల పాత కలెక్టరెట్ బిల్డింగ్ స్థలాన్ని క్రీడలకు అనుకూలంగా చదును చేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశారు.

News January 30, 2025

NZB: విద్యుత్ కార్యాచరణ ప్రణాళికపై సమీక్ష

image

రానున్న వేసవి కాలానికి సంబందించి విద్యుత్ కార్యాచరణ ప్రణాళికపై బుధవారం నిజామాబాద్ లోని TG NPDCL కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఇందులో నిజామాబాద్ సర్కిల్ నోడల్ అధికారి బి.అశోక్ (సీఈ, ఆపరేషన్‌) పురోగతిలో ఉన్న పనులు, ఇంకా చేపట్టాల్సిన పనుల పై సమీక్షా నిర్వహించి మార్గ నిర్దేశం చేశారు. ఈ సమీక్షలో జిల్లా ఎస్.ఈ.రాపల్లి రవీందర్, సూర్య నరసింహ తదితరులు పాల్గొన్నారు.

News January 29, 2025

ధర్పల్లి: మిషన్ భగీరథ ఏఈఈ ఆత్మహత్య

image

ధర్పల్లిలో మిషన్ భగీరథ AEEగా విధులు నిర్వహిస్తున్న సాయి చరణ్(25) డిచ్‌పల్లి మండలం నడిపల్లి శివారులో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు బుధవారం తెలిపారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్‌కు చెందిన ఆయన మూడు నెలల కిందట మొదటి పోస్టింగ్‌లో ధర్పల్లిలో విధుల్లో చేరారు. NZB సుభాష్ నగర్‌లో ఉంటున్నారు. ఆత్మహత్యకు కారణాలు తెలియాల్సి ఉంది.

News January 29, 2025

NZB: ఏసీబీకి చిక్కిన ఎస్సై

image

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని వినాయక్ నగర్ రుక్మిణి ఛాంబర్ వద్ద కామారెడ్డి జిల్లా లింగంపేట్ ఎస్ఐ సుధాకర్ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా చిక్కారు. వాహనాల అమ్మకాలకు సంబంధించిన వ్యాపారి నుండి ఎస్ఐ రూ.12,500 లంచం డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీ అధికారులను కలిసి ఫిర్యాదు చేశారు. కాగా ఎస్ఐ నిజామాబాద్‌లో డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు ఎస్ఐని పట్టుకుని నాంపల్లి కోర్టుకు తరలించారు.

News January 29, 2025

ఎడపల్లి: చిరుత సంచారం కలకలం

image

ఎడపల్లి మండలం అలీసాగర్ ప్రాజెక్ట్ సమీపంలో చిరుత సంచారం కలకలం రేపింది. స్థానిక బెరుకు గుట్ట వద్ద చిరుత కనిపించిందని సమాచారం రావడంతో అటవీశాఖ అధికారులు పాదముద్రలు సేకరించారు. ఈ ముద్రలు చిరుతవేనా కాదా అని తెలియాల్సి ఉందని అధికారులు పేర్కొన్నారు. అయితే గతంలోనూ ఈ ప్రాంతంలో చిరుత సంచరించినట్లు ఆధారాలున్నాయని.. స్థానికులు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు అప్రమత్తంగా ఉండాలని అటవీ శాఖ అధికారి ప్రతాప్ పేర్కొన్నారు.