News September 18, 2024

రూ.7వేల కోట్ల నష్టం వస్తే.. రూ.700 కోట్లు కేటాయించారు: మల్లాది

image

AP: విజయవాడ వరద బాధితులకు దాదాపు రూ.7వేల కోట్ల నష్టం వాటిల్లితే.. ప్రభుత్వం రూ.700 కోట్లే కేటాయించిందని మాజీ MLA మల్లాది విష్ణు విమర్శించారు. ‘ఆస్తి పన్ను, ఒక నెల విద్యుత్ ఛార్జీ రద్దు చేయాలి. దెబ్బతిన్న ఆటోకి రూ.10 వేలు చాలవు.. కొత్త ఆటో ఇవ్వాలి. MSMEలను ఆదుకోవాలి. రూ.2లక్షల వడ్డీలేని రుణాలు ఇవ్వాలి’ అని డిమాండ్ చేశారు. బాధితులకు రూ.50 వేలు ఆర్థిక సాయం ఇవ్వాలని దేవినేని అవినాశ్ కోరారు.

News September 18, 2024

కేరళలో ఎంపాక్స్ కలకలం

image

కేరళలో ఎంపాక్స్ కలకలం రేగింది. యూఏఈ నుంచి మలప్పురం వచ్చిన 38 ఏళ్ల వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం అతడిని ఐసోలేషన్‌లో ఉంచినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. కాగా ఇది దేశంలోనే రెండో ఎంపాక్స్ కేసు. మొట్టమొదటి కేసు ఢిల్లీలో నమోదైంది. హరియాణాలోని హిస్సార్‌కు చెందిన ఓ వ్యక్తికి ఇవే లక్షణాలుండటంతో పరీక్షించగా నెగటివ్‌గా తేలింది.

News September 18, 2024

పార్టీ నేతలతో జగన్ భేటీ

image

AP: తాజా రాజకీయ పరిణామాలపై మాజీ సీఎం వైఎస్ జగన్ సమావేశం నిర్వహించారు. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో నెల్లూరు, పల్నాడుతో పాటు పలు జిల్లాల నేతలు పాల్గొన్నారు. నేతలు వెళ్లిపోయినా కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని జగన్ భరోసా ఇచ్చారు. ఎవరూ తొందరపాటు చర్యలకు దిగవద్దని ఆయన కోరారు.

News September 18, 2024

41 ఏళ్ల క్రితమే జమిలి ఎన్నికల ప్రస్తావన..

image

➦1983లో వన్ నేషన్ వన్ ఎలక్షన్ జరపాలని సూచించిన ఎన్నికల సంఘం
➦1999లో ఎన్నికల చట్ట సంస్కరణలపై లా కమిషన్ నివేదిక.
➦ 2018లో జమిలి ఎన్నికలపై లా కమిషన్ నివేదిక విడుదల
➦2019లో జమిలి ఎన్నికలు నిర్వహిస్తామని ప్రకటించిన ప్రధాని మోదీ
➦2023 SEP 2న మాజీ రాష్ట్రపతి కోవింద్ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు
➦2024 మార్చి 14న నివేదిక సమర్పించిన కమిటీ
➦2024 సెప్టెంబర్ 18న జమిలి ఎన్నికలకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం

News September 18, 2024

మా గుండె చప్పుడు ఒక్కటే: పవన్ కళ్యాణ్

image

AP: తాము పైకి 3 వేర్వేరు పార్టీలు(టీడీపీ, జనసేన, బీజేపీ)గా కనిపిస్తున్నా తమ గుండెల్లో మోగేది ఒకటే చప్పుడని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. మంగళగిరిలో NDA శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడారు. ‘3 భిన్నమైన పార్టీలు. ఆత్మ ఒక్కటే. మూడు పార్టీలు ఏకతాటిపై ముందుకెళ్లాలి. రాష్ట్రం అద్భుతంగా ఉండాలి. బలమైన అభివృద్ధి సాధించాలన్నదే ఏకైక లక్ష్యం’ అని ఆయన వెల్లడించారు.

News September 18, 2024

తెలుగు హీరో సినిమాలో హీరోయిన్‌గా కరీనా?

image

బాలీవుడ్ హీరోయిన్ కరీనా కపూర్ తెలుగు హీరో నటిస్తున్న ఓ భారీ బడ్జెట్ సినిమాలో అవకాశం దక్కించుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. మహేశ్ బాబు-రాజమౌళి సినిమా లేదా సందీప్ వంగా-ప్రభాస్ ‘స్పిరిట్’లో ఏదో ఒక సినిమాకు ఆమె సైన్ చేసినట్లు బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. కాగా ఆమె ఇటీవలే సినీ పరిశ్రమలో 25 ఏళ్లు పూర్తిచేసుకున్నారు.

News September 18, 2024

సింధు జలాల ఒప్పందంలో సవరణకు భారత్ ప్రతిపాదన

image

పాక్‌తో ఉన్న సింధుజలాల ఒప్పందంలో మార్పులు చేయాలని భారత్ యోచిస్తోంది. ఆ మేరకు ఆ దేశానికి తాజాగా నోటిఫై చేసింది. 6 దశాబ్దాల క్రితం ఇరు దేశాలు సింధు జలాల ఒప్పందాన్ని చేసుకున్నాయి. దాని ప్రకారం సింధు, జీలం, చీనాబ్ నదులు పాక్‌కు, రవి, బియాస్, సట్లెజ్ నదులు భారత్‌కు చెందుతాయి. అయితే భారత వాటా నదుల్లో కూడా ప్రాజెక్టులు కట్టకూడదని పాక్ అభ్యంతరపెడుతోంది. ఈ నేపథ్యంలోనే భారత్ మార్పులు చేయాలనుకుంటోంది.

News September 18, 2024

‘ప్రకాశం’లో వైసీపీకి భారీ కుదుపు

image

AP: మాజీ మంత్రి, జగన్ బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామాతో ప్రకాశం జిల్లాలో YCP భారీ కుదుపునకు గురైంది. ఆ జిల్లాలో పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న బాలినేని తప్పుకోవడంతో YCP చుక్కాని లేని నావలా తయారైంది. జిల్లా రాజకీయాలను కనుసైగతో శాసించిన ఆయన ఆ పార్టీని వీడడం YCPకి తీరని లోటే. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో తనకంటూ సొంత కోటరీ ఏర్పాటు చేసుకున్న బాలినేని గుడ్ బై చెప్పడం ఆ పార్టీకి బిగ్ మైనస్.

News September 18, 2024

చంద్రబాబుకి భయం లేదు: పవన్ కళ్యాణ్

image

AP: చంద్రబాబు నాయకత్వంలో పని చేయడం సంతోషంగా ఉందని డిప్యూటీ CM పవన్ కళ్యాణ్ అన్నారు. NDA శాసనసభా పక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘CM చంద్రబాబు దార్శనికుడు. ఆయనకు భయం లేదు. ముందుచూపు ఆలోచనలతో ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఎన్ని అవమానాలకు గురి చేసినా అధైర్యపడలేదు. CBNను జైలులో ఉంచినప్పుడు షూటింగ్ చేయలేకపోయా. ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్లు పెంచాం. 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చాం’ అని తెలిపారు.

News September 18, 2024

జమిలి ఎన్నికలకు మేం వ్యతిరేకం: ఖర్గే

image

జమిలి ఎన్నికలకు తాము వ్యతిరేకమని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. ప్రజాస్వామ్య దేశంలో జమిలి ఎన్నికలు అసాధ్యమని ఆయన పేర్కొన్నారు. మరోవైపు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఒవైసీ కూడా ఈ ఎన్నికలను తీవ్రంగా వ్యతిరేకించారు. జమిలి ఎన్నికలకు ఎట్టి పరిస్థితుల్లో తమ మద్దతు ఉండబోదని ప్రకటించారు. మల్టిపుల్ ఎన్నికలు నిర్వహించడంలో మోదీ, అమిత్ షాలకు ఏమైనా అభ్యంతరమా? అని ఆయన ప్రశ్నించారు.