News October 14, 2024

ఇజ్రాయెల్‌కు US అత్యాధునిక ఆయుధాల సాయం

image

ఇరాన్ హెచ్చరిస్తున్నా ఇజ్రాయెల్‌కు సాయం చేయడంలో అమెరికా ఏమాత్రం తగ్గడం లేదు. తాజాగా ఇజ్రాయెల్‌కు అత్యాధునికమైన థాడ్(టెర్మినల్ హై ఆల్టిట్యూడ్ ఏరియా డిఫెన్స్)బ్యాటరీతో పాటు సైనిక దళాలను కూడా యూఎస్ పంపింది. శత్రు దేశాలు ప్రయోగించే బాలిస్టిక్ క్షిపణులను థాడ్ కూల్చేస్తుంది. మరోవైపు తమ ప్రజలు, ప్రయోజనాలు కాపాడుకునేందుకు ఎంతకైనా తెగిస్తామని ఇరాన్ హెచ్చరిస్తోంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తత నెలకొంది.

News October 14, 2024

BIG ALERT: భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతంలో నేడు ఏర్పడే అల్పపీడనం ప్రభావంతో 4 రోజులు భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇవాళ విశాఖ, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, కృష్ణ, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది. మంగళ, బుధ, గురువారాల్లో అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది.

News October 14, 2024

ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, గెలిచిన వ్యక్తి సాయిబాబా: నారాయణ

image

TG: అనారోగ్యంతో కన్నుమూసిన ప్రొ.సాయిబాబా పట్ల కేంద్ర వైఖరికి నిరసనగానే నిన్నటి ‘అలయ్ బలయ్‌’లో పాల్గొనలేదని CPI నేత నారాయణ అన్నారు. సాయిబాబా దివ్యాంగుడైనా ప్రభుత్వ నిర్బంధాన్ని ఎదిరించి, రాజీలేని పోరాటం చేసి గెలిచారన్నారు. కానీ తన శరీరంతో ఓడిపోయి, ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా, తన పోరాటాలతో మనతోనే ఉన్నారని తెలిపారు.

News October 14, 2024

భోజనం చేస్తుంటే కాల్పులు జరిపారు: మావోయిస్టులు

image

ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఎన్‌కౌంటర్‌లో చనిపోయింది 31 మంది కాదని, 35 మంది అని మావోయిస్టు పార్టీ తూర్పు బస్తర్ కమిటీ ప్రకటించింది. ‘ఈ నెల 4న భోజనం చేస్తుండగా మావోయిస్టులను భద్రతా బలగాలు చుట్టుముట్టాయి. ఒకే రోజు 11 సార్లు ఎదురుకాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 14 మంది మరణించగా, గాయపడిన వారిని మరుసటిరోజు కాల్చి చంపారు. అమరవీరులను స్మరించుకుంటూ ప్రతి గ్రామంలో సంస్మరణ సభలు నిర్వహిస్తున్నాం’ అని పేర్కొంది.

News October 14, 2024

నేడే మద్యం దుకాణాలకు లాటరీ

image

AP: రాష్ట్రంలోని 3,396 మద్యం దుకాణాలకు వచ్చిన 89,882 దరఖాస్తులను ఇవాళ ఎక్సైజ్ శాఖ లాటరీ తీయనుంది. విజేతలుగా నిలిచిన వారికి రేపు వైన్ షాపులను అప్పగించనుంది. ఎల్లుండి నుంచి రాష్ట్రంలో నూతన మద్యం విధానం అమల్లోకి రానుంది. క్వార్టర్ బాటిల్‌ను రూ.99కే విక్రయించేలా ప్రభుత్వం పాలసీ రూపొందించింది. అలాగే ఫారిన్ లిక్కర్ ఎమ్మార్పీపై చిల్లర ధర లేకుండా సర్దుబాటు చేయనుంది.

News October 14, 2024

బాబా సిద్దిఖీ హత్య.. అసలెవరీ లారెన్స్ బిష్ణోయ్

image

సల్మాన్ ఖాన్ ఫ్రెండ్, మాజీ మంత్రి బాబా సిద్దిఖీ హత్యతో గ్యాంగ్‌స్టర్ లారెన్స్ బిష్ణోయ్ పేరు మార్మోగుతోంది. 30 ఏళ్ల బిష్ణోయ్ చండీగఢ్‌లో చదువుకునే సమయంలో గ్యాంగ్‌స్టర్ గోల్డీ బ్రార్‌తో పరిచయమైంది. ఆ తర్వాత అతడితో కలిసి నేరాలకు పాల్పడ్డాడు. 2012 నుంచి ఆయన ఎక్కువ జైల్లోనే ఉన్నారు. జైలు నుంచి బయటకు వచ్చినప్పుడు అనుచరులను కలుస్తాడు. తమకు ఇష్టమైన కృష్ణ జింకలను చంపాడనే కోపంతో సల్మాన్‌పై పగబట్టాడు.

News October 14, 2024

వెల్లుల్లి తింటే చనిపోయే వ్యాధి గురించి తెలుసా?

image

చాలామందికి వెల్లుల్లి లేకుండా వంట చేయడం కష్టమే. కానీ వెల్లుల్లి పొరపాటున తిన్నా ప్రాణాలకే ప్రమాదం వాటిల్లే ఓ వ్యాధి ఉందంటే నమ్ముతారా? దీని పేరు ‘అక్యూట్ ఇంటెర్మిటెంట్ పోర్ఫైరా’. వెల్లుల్లిలో అధికంగా ఉండే సల్ఫర్ పడనివారికి ఈ సమస్య వస్తుంది. రోజుల తరబడి వాంతులు, మలబద్ధకం, తీవ్రమైన తలనొప్పి దీని లక్షణాలు. ఇవి ఉన్నవారు వెల్లుల్లి సహా కొన్ని ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.

News October 14, 2024

సాధారణ వైద్య సేవలు బంద్: వైద్యుల సంఘం

image

కోల్‌కతాలో నిరాహార దీక్ష చేస్తున్న జూనియర్ డాక్టర్లకు మద్దతుగా సోమవారం నుంచి దేశవ్యాప్తంగా ఆస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు నిలిపివేయాలని ఫెడరేషన్ ఆఫ్ ఆలిండియా మెడికల్ అసోసియేషన్(FAIMA) పిలుపునిచ్చింది. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగించాలని స్పష్టం చేసింది. బెంగాల్ సీఎం మమత నుంచి తమకు సరైన స్పందన రాకపోవడం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.

News October 14, 2024

టర్కిష్ ఎయిర్‌లైన్స్‌పై తాప్సీ ఆగ్రహం

image

టర్కిష్ ఎయిర్ లైన్స్‌పై హీరోయిన్ తాప్సీ ఫైర్ అయ్యారు. విమానం ఆలస్యంపై ముందస్తు సమాచారం ఇవ్వకపోవడంతో ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘విమానం 24 గంటల ఆలస్యం అనేది మీ సమస్య. ప్రయాణికుల సమస్య కాదు. కస్టమర్ కేర్ సర్వీస్ కూడా అందుబాటులో లేదు. దీంతో తోటి ప్రయాణికులు కూడా ఇబ్బందులు పడ్డారు’ అని ఆమె ట్వీట్ చేశారు. కాగా ఇటీవల శృతి హాసన్ కూడా ఇండిగో సంస్థపై మండిపడిన సంగతి తెలిసిందే.

News October 14, 2024

రజినీకాంత్ సినిమాలో ఆమిర్ ఖాన్?

image

సూపర్ స్టార్ రజినీకాంత్‌తో లోకేశ్ కనగరాజ్ తీస్తున్న లేటెస్ట్ సినిమా ‘కూలీ’లో అక్కినేని నాగార్జున, ఉపేంద్ర వంటి స్టార్స్ నటిస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్ కూడా మూవీలో నటిస్తారని కోలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. సినిమా ఒప్పుకొనేందుకు చాలా టైమ్ తీసుకునే ఆమిర్, కూలీలో పాత్ర గురించి లోకేశ్ చెప్పగానే ఓకే అన్నారని సమాచారం. ఈ నెల 15 నుంచి చెన్నైలో షూటింగ్‌లో పాల్గొంటారని తెలుస్తోంది.